ETV Bharat / sports

IND vs WI: విజృంభించిన భారత బౌలర్లు.. తొలి టీ20లో విండీస్‌ చిత్తు

author img

By

Published : Jul 29, 2022, 11:58 PM IST

Updated : Jul 30, 2022, 2:48 AM IST

ఫార్మాట్‌ మారినా టీమ్‌ఇండియా జోరులో మార్పేమీ లేదు. ఆతిథ్య వెస్టిండీస్‌ను ఇప్పటికే వన్డే సిరీస్‌లో మట్టికరిపించిన భారత్‌.. టీ20 సిరీస్‌నూ ఘనంగా ఆరంభించింది. బ్యాటింగ్‌లో కాస్త తడబడ్డా పుంజుకుని భారీ స్కోరు సాధించిన రోహిత్‌ సేన.. బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో విండీస్‌ను సునాయాసంగా చుట్టేసింది.

తొలి టీ20లో విండీస్‌ చిత్తు
తొలి టీ20లో విండీస్‌ చిత్తు

వెస్టిండీస్‌లో వెస్టిండీస్‌కు మరో ఓటమి రుచి చూపింది భారత్‌. అయిదు టీ20ల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 68 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. శుక్రవారం రోహిత్‌ శర్మ (64; 44 బంతుల్లో 7×4, 2×6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దినేశ్‌ కార్తీక్‌ (41; 19 బంతుల్లో 4×4, 2×6) మెరుపులు తోడవడంతో మొదట భారత్‌ 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో అకీల్‌ హొసీన్‌ (1/14), అల్జారి జోసెఫ్‌ (2/46) రాణించారు. అనంతరం అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/24), రవి బిష్ణోయ్‌ (2/26), అశ్విన్‌ (2/22), భువనేశ్వర్‌ కుమార్‌ (1/11) విజృంభించడంతో విండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులే చేయగలిగింది.

ఒక్కరైనా..: లక్ష్యం పెద్దదే అయినా.. విధ్వంసక బ్యాట్స్‌మెన్‌తో నిండిన విండీస్‌ ముందు అదంత సురక్షితం కాదని, టీ20ల్లో దాని ఆటతీరు వేరుగా ఉంటుందని అనుకుంటే.. ఆతిథ్య జట్టు మరీ పేలవంగా ఆడింది. 20 పరుగులు చేసిన బ్రూక్స్‌ జట్టులో టాప్‌స్కోరర్‌ అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్కరూ నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. స్ట్రైక్‌ రొటేట్‌ చేయలేదు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడి బంతులేసిన భారత బౌలర్లందరూ చక్కటి ఫలితం రాబట్టారు. అడ్డంగా షాట్లు ఆడబోయిన విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టేశారు. ఆరంభం నుంచే ఎదురుదాడికి ప్రయత్నించిన మేయర్స్‌ (15)ను ఔట్‌ చేయడం ద్వారా అర్ష్‌దీప్‌ పతనానికి తెర తీస్తే.. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హోల్డర్‌ (0)ను జడేజా బౌల్డ్‌ చేశాడు. జడేజా ఊపు చూసి రోహిత్‌ ఎక్కువగా స్పిన్నర్లకే బంతి ఇచ్చాడు. అశ్విన్‌, రవి బిష్ణోయ్‌ విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టి వికెట్లు రాబట్టారు. పూరన్‌ (18), రోమన్‌ పావెల్‌ (14), హెట్‌మయర్‌ (14) జట్టు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టలేదు. హార్దిక్‌ మినహా అందరూ వికెట్లు తీయడంతో విండీస్‌ పతనం వేగంగా సాగింది.

కెప్టెన్‌ నడిపిస్తే.. ఫినిషర్‌ ముగించాడు: అంతకుముందు టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. భారత ఇన్నింగ్స్‌ ఒడుదొడుకులతో సాగింది. ఓ ఎండ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పట్టుదలతో నిలిచి స్కోరు బోర్డును ముందుకు నడిపించగా.. మరో ఎండ్‌లో క్రమం తప్పకుండా వికెట్లు పడ్డాయి. గత కొన్ని సిరీస్‌ల నుంచి తరచుగా ఓపెనర్లను మారుస్తున్న టీమ్‌ఇండియా.. ఇంగ్లాండ్‌లో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పంత్‌ను కాదని, ఈసారి సూర్యకుమార్‌కు అవకాశమిచ్చింది. కానీ అతను ఈ స్థానంలో సౌకర్యంగా కనిపించలేదు. కొన్ని షాట్లు ఆడినప్పటికీ.. ఎప్పుడెప్పుడు పెవిలియన్‌ చేరిపోదామా అన్నట్లు సాగింది అతడి ఇన్నింగ్స్‌. హొసీన్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు బంతుల్లో ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న సూర్యకుమార్‌ (24; 16 బంతుల్లో 3×4, 1×6).. చివరికి అతడి బౌలింగ్‌లోనే హోల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. శ్రేయస్‌ (0) వచ్చీ రాగానే మెకాయ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. పంత్‌ (14), హార్దిక్‌ (1) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవకపోవడంతో భారత్‌కు ఇబ్బందులు తప్పలేదు. కానీ రోహిత్‌ మాత్రం తనదైన శైలిలో మైదానం నలుమూలలా చక్కటి షాట్లు ఆడుతూ.. విండీస్‌ పూర్తిగా పైచేయి సాధించకుండా చూశాడు. 35 బంతుల్లో అతడి అర్ధశతకం పూర్తయింది. 14 ఓవర్లకు భారత్‌ 124 పరుగులు చేస్తే.. అందులో రోహిత్‌ వాటా 63. తర్వాతి ఓవర్లో హోల్డర్‌.. రోహిత్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. కెప్టెన్‌ ఔటయ్యాక స్కోరు వేగం పడిపోయింది. 14-16 మధ్య 3 ఓవర్లలో భారత్‌ 23 పరుగులే చేసింది. ఈ దశలో స్కోరు 170కి చేరితే ఎక్కువ అనిపించింది. కానీ చాలా మ్యాచ్‌ల తర్వాత ‘ఫినిషర్‌’ పాత్రకు దినేశ్‌ కార్తీక్‌ న్యాయం చేస్తూ చెలరేగి ఆడడం.. అశ్విన్‌ (13 నాటౌట్‌) అండగా నిలవడంతో భారత్‌ అనూహ్యంగా 190 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముగించింది.

ఇవీ చూడండి

Last Updated :Jul 30, 2022, 2:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.