ETV Bharat / international

పాక్​ కొత్త ప్రధానిగా షెహబాజ్- కశ్మీర్​పై కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Apr 11, 2022, 5:02 PM IST

Updated : Apr 12, 2022, 5:57 AM IST

Shehbaz Sharif
షెహబాజ్ షరీఫ్

Shehbaz Sharif: పాకిస్థాన్ కొత్త ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ ఎన్నికయ్యారు. జాతీయ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఈయన ఎంపిక జరిగింది. విపక్షాలన్నీ ఏకగ్రీవంగా షెహబాజ్​కు మద్దతు తెలిపాయి. మరోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​కు చెందిన పాకిస్థాన్​ తెహ్రీక్​ ఇ ఇన్సాఫ్​ పార్టీ ఎంపీలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సభ నుంచి వాకౌట్ చేశారు.

Pakisthan New PM: పాకిస్థాన్ నూతన ప్రధానిగా పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ ఎన్నికయ్యారు. జాతీయ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో విపక్షాలు ఈయన్ను ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నుకున్నాయి. 342 అసెంబ్లీ స్థానాలు గల పాక్ జాతీయ అసెంబ్లీలో మెజార్టీకి 172 సీట్లు కావాల్సి ఉండగా.. షెహబాజ్​కు 174 మంది మద్దతు తెలిపారు. దీంతో ఆయన ప్రధాని పదవికి ఎంపికయ్యారు.

విపక్షాల మద్దతుతో ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్‌ షరీఫ్‌.. పాక్‌ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడారు. పాకిస్థాన్‌ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా.. దేశ ప్రధానిని తొలగించడం ఇదే మొదటిసారి అని గుర్తుచేశారు. చెడుపై మంచి ఎప్పటికైనా విజయం సాధిస్తుందనడానికి ఈ విజయం ఒక ఉదాహరణఅని షెహబాజ్‌ పేర్కొన్నారు. పాకిస్థాన్​ ప్రజలకు ఇది గొప్ప రోజు అని పేర్కొన్నారు. ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించాల్సిందేనని పాక్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పాక్‌ ప్రజలను తప్పుదొవ పట్టించేందుకే ఇమ్రాన్‌ఖాన్‌ విదేశీ కుట్రను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఇమ్రాన్‌ చెపుతున్న వివాదాస్పద లేఖ విషయంలో ఇప్పటికే పార్లమెంట్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ స్పష్టతనిచ్చిందని ‌అన్నారు. విదేశీ కుట్ర నిజమని నిరూపిస్తే ప్రధాని పదవికి తాను రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

Shehbaz Sharif News: అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్‌కు చైనా సహకారం మరువలేనిదని షెహబాజ్‌ తెలిపారు. చైనా, పాక్‌ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భారత్‌తోనూ మిత్రుత్వాన్ని కోరుకుంటున్నామని షెహబాజ్‌ తెలిపారు. కానీ కశ్మీర్‌ వివాదం పరిష్కారం కాకుండా సన్నిహిత సంబంధాలను కొనసాగించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. కశ్మీర్‌ లోయ నెత్తురోడుతోందని పేర్కొన్నారు. అక్కడి ప్రజలకు దౌత్యపరమైన, నైతిక మద్దతు అందిస్తామని ఉద్ఘాటించారు. కశ్మీర్‌ వివాదం పరిష్కారమైతే తప్ప భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడవని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తికి ఉద్దేశించిన ఆర్టికల్‌-370 రద్దు సహా పలు అంశాలను ప్రస్తావించారు. ఆది నుంచీ భారత్‌-పాక్‌ మధ్య సత్సంబంధాలు లేవని పేర్కొన్నారు.

2019 ఆగస్టులో భారత్‌ ఆర్టికల్‌-370ని రద్దు చేసినప్పుడు పాక్‌ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ దౌత్యపరంగా తగిన చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని షెహబాజ్‌ విమర్శించారు. "ఆర్టికల్‌-370ని ఉపసంహరించుకున్నప్పుడు ఇమ్రాన్‌ ఏం చేశారు? కశ్మీర్‌ రోడ్లపై కశ్మీరీల నెత్తురు వరదలా పారుతోంది. వారి రక్తంతో లోయ ఎరుపు రంగు పులుముకుంది. భారత్‌తో సత్సంబంధాలనే పాక్‌ కోరుకుంటోంది. కానీ కశ్మీర్‌ వివాదం పరిష్కారమయ్యేంతవరకు ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనవు. కశ్మీరీలకు రాజకీయపరంగా, దౌత్యమార్గాల్లో, నైతికంగా మేం మద్దతు కొనసాగిస్తాం. అక్కడి సోదర సోదరీమణుల వాణిని ప్రతి అంతర్జాతీయ వేదికపై వినిపిస్తాం" అని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాలు, కశ్మీరీల అంచనాలకు అనుగుణంగా కశ్మీర్‌ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత ప్రధాని మోదీ ముందుకురావాలని షెహబాజ్‌ పిలుపునిచ్చారు.

