ETV Bharat / city

రాష్ట్ర రాబడిని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలి: సీఎం జగన్

author img

By

Published : Jul 25, 2022, 7:54 PM IST

సీఎం జగన్
సీఎం జగన్

CM Jagan Review: రాష్ట్ర రాబడిని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని మఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. పన్నుల వసూళ్లలో పారదర్శకత అమలు చేయాలని, తప్పుడు బిల్లులు లేకుండా, పన్ను ఎగవేతలకు ఆస్కారం లేకుండా ఉండేలా అధునాతన విధానాలను రూపొందించాలన్నారు. రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు సహా అవినీతి జరిగేందుకు అవకాశం ఉన్న అన్ని కార్యాలయాల్లో అవినీతి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం.. వీలైనంత త్వరలో అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరిపేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Jagan Review on Income Sources: రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణశాఖల మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. పన్నుల వసూళ్లలో పారదర్శకత, పన్నుల విభాగంలో నాణ్యమైన సేవలకు ఉద్దేశించిన పలు నిర్ణయాల అమలుపై ముఖ్యమంత్రి చర్చించారు. పన్నుల విభాగంలో డేటా అనలిటిక్స్‌ సెంటర్‌ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. ప్రభుత్వ విభాగాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత పెంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా, ఆదాయాలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఎప్పటికప్పుడు రాబడులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తప్పుడు బిల్లులు లేకుండా, పన్ను ఎగవేతలకు ఆస్కారం లేకుండా మంచి విధానాలను రూపొందించుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలన్నారు.

అక్రమ మద్యం తయారీ, రవాణాలను నిరోధించాలన్న సీఎం.. బెల్టుషాపులు, గ్రామాల్లో అక్రమ మద్యం నిరోధంలో మహిళా పోలీసులది కీలకపాత్ర అన్నారు. దీనిపై గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుకు సంబంధించి ఎస్‌ఓపీ రూపొందించాలన్నారు. అక్రమ మద్యం తయారీ, అమ్మకాలకు సంబంధించి క్రమం తప్పకుండా వారి నుంచి నివేదికలు తీసుకోవాలన్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై సమీక్షించిన సీఎం జగన్ అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఎమ్మార్వో, ఎండీవో, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాలతో పాటు అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై మరింత దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, ఆస్పత్రుల్లో స్పష్టంగా కనిపించేలా ఏసీబీ ఫిర్యాదు నెంబర్ 14400 పోస్టర్‌లు ఏర్పాటు చేయాలన్నారు. 14400 ఫోన్‌ కాల్స్‌ను తీసుకోవటం సహా వాటికి సంబంధించిన యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టు పక్కాగా ఉండాలన్నారు.

గ్రామ సచివాలయ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఏయే సేవలు అందుబాటులో ఉంటాయనేది పోస్టర్ల రూపంలో ప్రదర్శించాలన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్ధమయ్యేలా పోస్టర్ల రూపంలో ప్రదర్శించాలని సీఎం ఆదేశించారు. 51 గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయని, మరో 650 గ్రామాల్లోని గ్రామ,వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. వీటికి అదనంగా 2 వేల గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో అక్టోబరు 2 నాటికి రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ శాఖపైనా సీఎం జగన్ సమీక్షించారు. త్వరలోనే రెడ్‌ శాండిల్‌ ఆక్షన్‌–గ్లోబల్‌ టెండర్‌ కోసం కేంద్రం నుంచి అనుమతులు లభించనున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న స్టాక్‌ను భద్రపరచడంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రతి నెలా స్టాక్‌కు సంబంధించిన వివరాలు చెక్‌ చేసుకుంటూ.. వివరాలు నమోదు చేయాలన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలంపైనా సీఎం జగన్ సమీక్షించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.905.57 కోట్ల డబ్బును చెల్లించిందన్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.