ETV Bharat / opinion

చాపకింద నీరులా కరోనా.. చెక్​ పెట్టేదెలా?

author img

By

Published : Jul 13, 2020, 7:41 AM IST

ప్రస్తుత మహమ్మారి విజృంభణ కాలంలో కనిపించే వారంతా కదిలి వస్తున్న కరోనా లాగా కనిపిస్తున్నారు. మహమ్మారి అని ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు మొత్తుకోవడమే కానీ... మాట వినిపించుకోకుండా చాలామంది తిరిగేస్తున్నారు. అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో విస్తరించుకుంటూ వెళ్తోంది వైరస్. దీనికి చెక్​ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

an analysis story on corona spreading
చాపకింద నీరులా... కరోనా!

మూతికి మాస్క్‌, చేతికి శానిటైజర్‌, కంటికి టీవీ లేదా మొబైల్‌ ఫోన్‌, వర్క్‌ ఫ్రం హోమ్‌ అయితే లాప్‌టాప్‌ తప్ప... ఏమీ కనిపించడం లేదు. ఎదురుగా ఎవరైనా వచ్చినా, ఎదురింటి వారే అయినా ఎగాదిగా చూసి ఏదో మాట్లాడి ఇంకేదో వినిపించుకొని చివరికి ఏవో సైగలు చేసి తప్పించుకొని వెళ్లిపోవడం తప్పనిసరి అయ్యింది. కనిపించేవారంతా కదిలి వస్తున్న కరోనాలాగా భయపడుతున్నారు. పాజిటివ్‌ అనే పదం వినిపిస్తే పదో అంతస్తు నుంచి పడిపోబోతున్నంత దడ. నెగెటివ్‌ అంటే వీనుల విందైన సంగీతం. నెగెటివ్‌ ఆలోచనలు మానుకో అనేవారంతా ఇప్పుడు నెగెటివ్‌నే నమ్ముకో... నెగెటివ్‌గా ఉండటానికే ప్రయత్నించు... జాగ్రత్తపడు అంటున్నారు. ఎంత పాజిటివ్‌ మైండ్‌ ఉన్న వాళ్లయినా పాజిటివ్‌ అనగానే అదేమిటో తెలుసుకోకుండానే ఉలిక్కిపడుతున్నారు. ప్రపంచమంతా నెగెటివిటీ కోసం వెంపర్లాడటం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. అంతా కరోనా కాలమహిమ! విందులు వినోదాలు లేనిదే గడిచేది కాదు వారాంతం. ఇప్పుడు ఏ రోజు ఏ వారమో తెలియని స్థితిలో వారమంతా ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. పండగలకు, ఫంక్షన్లకు పెద్ద ఎత్తున పోగయ్యే జనం పిలిచినా పలకనంత క్రమశిక్షణకు అలవాటు పడ్డారు.

