ETV Bharat / state

మద్యం కుంభకోణం ఆరోపణలపై టీడీపీ ఆగ్రహం- అజేయకల్లం ప్రతిపాదిస్తే అప్పటి సీఎంకు ఏం సంబంధం?

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 10:45 AM IST

TDP Angry Over the Allegations of Liquor Scam: చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం పెట్టింది తప్పుడు కేసు అని తెలుగుదేశం మండిపడింది. అప్పటి రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజేయ కల్లం పంపిన ప్రతిపాదన మేరకే నాటి మంత్రి వర్గం తీసుకుందన్నారు. దానికి చంద్రబాబు ఎలా బాధ్యులవుతారని తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు.

liquor_scam
liquor_scam

మద్యం కుంభకోణం ఆరోపణలపై టీడీపీ ఆగ్రహం- అజేయకల్లం ప్రతిపాదిస్తే అప్పటి సీఎంకు ఏం సంబంధం?

TDP Angry Over the Allegations of Liquor Scam: తెలుగుదేశం హయాంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎస్పీవై ఆగ్రో సంస్థ ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయిల్ని వాయిదాల్లో చెల్లించేందుకు అనుమతి, వడ్డీ ఎప్పటి నుంచి వసూలు చేయాలన్న అంశాలపై అప్పటి రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయకల్లం పంపిన ప్రతిపాదన మేరకు నాటి మంత్రివర్గం నిర్ణయం తీసుకుందే తప్ప.. అది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరి నిర్ణయం కాదని తెలుగుదేశం పేర్కొంది.

ఎక్సైజ్‌ శాఖ ఏ మద్యం బ్రాండ్లకు అనుమతివ్వాలో, బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఏ కంపెనీల మద్యానికి ఆర్డర్లు ఇవ్వాలో కూడా ముఖ్యమంత్రి చెబుతారా అని ప్రశ్నించింది. ఇంతకంటే అసంబద్ధమైన ఆరోపణ, అభియోగం ఉంటాయా? అని మండిపడింది. పనికిమాలిన, ఊహాజనిత ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమంగా మద్యం కేసు బనాయించిందనడానికి అప్పటి నోట్‌ఫైల్స్‌, కాగ్‌ నివేదికలే నిదర్శనమని పేర్కొంది. ప్రభుత్వ అభియోగాల్ని, వాస్తవాల్ని పరిశీలిస్తే కేసులోని డొల్లతనం అర్థమవుతోందని తెలుగుదేశం ఓ ప్రకటనలో వెల్లడించింది. అందులో సీఐడీ మోపిన అభియోగాలను పేర్కొన్న తెలుగుదేశం.. వాస్తవాలతో వాటికి బదులిచ్చింది.

ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్ - ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ప్రతిపాదన

నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు అప్పటి ప్రభుత్వం అనుచిత లబ్ధి చేకూర్చిందన్నది సీఐడీ అభియోగం. లైసెన్సు ఫీజు బకాయిల్ని వాయిదా పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పించిందని.. బకాయిలపై చెల్లించాల్సిన వడ్డీని మొదటి నుంచీ కాకుండా, 2015 నవంబరు 27 నుంచి మాత్రమే వసూలు చేయడం వల్ల ఎస్పీవై ఆగ్రోకు 15 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని సీఐడీ ఆరోపించింది. ఆ సంస్థ ప్రమోటర్‌ ఎస్పీవై రెడ్డి అప్పట్లో నంద్యాల ఎంపీగా ఉన్నారని.. అది క్విడ్‌ప్రోకో అని అభియోగం మోపింది. ఈ అభియోగాన్ని తెలుగుదేశం కొట్టిపారేసింది. ఎస్పీవై సంస్థ బకాయిల్ని వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించడం, వడ్డీ ఎప్పటి నుంచి వసూలు చేయాలన్న అంశాల్లో న్యాయశాఖ అభిప్రాయం మేరకు.. కేబినెట్‌ తీర్మానం ద్వారా నిర్ణయం తీసుకున్నారని బదులిచ్చింది. ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్‌కు 2008లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వమే అనుమతులిచ్చిందని స్పష్టం చేసింది.

2013 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుమతుల్ని పొడిగిస్తూ వచ్చిందని వెల్లడించింది. డిస్టిలరీ కార్యకలాపాల్ని ప్రారంభించకపోవడంతో.. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఆ అనుమతుల్ని రద్దు చేసిందని తెలిపింది. ఎస్పీవై ఆగ్రో కోర్టుకు వెళ్లడంతో.. కోర్టు ఆదేశాల మేరకు పునరుద్ధరించిందని వివరించింది. కొత్త ఫీజులు వసూలు చేయాలన్న కోర్టు ఆదేశాల మేరకు ఆ సంస్థకు నోటీసులు ఇచ్చిందని.. 51 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉండగా.. 12 వాయిదాల్లో చెల్లించేందుకు అనుమతివ్వాలని.. ఆ సంస్థ కోరినట్లు తెలుగుదేశం పేర్కొంది.

