ETV Bharat / state

ఛీఛీ.. చీపుర్ల నిధులూ మింగేస్తున్నారు.. అనంతపురం కార్పొరేషన్​ అవినీతి కథ

author img

By

Published : Jan 30, 2023, 4:26 PM IST

పారిశుధ్య నిధుల్లో నగర పాలక సంస్థ అధికారులు చేతివాటం
పారిశుధ్య నిధుల్లో నగర పాలక సంస్థ అధికారులు చేతివాటం

Corruption in sanitation funds : పారిశుద్ధ్య నిధుల్లో నగర పాలక సంస్థ అధికారులు చేతివాటం చూపుతున్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ.. అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తోంది. ఇదే అదునుగా అవినీతికి తెరలేపిన అధికారులు.. పారిశుద్ధ్య కార్మికులకు అందించాల్సిన చీపుర్లనూ వారితోనే కొనుగోలు చేయించి లెక్కల్లో చూపుతున్నారు. నగరాన్ని శుభ్రంగా ఉంచకపోతే తమ ఉద్యోగం పోతుందని నిరుపేద కార్మికులు స్వంతంగా చీపుర్లు, తట్టలు కొనుగోలు చేస్తున్న దయనీయ పరిస్థితి నెలకొంది.

పారిశుధ్య నిధుల్లో నగర పాలక సంస్థ అధికారులు చేతివాటం

Corruption in sanitation funds : నగరపాలక సంస్థల పరిధిలో పారిశుద్ధ్య పనులకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఇందుకోసం స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద నగరాలను శుభ్రంగా ఉంచే పలు పథకాలు అమలు చేస్తూ నగరపాలక సంస్థలకు నిధులు ఇస్తోంది. అయితే, ఆ నిధులు ఏమవుతున్నాయో కానీ.. పారిశుద్ధ్య కార్మికులు చీపుర్లు సైతం తమ వేతనాల నుంచి కొనుగోలు చేసి నగరాన్ని శుభ్రం చేస్తున్న దయనీయ పరిస్థితి నెలకొంది. పారిశుద్ధ్య పరికరాలు కొనుగోలు చేస్తున్నామని చెబుతున్న అనంతపురం నగరపాలక సంస్థ అధికారులు లక్షల రూపాయల నిధులు కాజేస్తున్నారు. చివరకు నగర దారులను శుభ్రం చేసే చీపుర్ల సొమ్ము కూడా కాజేస్తున్న అనంత నగరపాలిక అధికారులు.. కార్మికులే చీపుర్లు కొని పనులు చేసుకుంటేనే ఉద్యోగాల్లో ఉంటారని హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి.

కార్మికులతోనే కొనుగోళ్లు : అనంతపురం నగరపాలక సంస్థలో చీపుర్ల నిధులు కాజేస్తున్నారు. నగరాన్ని శుభ్రంగా ఉంచకపోతే తమ ఉద్యోగం పోతుందని నిరుపేద కార్మికులు స్వంతంగా చీపుర్లు, తట్టలు కొనుగోలు చేస్తున్న దయనీయ పరిస్థితి నెలకొంది. నగరపాలక సంస్థలో దాదాపు ఐదు లక్షల మంది జనాభా, వందకు పైగా కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీల్లో రహదారులు, మురుగు కాల్వలు శుభ్రం చేయటానికి 495 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వీరితో పాటు ఇంజినీరింగ్ కార్మికులు, శాశ్వత కార్మికులు మరో రెండు వందల మంది వరకు ఉన్నారు. వీరికి పరికరాలను ఎప్పటికప్పుడు అందించాల్సిన అధికారులు కనీసం చీపుర్లు కూడా ఇవ్వడం లేదు. నగరపాలక సంస్థకు నిధుల కొరత ఉందేమో అనుకుంటే పొరపాటే.. ఏటా పారిశుద్ధ్య పరికరాలు లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు లెక్కల్లో చూపుతున్న నగరపాలక సంస్థ అధికారులు, ఆ కొనుగోళ్లన్నీ కాగితాలపైనే ఉంటున్నాయి. తమకొచ్చే రూ.13వేల జీతం నుంచే వారానికి రెండు వందలు ఖర్చుచేసి రెండు చీపుర్లు కొంటున్నట్లు నిరుపేద కార్మికులు చెబుతున్నారు.

స.హ.చట్టం దరఖాస్తుతో వెలుగులోకి.. : నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పరికరాల కొనుగోలుకు ఏటా బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు. ఆ మేరకు పెద్దఎత్తున పరికరాలు కొనుగోలు చేస్తున్నట్లు చూపుతున్నారు. అయితే కార్మికులకు అవి ఏమాత్రం అందడం లేదు. కనీసం చీపుర్లు, మురుగు కాల్వలు శుభ్రం చేయటానికి వినియోగించే పరికరాలు కూడా ఇవ్వడం లేదు. కార్మికుల ఆవేదన చూసి నగరంలోని ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద అధికారులను సమాచారం కోరడంతో పారిశుద్ధ్య కార్మికులకు అందించే పరికరాల సొమ్మును ఎలా కాజేస్తున్నారో తెలుస్తోంది.

2019-20లో పారిశుద్ధ్య పరికరాల కోసం బడ్జెట్​లో రూ.15 లక్షలు కేటాయించగా.. ఆ ఏడాది 11 లక్షల 54వేల 402 రూపాయలతో కొనుగోలు చేశారు. 2021-22లో 50 లక్షలు కేటాయించి, 50 లక్షల 90వేల 237 రూపాయలు ఖర్చుచేశారు.

కరోనా సమయంలో సైతం తామే చీపుర్లు, చెత్త ఎత్తే తట్టలు కొనుగోలు చేశాం. కార్మికులకు ఇచ్చే పరికరాల సొమ్ము కాజేస్తున్నారు.-కార్మిక సంఘ నేతలు

కరోనా సాకుతో కోటికి పైగా.. : కరోనా సాకు చూపి 2020-21లో ఏకంగా కోటి రూపాయలకు పైగా కొనుగోలు చేశారు. ఆ ఏడాది కరోనా లాకౌడౌన్ ఉండటంతో వంద మంది కార్మికులను అదనంగా నియమించుకున్నట్లు చూపిన అధికారులు.. వాళ్లందరికీ పరికరాలు ఇవ్వటానికి కోటి రూపాయలకుపైగా ఖర్చు చూపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.