వైరస్​కు చిన్నాపెద్దా భేదం లేదు

కోరి ఆహ్వానిస్తే తప్ప ఎవరింటికైనా రాని కరోనాకు ఆత్మాభిమానం ఎక్కువని చాలామందికి అర్థం కావడం లేదు. కానీ తనకు సంబంధించి లేనిపోని సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే ఊరుకునే రకం కాదు ఈ వైరస్‌. జైలులో వేయించేస్తుంది. కరోనాతో యుద్ధంలో మనం గెలిచి తీరాల్సిందే అన్న మన ప్రభుత్వాధినేతలు అప్పట్లో తరచూ టీవీలో మాట్లాడేవారు. సమీక్షలు చేసేవారు. ఆ తరవాత కరోనాతో కలిసి జీవించేద్దాం అంటూ నిత్యసత్య సూత్రాన్ని ప్రతిపాదించేశారు. ఇప్పుడు అప్పుడప్పుడూ కనిపిస్తూ అందరినీ జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. మొదట్లో రోజు గణాంకాలను గుక్క తిప్పుకోకుండా చెప్పిన ఆరోగ్యశాఖ సెగట్రీకి పెరిగిపోతున్న కేసుల లెక్కలు తేలడం లేదో... ప్రెస్‌ మీట్‌లో ప్రశ్నల పరంపరకు సమాధానాలు దొరకట్లేదో... ఈ మధ్య కనిపించడం మానేశారు. రక్షణ మంత్రిత్వ శాఖను శానిటైజ్‌ చేశారు. కొందరు నీతిఆయోగ్‌ సభ్యులను క్వారంటైన్‌కు పంపారు. పురుగుమందులు వాడితే సరిపోదా అంటూ అమిత మెడికల్‌ నాలెడ్జ్‌ని ప్రదర్శించిన ప్రపంచ పెద్దన్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు వేసుకుంటున్నా అని ప్రకటించి ప్రజలను ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. ఆ మాత్రలు తయారుచేసే ఒక ఫ్రెంచి కంపెనీలో తనకు వాటాలు ఉండబట్టే లాభాల కోసం ఇలా ప్రచారం చేస్తున్నాడనే వార్తలూ వచ్చాయి. ఇందులో ప్రమాదం ఏముందని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. అంత పెద్ద అధ్యక్షుడు ఆ మాత్రలు వేసుకున్నాడు కదా అని జనం ఎడాపెడా కొని వేసుకుంటే లేనిపోని సైడ్‌ ఎఫెక్ట్‌లు వస్తాయని శాస్త్రవేత్తలు నెత్తీనోరూ కొట్టుకొని చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లుంది. పారాసిట్మాల్‌ వేసుకుంటే పారిపోయే వైరస్‌ గురించి ఇంత గొడవెందుకు... సరేలే ఆ కరోనా టెస్ట్‌లతో ఊపిరితిత్తుతులైనా బాగుపడతాయిలే కానివ్వండి అంటూ వెటకారం చేసిన బ్రెజిల్‌ ప్రెసిడెంట్‌ మూతికి మాస్క్‌ వేసి, ఒక ప్రిస్క్రిప్షన్‌, కొన్ని మందులు చేతిలో పెట్టారు. ప్రస్తుతం ఆయన చికిత్సపొందుతూ కరోనా గురించి పూర్తిగా స్వీయ అనుభవంలో తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సహా చిన్నా పెద్ద తేడా లేకుండా అజాగ్రత్తలో ఉన్న అందరినీ కరోనా కౌగిలించుకుంటోంది.

నిర్లక్ష్యం వద్దు

మహమ్మారి మహమ్మారి అని ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు మొత్తుకోవడమే కానీ... మాట వినిపించుకోకుండా చాలామంది తిరిగేస్తున్నారు. తగని రోజుల్లోనూ పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటూ పక్కవారి పుట్టి ముంచుతున్నారు. సామాజిక దూరం అంటూ హెచ్చరించినా మాల్స్‌, మార్కెట్లు, వాహనాల్లో కిక్కిరిసి తిరుగుతూ కరోనాకి ఎర్ర తివాచీ పరిచి రెడ్‌ జోన్లు పెంచుతున్నారు. ప్రభుత్వాలు కూడా సరైన లెక్కలు చెప్పకపోవడంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోతోంది. లాక్‌డౌన్‌లతో కేసులు కట్టడి చేశామని పెద్దయెత్తున రాజకీయ ప్రచారం చేసుకున్నవారికి వేలల్లో కేసులు పెరుగుతుండటంతో- నోరు పెగలడం లేదు. అందుకే ఆ మాటలు మానేసి... జనాన్ని వైరస్‌కి, ఆసుపత్రులకు అప్పజెప్పి మామూలు రాజకీయాల్లో పడిపోయారు. ప్రత్యర్థులపై కేసులు, దాడులు చేయించి తిప్పలు పెట్టడంలో బిజీగా ఉన్నారు. జనాల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. జీతాల్లో కోతలు పడుతున్నాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగిపోతున్నాయి. విచిత్రంగా... కొనేవాడు లేకపోయినా బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రేక్షకులు లేకపోయినా క్రికెట్‌ మ్యాచ్‌లు ఇక్కడ పెట్టాలా, అక్కడా పెట్టాలా... అని ఆలోచనలు సాగాయి. ఆ ముచ్చటా మొదలైంది. ఇంట్లోనే చేసుకున్న పాప్‌కార్న్‌ నములుతూ అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు. కరోనా మాత్రం చట్టం మాదిరిగా కాకుండా- తన పని తాను చేసుకుపోతూనే ఉంది!

రచయిత:ఎమ్మెస్‌

ఇదీ చూడండి: 'జీవితాలను సరిదిద్దుకొనే సమయమిదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.