నాడు ప్రతిపక్ష నేతగా జగన్‌ వ్యతిరేకించలేదు - నేడు రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు

దానిపై అప్పటి మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని తెలిపింది. వడ్డీ ఎప్పటి నుంచి వసూలు చేయాలన్న ప్రశ్న తలెత్తినప్పుడు.. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన 2015 నవంబరు 27 నుంచి వసూలు చేయాలని న్యాయశాఖ, ఆర్థికశాఖల అభిప్రాయం తీసుకుని.. అప్పటి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో అజేయకల్లం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని వివరించింది. దాని ఆధారంగా కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని తెలుగుదేశం స్పష్టం చేసింది.

మద్యం దుకాణాలు, బార్లకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేయడం వల్ల.. ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందన్నది సీఐడీ అభియోగం. అప్పటి ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ మంత్రుల ఆమోదంతోనే ఆ నిర్ణయాలు తీసుకున్నారని.. అవన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని సీఐడీ ఆరోపణలు చేసింది. దీనిపై బదులిచ్చిన తెలుగుదేశం.. ప్రివిలేజ్‌ ఫీజు రద్దుకు సంబంధించిన దస్త్రం ముఖ్యమంత్రికి వెళ్లలేదని.. అది కింది స్థాయిలో తీసుకునే నిర్ణయమని పేర్కొంది. ఆ ఫీజు రద్దు చేయడం వల్ల మద్యం అమ్మకాలు పెరిగి ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చిందని కాగ్‌ నిర్ధారించిందన్న విషయాన్ని గుర్తుచేసింది. ప్రివిలేజ్‌ ఫీజును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టారని.. విభజన తర్వాత దానికి ప్రాధాన్యం తగ్గిందని పేర్కొంది. ప్రివిలేజ్‌ ఫీజు వల్ల రాష్ట్రంలోకి మద్యం అక్రమ రవాణా పెరిగిందని తెలిపింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మడం పెరిగిందని.. దాన్ని నిరోధించేందుకు అప్పటి ప్రభుత్వం ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేసిందని తెలుగుదేశం వివరించింది.

CID on Chandrababu Liquor Case: మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ విచారణ.."అప్పటి వరకు అరెస్టు చేయమన్న సీఐడీ"

నాలుగైదు కంపెనీలు ఉత్పత్తి చేసే మద్యానికి మాత్రమే 70 శాతం ఆర్డర్లు ఇచ్చారన్నది తెలుగుదేశం ప్రభుత్వంపై సీఐడీ మోపిన మరో అభియోగం. దీనిపై వాస్తవాన్ని వివరిస్తూ.. అప్పట్లో ఉన్నవన్నీ ప్రైవేటు మద్యం దుకాణాలేనని.. కొన్ని ఎంపిక చేసిన బ్రాండ్ల మద్యాన్ని మాత్రమే బెవరేజెస్‌ కార్పొరేషన్‌ కొని వాటికి సరఫరా చేసేందుకు అవకాశమే లేదని తెలుగుదేశం వివరించింది. అప్పట్లో వివిధ బ్రాండ్ల మద్యాన్ని ఎపీస్​బీసీల్(APSBCL) అందుబాటులో ఉంచేదని తెలిపింది. డిమాండ్‌ను బట్టి మద్యం దుకాణాలు వాటిని తీసుకెళ్లేవని.. విక్రయాలు జరిగిన మద్యానికే ఆయా కంపెనీలకు ఎపీస్​బీసీల్ చెల్లింపులు జరిపేదని వెల్లడించింది. డిమాండ్‌ లేక మిగిలిపోయిన మద్యం సీసాల్ని ఆయా కంపెనీలు వెనక్కు తీసుకెళ్లిపోయేవని పేర్కొంది.

ఎక్సైజ్‌ కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వివిధ డిస్టిలరీల ఏర్పాటుకు అనుమతిచ్చారని సీబీఐ అభియోగం మోపింది. దీనికి బదులిస్తూ.. కొత్త డిస్టిలరీల ఏర్పాటుకు, ఉన్నవాటి విస్తరణకు అర్హత ఉన్నవారందరికీ నిబంధనల ప్రకారం గత ప్రభుత్వం అనుమతులిచ్చిందని తెలుగుదేశం వివరించింది. ఆ విషయంలో ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపలేదని కాగ్‌ నిర్ధారించిందన్న విషయాన్ని ప్రస్తావించింది. 2019 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత హడావుడిగా పలు కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతిచ్చారని.. ఆయా కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేందుకే అలా చేశారన్నది సీఐడీ ఆరోపణ. మద్యం బ్రాండ్‌కు డిమాండ్‌ను బట్టి అనుమతులు ఇస్తారని.. అది ఎపీస్​బీసీల్ వ్యవహారమని తెలుగుదేశం స్పష్టం చేసింది. దానిలో సీఎంకు ఏం ప్రమేయం ఉంటుందని ప్రశ్నించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.