అంతకుముందు ఓటింగ్‌ను అడ్డుకునేందుకు ఇమ్రాన్‌ఖాన్‌ వేసిన ఎత్తుగడలు ఏమాత్రం పారలేదు. జాతీయ అసెంబ్లీలో ఓటింగ్‌కు ముందే తమ పార్టీ(పాకిస్థాన్​ తెహ్రీక్​ ఇ ఇన్సాఫ్) సభ్యులంతా రాజీనామా చేస్తారని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటించారు. దొంగలు ఉన్న జాతీయ అసెంబ్లీలో తాను కూర్చోబోనని పేర్కొన్నారు. అనంతరం సభలోకి వెళ్లిన పీటీఐ సభ్యులు రాజీనామా చేయకుండానే సభ నుంచి వాకౌట్‌ చేశారు.

ఎవరీ షెహబాజ్?​: షెహబాజ్‌ 1951 సెప్టెంబరు నెలలో లాహోర్​లో జన్మించారు. షెహబాజ్‌ తండ్రి ముహమ్మద్‌ షరీఫ్‌ స్వస్థలం కశ్మీర్‌ (భారత్‌)లోని అనంతనాగ్‌. ఆయన పారిశ్రామికవేత్త. షెహబాజ్​ లాహోర్​లోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పాక్​ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్​కు షెహబాజ్‌ షరీఫ్‌ స్వయానా తమ్ముడు. షెహబాజ్​ అయిదు పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఇద్దరు భార్యలు. మిగతా ముగ్గురికి విడాకులిచ్చారు.

  • షెహబాజ్‌ పెద్ద కుమారుడు హమ్జా పంజాబ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సీఎం ఎన్నికల బరిలో నిలిచారు.
  • బ్రిటన్​లో 1,400 కోట్ల పాకిస్థానీ రూపాయలకు సంబంధించి నగదు అక్రమ చలామణి కేసు షెహబాజ్​పై ఉంది.
  • 1980లో రాజకీయాల్లో ప్రవేశం. 1988లో మొదటిసారి పంజాబ్​ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నిక. 1997లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు. మూడు సార్లు పంజాబ్ సీఎంగా బాధ్యతలు.
  • 2017లో పాకిస్థాన్ ముస్లిం లీగ్​-నవాజ్​ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు. 2018 సార్వత్రిక ఎన్నికలతో జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మారారు.
  • పాక్‌లో సైన్యంతో షెహబాజ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. అది ఆయనకు కలిసొచ్చే అంశం.
  • యథార్థవాది. ముక్కుసూటి మనిషి. మనసులో ఏముంటే అదే చెప్తారు.. అదే చేస్తారు. ఈ మాటలు పాకిస్థాన్ ప్రజలు షెహబాజ్​ షరీఫ్ గురించి చెప్పుకొనే మాటలు.

భారత్​-పాక్​ సంబంధాలు మెరుగుపడేనా?.. దూకుడుగా వ్యవహరించే ఇమ్రాన్​ కంటే వాస్తవికత దృక్ఫథంతో వ్యవహరించే అనుభవజ్ఞుడైన షెహబాజ్​ షరీఫ్​ హయాంలో భారత్​-పాక్ సంబంధాలు ఎంతో కొంత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. షెహబాజ్​కు సన్నిహితుడైన పాకిస్థాన్​ ముస్లిం లీగ్​-ఎన్​ నేత సమీపుల్లా ఖాన్​ పీటీఐతో మాట్లాడుతూ.. భారత్​ విషయంలో తమ నేత బలమైన, ఆచరణాత్మకమైన ఓ కొత్త విధానాన్ని రూపొందిస్తారని తెలిపారు. షెహబాజ్​ సోదరుడైన నవాజ్​ షరీఫ్​ పాక్​ ప్రధాని హోదాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో స్నేహపూర్వకంగానే వ్యవహరించేవారు.

చైనాతో సంబంధాలు ఎలా?..: చైనా, పాకిస్థాన్‌ సంబంధాలు ఇమ్రాన్‌ఖాన్‌ హయాంలో కంటే షెహబాజ్‌ షరీఫ్‌ పాలనలో మరింత మెరుగ్గా ఉంటాయని బీజింగ్‌ అధికారిక పత్రిక పేర్కొంది. పాక్‌లో సోమవారం షెహబాజ్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో 'గ్లోబల్‌ టైమ్స్‌' పత్రిక ఆదివారం ఈ కథనాన్ని ప్రచురించింది. పాక్‌లో నాయకత్వ మార్పు ఆ దేశ అంతర్గత వ్యవహారమని, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల విషయంలో పార్టీలన్నిటి వైఖరి ఒకేలా ఉంటుందని అభిప్రాయపడింది. ఇమ్రాన్‌ఖాన్‌ స్థానంలో అధికారం చేపట్టనున్న 'షరీఫ్‌' కుటుంబానికి చెందిన షెహబాజ్‌ గతంలో మాదిరిగా పాక్‌ - చైనా సంబంధాలను ముందుకు తీసుకువెళతారని తెలిపింది.

ఇదీ చదవండి: పాక్​​లో 'రాహుల్ గాంధీ నినాదం'.. ఇమ్రాన్ పార్టీ ర్యాలీలో దుమారం!

Last Updated :Apr 12, 2022, 5:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.