ETV Bharat / state

ఆ గుర్తు ఎందుకు మార్చారు.. మునుగోడు ఆర్వోపై ఈసీ సీరియస్

author img

By

Published : Oct 20, 2022, 4:07 PM IST

Munugode
మునుగోడు ఆర్వోపై ఈసీ సీరియస్

మునుగోడు ఉపఎన్నికలో యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ గుర్తు మార్పు వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. రిటర్నింగ్ అధికారి విధినిర్వహణలో లోపం ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

EC To Modify Symbols List Munugode Candidates: మునుగోడు ఉపఎన్నికలో యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ గుర్తు మార్పు వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. రిటర్నింగ్ అధికారి తనకు లేని అధికారాన్ని ఉపయోగించి గుర్తు మార్చారని ఆక్షేపించిన ఈసీ.. విధినిర్వహణలో తీవ్ర లోపం ఉన్నట్లు మండిపడింది. శివకుమార్ ఫిర్యాదు ఆధారంగా నివేదికలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. మొదట రోడ్ రోలర్ గుర్తు కేటాయించి ఆ తర్వాత కనీసం ఎన్నికల పరిశీలకునికి కూడా ఎలాంటి సమాచారం లేకుండా గుర్తు మార్చి బేబీవాకర్ ఇచ్చినట్లు తేల్చింది.

గుర్తు మార్పు విషయమై సంబంధిత అభ్యర్థికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఈసీ పేర్కొంది. లేని అధికారాన్ని ఉపయోగించి రిటర్నింగ్ అధికారి గుర్తు మార్చడం తగదన్న ఈసీ.. శివకుమార్ కు ముందు కేటాయించిన రోడ్ రోలర్​కు కొనసాగిస్తూ ఫారం 7ఏను సవరించాలని ఆదేశించింది. సవరించిన ఫారం 7ఏను తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రచురించాలని ఈసీకి నివేదిక పంపాలని ఆదేశించింది. విధి నిర్వహణలో ఆర్వో లోపాలున్నాయన్న కేంద్ర ఎన్నికల సంఘం.. గుర్తుల కేటాయింపు వ్యవహారంలో మార్గదర్శకాలను పాటించలేదని ఆక్షేపించింది.

గుర్తు మారుస్తూ ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో రిటర్నింగ్ అధికారి నుంచి వివరణ తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఈసీ ఆదేశించింది. ఆర్వో వివరణ ఇవాళ సాయంత్రం అయిదు గంటల్లోగా కమిషన్​కు చేరాలని స్పష్టం చేసింది. దాని ఆధారంగా ఈసీ తగిన నిర్ణయం తీసుకోనుంది. రిటర్నింగ్ అధికారిని మార్చే అవకాశం ఉందని అంటున్నారు. అటు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో అర్ధరాత్రి తర్వాత శివకుమార్​కు తిరిగి రోడ్ రోలర్ గుర్తు కేటాయిస్తూ ఫారం 7ఏను సవరించారు. గెజిట్ నోటిఫికేషన్​లో ప్రచురించడంతో పాటు బ్యాలెట్ పత్రం ముద్రణకు కూడా ఉపక్రమించారు.

అసలేం జరిగిదంటే: మునుగోడు ఉప ఎన్నికలో గుర్తుల వివాదం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. తొలుత రోడ్‌రోలర్ కేటాయించి ఆ తర్వాత గుర్తు మార్చారని యుగతులసి పార్టీ అభ్యర్థి ఈసీకి ఫిర్యాదు చేశారు. రోడ్‌రోలర్‌ కేటాయిస్తూ ఆర్వో సంతకం చేసిన కాపీని ఫిర్యాదుకు జతచేసినట్టు సమాచారం. మరో స్వతంత్ర అభ్యర్థి, తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి పోటీ చేస్తున్న జానయ్య గుర్తుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

స్పందించిన ఈసీ అధికారులు ఆ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డితో పాటు ఆర్వోను ఆదేశించింది. గుర్తుల కేటాయింపుపై ఈసీ అధికారులు వివరణ కోరారన్న కలెక్టర్ వినయ్‌ కృష్ణారెడ్డి, కె.శివకుమార్‌కు తిరిగి రోడ్‌ రోలర్‌గుర్తు కేటాయించాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. ఇప్పటికే బ్యాలెట్‌లను ప్రచురణకు పంపినట్లు.. ఒకవేళ ఏమైనా మార్పులు చేయాలని ఈసీ ఆదేశిస్తే మారుస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.