ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ప్రధాన నిందితుల రిమాండ్​ పొడిగింపు

author img

By

Published : Nov 25, 2022, 3:15 PM IST

MLAs Poaching Case Update
ఎమ్మెల్యేలకు ఎర కేసు

MLAs Poaching Case Update: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితులైన రామచంద్ర భారతి, నందకుమార్​, సింహయాజీల రిమాండ్​ పొడిగించారు. అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టు వచ్చే నెల 9 వరకు నిందితులకు రిమాండ్‌ విధించింది.

MLAs Poaching Case Update: ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులకు అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టు రిమాండ్‌ పొడిగించింది. వచ్చే నెల 9వ తేదీ వరకూ రిమాండ్‌ విధించింది. ప్రధాన నిందితుడు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజీని సిట్ అధికారులు ఇవాళ అనిశా ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి రిమాండ్‌ పొడిగించారు. అనంతరం ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

మరోవైపు ఈ కేసులో నోటీసులు అందుకున్న మరో ఇద్దరు సిట్‌ ముందుకొచ్చారు. న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌తో పాటు నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ విచారణకు హాజరయ్యారు. ఫాంహౌజ్‌లో పట్టుబడిన వారితో ఉన్న సంబంధాలపై ప్రతాప్‌గౌడ్‌ను.. నందకుమార్‌ ఆర్థిక లావాదేవీలపై చిత్రలేఖను ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరికీ సిట్‌ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

SIT Enquiry in MLAs Poaching Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ విచారణలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఫాంహౌజ్‌లో పట్టుబడిన వారితో పాటు మరో నలుగురిని నిందితుల జాబితాలో చేర్చిన సిట్‌.. ఈ వ్యవహారంతో సంబంధమున్న వారందరికీ నోటీసులు జారీచేస్తూ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌, నందకుమార్‌ భార్య చిత్రలేఖ సిట్‌ ముందు హాజరయ్యారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన తాఖీదుల మేరకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు వీరు చేరుకున్నారు. న్యాయవాది ప్రతాప్‌గౌడ్.. నందకుమార్‌తో పలు లావాదేవీలు నిర్వహించడంతో పాటు ఇద్దరూ కలిసి ప్రయాణాలు సాగించినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నందకుమార్, రామచంద్రభారతి మొబైల్ ఫోన్లలో డేటా సేకరించారు. వీరితో ప్రతాప్‌గౌడ్‌కున్న పరిచయాలపై సిట్ అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది. కాగా సిట్ నోటీసులపై ఇప్పటికే ప్రతాప్‌గౌడ్ హైకోర్టును ఆశ్రయించగా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని సిట్ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.

మరోవైపు నందకుమార్‌కు సంబంధించిన వ్యాపారులు, ఆర్థిక లావాదేవీలు, ఇతర వివరాలను తెలుసుకునేందుకు ఆయన భార్య చిత్రలేఖను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని లావాదేవీలు చిత్రలేఖ బ్యాంకు ఖాతాల నుంచి కూడా జరిగినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. సిట్‌ విచారణకు రావాల్సిన న్యాయవాది శ్రీనివాస్‌.. అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. న్యాయవాది శ్రీనివాస్ ముక్కుకు శస్త్రచికిత్స జరగటంతో ఆస్పత్రిలో ఉన్నందున సిట్ ఎదుట హాజరుకాలేనని సమాచారమిచ్చారు. దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.