ETV Bharat / crime

Tragedy: బాలుడి అదృశ్య ఘటన విషాదాంతం.. చెరువులో మృతదేహం!

author img

By

Published : Oct 22, 2021, 5:09 PM IST

the-boys-disappearance-in-rajendranagar-is-a-tragedy
బాలుడి అదృశ్య ఘటన విషాదాంతం.. చెరువులో మృతదేహం!

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో బాలుడి అదృశ్య ఘటన విషాదంతమైంది. ఇంటికి సమీపంలోని చెరువులో అన్వేష్ మృతదేహం(boy died in Rajendra nagar) లభ్యమైంది. బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో బాలుడి అదృశ్య ఘటన విషాదంతమైంది(Tragedy in Rajendra nagar). ఆరేళ్ల అన్వేష్ ఆడుకుంటానని చెప్పి గురువారం మధ్యాహ్నం అపార్ట్‌మెంట్‌ నుంచి కిందకి వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు... చుట్టుపక్కల వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.... చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు. బాలుడు ఒక్కడే కాలినడకన వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మూడు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలించగా.. ఇంటికి సమీపంలోని చెరువులో అన్వేష్ మృతదేహం(boy died in Rajendra nagar) లభ్యమైంది. బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

శోకసంద్రంలో తల్లిదండ్రులు

బ్యాటరీ బైక్ రాలేదని బాలుడు మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం హైదర్‌గూడ సిరిమల్లెకాలనీలో అన్వేష్ అదృశ్యమయ్యాడు. రెండ్రోజుల క్రితం బ్యాటరీ బైక్ కావాలని అన్వేష్ కోరినట్లు అతడి తండ్రి తెలిపారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చామని.. రెండురోజుల్లో వస్తుందని.. కానీ బాలుడు ఇకలేడని ఆ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. బాలుడి మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

ఏం జరిగింది?

హైదర్​గూడకు చెందిన ఆరేళ్ల బాలుడు అన్వేష్ గురువారం అదృశ్యమయ్యాడు. మూడు ప్రత్యేక బృందాలు గాలించగా... చెరువులో మృతదేహం లభ్యమైంది. కొండారెడ్డి బహుళ అంతస్తుల భవనంలో నివాసం ఉండే శివశంకర్ సాఫ్ట్​వేర్ ఉద్యోగి. స్థిరాస్తి వ్యాపారం కూడా చేస్తుంటాడు. ఈయన కుమారుడు అన్వేష్... ఆడుకుంటానని చెప్పి అపార్టుమెంట్ నుంచి గురువారం మధ్యాహ్నం కిందికి వెళ్లినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఆ తర్వాత సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనతో చుట్టుపక్కల వెతికారు. ఫలితం లేకపోవడంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కారణం అదేనా..?

బాలుడు గత మూడు రోజుల నుంచి తనకు బ్యాటరీ బైక్ కొనివ్వాలంటూ మారాం చేశాడని స్థానికులు తెలిపారు. ఈ తరుణంలోనే బాలుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తమకు శత్రువులెవరూ లేరని... కుమారుడి అపహరించేంత కలహాలు కూడా ఎవరితోనూ లేవని బాలుడి తండ్రి శివశంకర్ తెలిపారు. ఆడుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన బాలుడు... చెరువులో విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చదవండి: చంద్రబాబుకు సీపీఐ నారాయణ ఫోన్.. ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.