ETV Bharat / international

భారత్‌ కానుక తాలిబన్ల వశం.. పార్కులనూ వదల్లేదు!

author img

By

Published : Aug 17, 2021, 2:29 PM IST

Updated : Aug 17, 2021, 4:20 PM IST

అఫ్గానిస్థాన్​ను ఆక్రమించిన తాలిబన్లు.. కొద్ది గంటల్లోనే అఫ్గాన్ పార్లమెంటులోకి ప్రవేశించారు. ఈ భవన నిర్మాణం కోసం భారత్‌ 90 మిలియన్‌ డాలర్లు ఖర్చుచేసింది. 2015 డిసెంబర్‌లో భారత ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఈ భవనాన్ని ప్రారంభించారు.

taliban
భారత్‌ కానుక తాలిబన్ల వశం.. పార్కులనూ వదల్లేదు!

అధికారం చేజిక్కించుకున్నాక తాలిబన్లు కొద్ది గంటల క్రితం అఫ్గాన్‌ పార్లమెంట్‌ భవనంలోకి ప్రవేశించారు. అక్కడ నాయకుల కుర్చీల్లో వారు రైఫిల్స్‌ తీసుకొని కూర్చొని వీడియోలు చిత్రీకరించుకున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను జర్నలిస్టు, వ్యాపారవేత్త అయిన వాజాత్‌ ఖాజ్మీ ట్వీట్‌ చేశారు. రెండు వారాల క్రితం ఇదే భవనంలో దేశ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ పార్లమెంట్‌ సమావేశాలను నిర్వహించారు.

తాలిబన్లు 1996లో అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించే క్రమంలో నాటి పార్లమెంట్‌ భవనం దార్‌ ఉల్‌ అమన్‌ను బాంబులతో పేల్చేశారు. కానీ, అమెరికా దాడిచేసి తాలిబన్లను తరిమి కొట్టాక ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రజా ప్రభుత్వం కోసం ఈ భవనాన్ని భారత్‌ నిర్మించింది. 2015 డిసెంబర్‌లో భారత ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అఫ్గాన్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ఈ భవన నిర్మాణం కోసం భారత్‌ 90 మిలియన్‌ డాలర్లు ఖర్చుచేసింది. ఇప్పటికే భారత్‌ నిర్మించిన సల్మా డ్యామ్‌ సహా పలు ప్రాజెక్టులను తాలిబన్లు స్వాధీనం చేసుకొన్నారు.

పార్కుల్లో ఆటలు..

ఇక చిన్న పిల్లలు ఆడుకునే పార్కుల్లో తాలిబన్లు తుపాకులతో తిరుగుతున్నారు. అక్కడ ఉన్న పరికరాలతో వారు సరదాగా గడుపుతున్నారు. ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీ ఈ వీడియోను పోస్టు చేసి.. "డియర్‌ అమెరికా.. వీరు నిన్ను ఓడించింది. వీరి చేతిలో ఓడిపోయావా"అంటూ ట్విటర్‌లో ఎద్దేవా చేశారు.

జాన్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయ ఆర్థిక వేత్త స్టీవ్‌ హాంక్‌ కూడా ఇలాంటి వీడియో ఒకటి ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: అఫ్గాన్​లో భారత ఎంబసీ మూసివేత.. స్వదేశానికి అధికారులు

Last Updated : Aug 17, 2021, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.