ETV Bharat / opinion

పెచ్చరిల్లుతున్న హేయనేరాలు.. జాతి ప్రగతి మాయం!

author img

By

Published : Sep 17, 2021, 5:56 AM IST

రోజురోజుకూ సమాజంలో పెరిగిపోతున్న నేరప్రవృత్తి, విచ్చలవిడితనానికి దేశం కుంగిపోతోంది. రాష్ట్రాలు, సంస్క్రతులతో సంబంధం లేకుండా విశృంఖలంగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దాడులు, చోరీలు సమాజ భద్రతకు సవాలు విసురుతున్నాయి. ప్రతీనిముషం ఎక్కడోచోట ఏదో రూపంలో వెలుగుచూస్తున్న నేరాలు జాతి ప్రగతిని దిగజారుస్తున్నాయి.

crimes
crimes

నేరం ఏదైనా, ఏ కారణంతో జరిగినా- మానవత్వానికే అది మాయని మచ్చ అని స్పష్టీకరించారు జాతిపిత మహాత్మా గాంధీ. ఆ అహింసామూర్తి అడుగుజాడల్లో స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అందిపుచ్చుకొన్న ఇండియాలో నేర పరంపర మానవ ప్రశాంతతకు గొడ్డలిపెట్టుగా పరిణమిస్తోంది. జాతి ప్రగతినే అపహసిస్తోంది. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజా వార్షిక నివేదిక- భారత్‌లో నానాటికీ పెచ్చుమీరుతున్న హింసా ప్రవృత్తిని మరోమారు కళ్లకు కట్టింది. గతేడాది దేశవ్యాప్తంగా అరవై ఆరు లక్షలకు పైగా నేరాలు వెలుగుచూశాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇవి 28శాతం అధికం. కొవిడ్‌ ఆంక్షల ఉల్లంఘనులపై నమోదైన కేసుల వాటా ఈసారి ఎక్కువ. హేయ నేరాలూ పెచ్చరిల్లాయి. మనిషిలోని రాక్షసత్వానికి నిదర్శనంగా నిలిచే హత్యలు 29వేలకు పైగా చోటుచేసుకొన్నాయి. ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాలూ తొమ్మిది శాతానికి పైగా పెరిగాయి. దేశీయంగా అపహరణ ఘటనలు కొంతవరకు తగ్గుముఖం పట్టినా, వాటిలో 62శాతం బాధితులు బాలలే.

అంతులేని నేరప్రవృత్తి..

ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది నేరాలు ఎకాయెకి 63శాతానికి పైగా 'వృద్ధి'ని నమోదుచేశాయి. మానవ అక్రమ రవాణాలో తెలంగాణ రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇండియాలో నిరుడు 947 మానవ అక్రమ రవాణా ఉదంతాలు బయటపడ్డాయి. వాటిలో మహారాష్ట్ర తరవాత అత్యధికంగా 11శాతం ఘటనలు తెలంగాణలోనే చోటుచేసుకొన్నాయి. చిన్నారులపై లైంగిక దాడులు, దళితులపై దౌర్జన్యాల్లోనూ గడచిన సంవత్సరం తెలంగాణ- దేశంలో ఏడో స్థానంలో నిలిచింది. 2019తో పోలిస్తే నిరుడు తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాలు దాదాపు 16శాతం అధికమయ్యాయి. గతేడాది ఒక్క తెలంగాణలోనే సైబర్‌ ఘాతుకాల్లో పెరుగుదల 86శాతం! ఏపీలో ఎస్సీలపై అకృత్యాలది అంతులేని కథ. దళితులపై అత్యధిక దాష్టీకాలు నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ది అయిదో స్థానం. పోనుపోను ఇంతలంతలవుతున్న వ్యవస్థీకృత నేరాలతో పాటు అణగారిన వర్గాలపై అకృత్యాలను అరికట్టడంలో యంత్రాంగం వైఫల్యం- సామాన్యుల ధన మాన ప్రాణాలు గాలిలో దీపాలేనని చాటుతోంది.

కార్యాచరణ శూన్యం..

మానవ అక్రమ రవాణా దందాసురులు, సైబర్‌ నేరగాళ్లకు కొవిడ్‌ కల్లోల కాలంలో కొత్త కోరలు మొలుచుకొచ్చాయి. మహమ్మారి కాటుకు కుదేలైపోయిన కుటుంబాలపై వల విసురుతూ పాపిష్టి మూకలు పేట్రేగిపోతున్నాయి. అక్రమ రవాణా బాధితుల్లో 74శాతం దాకా వ్యభిచార కూపంలో కూరుకుపోతున్నారు. ఏపీ, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో ఈ వికృత దందాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు క్షేత్రస్థాయి కథనాలు వెల్లడిస్తున్నాయి! దారుణాలను అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలను కొలువుతీర్చింది. తెలంగాణ సైతం అంతర్రాష్ట్ర సమన్వయ సంఘం ఏర్పాటుకు హామీ ఇచ్చినా, కార్యాచరణకు నోచలేదు. రెండేళ్ల క్రితం భారత్‌లో నాలుగు లక్షలుగా నమోదైన సైబర్‌ దాడులు నిరుడు మూడింతలయ్యాయి. ఈ ఏడాది తొలి ఆరునెలల్లోనే అవి ఆరు లక్షలకు మించిపోయాయి.

మహిళలకు సైబర్‌ బెదిరింపుల కేసులు తెలంగాణలోనే అత్యధికం. ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపుల్లోనూ రాష్ట్రం రెండో స్థానంలో నిలుస్తోంది. అంతర్జాలంలో రకరకాల రూపాల్లో సామాన్యులను బురిడీకొట్టించి ఎడాపెడా దోచుకుంటున్న వాళ్ల భరతం పట్టాల్సిందే. ఎఫ్‌ఐఆర్‌ దాఖలు నుంచి అసలైన నేరస్థుల గుర్తింపు, సత్వర విచారణ, కఠిన శిక్షల అమలు వరకు అన్నీ పకడ్బందీగా సాగాలి. తద్వారా ముష్కరుల విజృంభణకు అడ్డుకట్ట పడుతుంది. నేరాల ఉద్ధృతికి కారణమయ్యే సామాజిక ఆర్థిక సమస్యలపైనా ప్రభుత్వాలు దృష్టి సారిస్తేనే- శాంతిభద్రతలు మెరుగై పౌరుల సుఖమయ జీవనానికి బాటలు పడతాయి!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.