ETV Bharat / city

CBN: 'జీవో నెంబరు 217 రద్దుకు తెదేపా పోరాడుతుంది'

author img

By

Published : Sep 4, 2021, 5:44 AM IST

చంద్రబాబుకు వినతి పత్రం అందజేస్తున్న వివిధ మత్స్యకార సోసైటీల ప్రతినిధులు
చంద్రబాబుకు వినతి పత్రం అందజేస్తున్న వివిధ మత్స్యకార సోసైటీల ప్రతినిధులు

రోజుకో బీసీ సామాజికవర్గ ప్రయోజనాలు దెబ్బతీసేలా వైకాపా ప్రభుత్వం అడ్డగోలు జీవోలు జారీ చేస్తోందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మత్స్యకారుల మెడకు ఉచ్చు బిగించేందుకు తెచ్చిన జీవో నెంబరు 217 రద్దుకు తెదేపా పోరాడుతుందని హామీ ఇచ్చారు.

రోజుకో బీసీ సామాజికవర్గ ప్రయోజనాలు దెబ్బతీసేలా వైకాపా ప్రభుత్వం అడ్డగోలు జీవోలు జారీ చేస్తోందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మత్స్యకారుల మెడకు ఉచ్చు బిగించేందుకు తెచ్చిన జీవో నెంబరు 217 రద్దుకు తెదేపా పోరాడుతుందని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో రాష్ట్రంలోని వివిధ మత్స్యకార సొసైటీల ప్రతినిధులు శుక్రవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబును కలిసి తమ సమస్యలను వివరించారు. 217 జీవో వల్ల చేపల చెరువులపై ఆధారపడి జీవించే లక్షల మంది రోడ్డున పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఇప్పటికే ఇసుక, మద్యం, విద్యుత్‌ ఛార్జీల పెంపుతో పేదల బతుకు దుర్భరం చేసిన జగన్‌ సర్కారు మత్స్యకారులనూ వేధిస్తోంది. చేపల చెరువులను వైకాపా నేతల హస్తగతం చేసేందుకే బహిరంగ వేలం విధానాన్ని తీసుకొచ్చారు. జీవో రద్దు కోసం మత్స్యకారులు అవసరమైతే న్యాయపోరాటం చేయాలి. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే, తెదేపా అధికారంలోకి రాగానే సదరు జీవోను రద్దు చేస్తాం. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా మత్స్యకార సెల్‌ ఏర్పాటు చేసి, బీసీ ఫెడరేషన్‌ ద్వారా సమస్యల పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేస్తాం’ అని హామీ ఇచ్చారు.

136 రకాల కులవృత్తుల వారు రోడ్డున పడ్డారు..

వైకాపా ప్రభుత్వ విధానాలతో కులవృత్తులపై ఆధారపడ్డ 136 వెనుకబడిన తరగతులవారు రోడ్డునపడే దుస్థితికి వచ్చారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎలాంటి బహిరంగ వేలం లేకుండా చేపల చెరువులు ఆయా ప్రాంతాల్లోని మత్స్యకార సొసైటీలకే తెదేపా ప్రభుత్వం లీజుకిచ్చింది. చేపలవేట నిషేధ కాలంలో నెలకు రూ.4,500తో పాటు బియ్యం, ఇతర నిత్యావసరాలను మత్స్యకారులకు ఇచ్చాం.

బోట్లకు డీజిల్‌ సబ్సిడీతో పాటు 75శాతం రాయితీపై వలలు, ఐస్‌ బాక్సులు, మార్కెటింగ్‌ కోసం వాహనాలు అందించాం. ఉత్పత్తులు అమ్ముకోవడానికి వీలుగా ప్లాట్‌ఫాంలు, చేపపిల్లల పెంపకానికి నర్సరీలు ఏర్పాటు చేశాం’ అని గుర్తు చేశారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ‘ఆన్లైన్‌ టెండర్‌ ద్వారా బహిరంగ వేలం నిర్వహించి మత్స్య సంపదను వైకాపా నేతలకు దోచిపెట్టేందుకే జీవో 217 తెచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయిదు వేల మత్యకార సహకార సంఘాల పొట్టగొట్టేలా ఉన్న జీవోను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. చంద్రబాబును కలిసిన వారిలో మత్స్యకారుల సంఘాల నాయకులు కొల్లూరు పాలిశెట్టి, లకనం నాగాంజనేయులు, లంకే నారాయణ ప్రసాద్‌, నడకుదుటి అర్జున, కాటా గోపీ తదితరులున్నారు.

ఇదీ చదవండి:

DGP: 'రాజకీయ ప్రయోజనాల కోసమే దిశ పోలీసుస్టేషన్ల ముట్టడి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.