మొహర్రం సందర్భంగా హైదరాబాద్లో రేపు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. శుక్రవారం ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో బీబీ కా ఆలం ఊరేగింపు జరగనుంది. డబీర్పురాలోని బీబీ కా ఆలం నుంచి ఊరేగింపు ప్రారంభమై.. చాదర్ఘాట్ వరకు సాగనుంది. మహ్మద్ ప్రవక్త కుటుంబం చేసిన త్యాగాలను స్మరించుకోవడమే ‘మొహర్రం’ అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు.
నగరంలో మొహర్రం సన్నాహాలపై ఆయన సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ చేశారు. అదనపు పోలీసు కమిషనర్(శాంతి భద్రతలు) డీఎస్.చౌహాన్, వెస్ట్జోన్ సంయుక్త కమిషర్లు ఎ.ఆర్.శ్రీనివాస్, విశ్వప్రసాద్, ఎం.రమేశ్, గజరావు భూపాల్, కల్మేశ్వర్ శింగనేవార్, వివిధ ఠాణాల అధికారులు పాల్గొన్నారు. మొహర్రం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కమిషనర్ ఆయా అధికారులకు వివరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.
మొహర్రం సందర్భంగా.. కరోనా నిబంధనల ఉల్లంఘన జరిగే అవకాశముందని సీపీ చెప్పారు. అలా జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ పండుగ చేసుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
Ys Viveka Murder Case: వివేకా హత్య కేసులో.. ఎంపీ అవినాష్ సన్నిహితుడు శివశంకర్ రెడ్డి విచారణ