ETV Bharat / city

వివాదాస్పద భూములు కాబట్టే ధర తక్కువన్న ఎర్తిన్‌ డైరెక్టర్‌ నరేన్‌ రామాంజులరెడ్డి

author img

By

Published : Aug 25, 2022, 8:15 AM IST

EARTHIN DIRECTOR లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ విషయంపై ఎర్తిన్‌ కన్సార్షియం డైరెక్టర్‌ నరేన్‌ రామాంజులరెడ్డి స్పందించారు. ఇందూ కంపెనీ దివాళ ప్రక్రియలో ఎన్​సీఎల్​టీ నిబంధనలకు మేరకే తాము బహిరంగవేలంలో పాల్గొన్నామని స్పష్టం చేశారు. కంపెనీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లలో తానూ ఒకడినన్న ఆయన ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదన్నారు.

EARTHIN DIRECTOR
EARTHIN DIRECTOR

EARTHIN DIRECTOR లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ ఏర్పాటు దశ నుంచి ఏదో ఒక రూపంలో ఆ భూములు వివాదాస్పదమయ్యాయని, దీంతో ఆ భూములపై పెట్టుబడి పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో బ్యాంకర్లు రూ.500 కోట్లకే ఎర్తిన్‌ కంపెనీకి ఇవ్వడానికి అంగీకరించారని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి కుమారుడు, సీకేదిన్నె జడ్పీటీసీ సభ్యుడు నరేన్‌ రామాంజులరెడ్డి తెలిపారు. బుధవారం కడప వైకాపా కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇందూ ప్రాజెక్టు వడ్డీ కాకుండా అసలే రూ.4,200 కోట్లు వరకు బకాయిలుండగా రూ.2,500 కోట్ల విలువైన భూములను ఎర్తిన్‌ సంస్థకు రూ.500 కోట్లకే ఇవ్వడానికి బ్యాంకులు ఎందుకు అంగీకరించాయన్న ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు.

వివాదాస్పద భూములు కాబట్టే ధర తక్కువన్న ఎర్తిన్‌ డైరెక్టర్‌ నరేన్‌ రామాంజులరెడ్డి

ఇందూ ప్రాజెక్ట్స్‌ దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ చేపట్టిన చర్యల్లో భాగంగా ఎర్తిన్‌ సంస్థ బిడ్‌ దాఖలు చేసిందని వివరించారు. ఆన్‌లైన్‌లో బహిరంగంగా నిర్వహించిన వేలం పాటలో ఆ కంపెనీ లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ భూములను పొందిందన్నారు. కొందరు స్నేహితులతో కలిసి ఈ కంపెనీలో తాను కొంత పెట్టుబడి పెట్టానని చెప్పారు. ఆ భూములను తాను ఇంతవరకు చూడలేదన్నారు. దేశంలో చట్టపరంగా ఎలాంటి వ్యాపారమైనా చేసుకునే హక్కు తనకు ఉందని ఆయన స్పష్టం చేశారు. అతి తక్కువ ధరకు లేపాక్షి భూములను కాజేశారని విమర్శిస్తున్న వారు బిడ్‌లో ఎందుకు పాల్గొనలేదని నరేన్‌ రామాంజులరెడ్డి ప్రశ్నించారు. ఎర్తిన్‌ కంపెనీలోని చాలా మంది డైరెక్టర్లలో తానూ ఒకణ్ననన్నారు. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని అప్రతిష్ఠపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

లేపాక్షి నాలెడ్జ్‌ హబ్ కుంభకోణం నేపథ్యమిదీ..: వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అస్మదీయుల కంపెనీ అయిన ఇందూ గ్రూపునకు అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ పేరుతో కారుచౌకగా అత్యంత విలువైన భూములను కట్టబెట్టారు. అందుకు నజరానాగా ఆ కంపెనీ వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన సంస్థలో పెట్టుబడులు పెట్టింది. సీబీఐ విచారణలో ఈ కుంభకోణం వెలుగు చూడటంతో ఆ భూముల్ని ఈడీ జప్తు చేసింది. అప్పటికే వాటిని తనఖా పెట్టి తీసుకున్న వేల కోట్ల రుణాల్ని తిరిగి చెల్లించలేదు. ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం రూ.వేల కోట్ల విలువైన ఆ భూములు.. దివాలా ప్రక్రియ రూపంలో తాజాగా మళ్లీ జగన్‌ దగ్గరి బంధువుల కంపెనీ చేతికే దక్కుతున్నాయి. అదీ అత్యంత చౌకగా.. కేవలం రూ.500 కోట్లకే దక్కనున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.