Shashi Tharoor on Umran Malik: ప్రస్తుత టీ20 మెగా లీగ్లో హైదరాబాద్ తరఫున ఆడుతున్న స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్ చెలరేగిపోతున్నాడు. పదునైన పేస్తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. ముఖ్యంగా ఆదివారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చెలరేగాడు. ఇన్నింగ్స్ 20వ ఓవర్లో 3 వికెట్లు తీసి ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కించుకున్నాడు. కాగా ఈ స్పీడ్ గన్ ఆట తీరుకు ముగ్ధుడైన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. ఉమ్రాన్ను టీమ్ఇండియాలోకి తీసుకోవాలంటూ కోరారు.
![Shashi Tharoor on Umran Malik](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15046184_1.jpg)
"ఉమ్రాన్ మాలిక్ను త్వరగా భారత జట్టులోకి తీసుకోవాలి. అద్భుతమైన ప్రతిభావంతుడు. అతడిలో ఉడుకు రక్తం ఉరకలేస్తోంది. టెస్టు మ్యాచ్ల కోసం అతడిని ఇంగ్లాండ్కు తీసుకెళ్లండి. బుమ్రాతో అతడు కలిసి బౌలింగ్ చేస్తే ఆంగ్లేయులు బెంబేలెత్తిపోతారు" అంటూ శశి థరూర్ ట్వీట్ చేశారు.
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ విజయానికి బాటలు వేశాడు ఉమ్రాన్. ఏడో ఓవర్లో జితేశ్ శర్మను బుట్టలో వేసుకున్న పేసర్.. ఇక 20వ ఓవర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. టోర్నీ చరిత్రలోనే చివరి ఓవర్ను మెయిడిన్ చేసిన నాలుగో వ్యక్తిగా అవతరించాడు. అంతకుముందు ఇర్ఫాన్ పఠాన్, లసిత్ మలింగ, జయ్దేవ్ ఉనద్కత్ మాత్రమే ఈ ఘనత సాధించారు.
ఇదీ చూడండి: బంతులా అవి బుల్లెట్లా?.. 145 కి.మీకిపైగా వేగంతో విసిరిన వీరులు వీరే!