ETV Bharat / state

జగన్​తో కలిసి విజయసాయి పెట్టుబడులు పెట్టించారు - ఐసీఏఐ క్రమశిక్షణ కమిటీ నిర్ధారణ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2023, 12:53 PM IST

ICAI_Disciplinary_Committee_About_MP_Vijaya_Sai_Reddy
ICAI_Disciplinary_Committee_About_MP_Vijaya_Sai_Reddy

ICAI Disciplinary Committee About MP Vijaya Sai Reddy: ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌గా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఐసీఏఐ డిసిప్లినరీ కమిటీ పేర్కొంది. ఉల్లంఘనపై విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వగా, విజయసాయ తెలంగాణ హైకోర్టులో స్టే పొందారు. దీనిపై మరోసారి నేడు విచారణ జరగనుంది.

ICAI Disciplinary Committee About MP Vijaya Sai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌గా వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా క్రమశిక్షణ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి, ఆయన గ్రూపు కంపెనీకు ఆర్థిక సలహాదారుగా ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ సమావేశం తీర్మానించింది. వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై విచారణకు హాజరు కావలంటూ అక్టోబర్‌ 23న నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుపై విజయసాయి రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు.

ఈ పిటిషన్‌ మంగళవారం మరోసారి విచారణ జరగనుంది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో అరబిందో, హెటరోలకు భూకేటాయింపులు , జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు, రాంకీ ఫార్మా, వాన్ పిక్‌ ప్రాజెక్టులు, దాల్మియా సిమెంట్‌ కేసుల్లో సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రాల్లోని అంశాలను, అందులో సాక్షుల వాగ్మూలాలను ఐసీఏఐ డిసిప్లినరీ డైరెక్టరేట్‌ పరిగణనలోకి తీసుకొని తన ప్రాథమిక అభిప్రాయాన్ని వెల్లడించింది.

ఎంపీ విజయసాయి రెడ్డి సెల్​ఫోన్ మిస్​.. ఏం జరిగింది..?

వీటితో పాటు జగతి పబ్లికేషన్స్‌ విలువ ముదింపుపై డెలాయిట్‌ ఇచ్చిన నివేదిక, విజయసాయి రెడ్డి చిరునామాలపై ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. 2017, 2021, 2022ల్లో మూడు ధపాలుగా వెల్లడించిన ప్రాథమిక అభిప్రాయాల్లో విజయసాయి రెడ్డి దుష్ర్పవర్తనకు పాల్పడినట్లు వెల్లడించింది. ఇదే అభిప్రాయంతో క్రమ శిక్షణ కమిటీ ఏకీభవిస్తూ తుది నిర్ణయం నిమిత్తం విచారణ చేపట్టాలని నిర్ణయించి విజయసాయి రెడ్డికి తాఖీదు పంపింది. ప్రాథమిక నిర్ణయం వెలువరించడానికి పరిగణనలోకి తీసుకున్న అంశాలు ఇలా ఉన్నాయి.

ఏపీలో సమస్య లేకుండా సిమెంట్ పరిశ్రమ నిర్మించుకోవడానికి జగన్‌కు చెందిన జగతిలో 5 కోట్ల రుపాయలు పెట్టుబడి పెట్టాలని జయలక్ష్మీ టెక్స్‌టైల్‌ అధినేత కన్నన్‌పై సాయిరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఆయన 2008 ఆగస్టు 5న ఐదు కోట్ల రుపాయలు పెట్టుబడి పెట్టారు. వాటిపై కన్నన్‌కు ఎలాంటి డివిడెంట్‌ అందలేదు. పెట్టుబడి కూడా వెనక్కి రాలేదు. 2008 నవంబరులో ఎన్నారై మాధవ్‌ రామచంద్రకు జగతి నుంచి పెట్టుబడులు పెడుతూ ఫోన్‌ వచ్చింది.

తరువాత కంపెనీ వివరాలతోపాటు డెలాయిట్‌ నివేదిక అందింది. విజయసాయి మాటలతోపాటు డెలాయిట్‌ నివేదికను విశ్వసించి జగతిలో పెట్టుబడులు పెట్టడానికి మాధవ్‌ రామచంద్ర నిర్ణయించుకున్నారు. 19 కోట్ల 66 లక్షల రుపాయలు జగతికి చెల్లించారు. తన పెట్టుబడులు వెనిక్కి తీసుకోవడానికి పలు ప్రయత్నాలు చేశారు. జగతి నుంచి ఆయనకు ఎలాంటి సమాధానం రాలేదు. వృత్తిపరమైన సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జగన్‌మోహన్‌ రెడ్డి, ఆయన కంపెనీలకు దురుద్దేశపూరితంగా సహకరించారని పేర్కొంది.

ఎంపీ విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్‌.. పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదు

దాల్మియా సిమెంట్స్‌ వాటాల విక్రయం ద్వారా వచ్చిన సొమ్ము తిరిగి పొందేందుకు ఈమెయిళ్లలో సంకేత భాషను సాయిరెడ్డి వాడినట్లు సీబీఐ అభియోగ పత్రంలో పేర్కొంది. 2010 డిసెంబరు 31వ తేదీన పంపిన ఈమెయిల్‌లో 3 వేల 500 టన్నుల స్టాక్‌ అందింది. 2011 జనవరి నాటికి మరో 500 టన్నులు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దాల్మియాలో జేఆర్‌ (జగన్‌రెడ్డి) ఖాతాను పరిశీలిస్తే 35 కోట్ల రూపాయలు అందాయని, కోట్లకు బదులు టన్నులు అనే సంకేత భాషను వాడారని 2010-11 మధ్య జగన్‌కు నిధులను సమకూర్చడంలో సాయిరెడ్డి కీలకపాత్ర పోషించారని సీబీఐ పేర్కొంది.

జగన్‌తో కలిసి పెట్టుబడులు రాబట్టడానికి సాయిరెడ్డి కీలక పాత్ర పోషించారని ఐసీఏఐ పేర్కొంది. డైరెక్టర్‌గా రాజీనామా చేసిన అనంతరం సైతం ఆ కంపెనీతో, జగన్‌తో సన్నిహితంగా ఉంటూ పెట్టుబడులు రాబట్టారని తెలిపింది. మదింపు రిపోర్టును తారుమారు చేయడంలో ఆయన పాత్ర స్పష్టంగా ఉందని పేర్కొంది. ఈ సమయంలో ప్రాక్టీసింగ్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉన్నారని, వృత్తిపరమైన సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జగన్‌, ఆయన సంస్థలకు సహకరించారని, ఇది ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌గా ఉండి చేయాల్సింది కాదని పేర్కొంది. ఈ కారణాలతో విజయసాయి రెడ్డి వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని ప్రాథమికంగా తేల్చి చెప్పింది.

సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ - కొలిక్కి వచ్చిన వాదనలు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.