ETV Bharat / city

సీపీఎస్‌పై ఇక తాడోపేడో, పాతపింఛను విధానంపైనే చర్చించాలంటున్న ఉద్యోగ సంఘాలు

author img

By

Published : Aug 25, 2022, 9:14 AM IST

trade unions protest on cps issue
trade unions protest on cps issue

CPS AGITATIONS సీపీఎస్‌ విధానం అమల్లోకి వచ్చిన సెప్టెంబరు 1న సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం (సీపీఎస్‌యూఎస్‌) సీఎం జగన్‌ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. మరోవైపు సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (సీపీఎస్‌ఈఏ) విజయవాడలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. అయినా ఆందోళనలు కొనసాగించాలని సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతుండగా.. అడ్డుకోవడానికి పోలీసులు అడుగడుగునా నిర్బంధాలు మొదలుపెట్టారు.

CPS కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకాన్ని (సీపీఎస్‌) రద్దు చేయాలనే డిమాండ్‌తో సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు సిద్ధమయ్యాయి. సీపీఎస్‌ విధానం అమల్లోకి వచ్చిన సెప్టెంబరు 1న సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం (సీపీఎస్‌యూఎస్‌) సీఎం జగన్‌ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. మరోవైపు సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (సీపీఎస్‌ఈఏ) విజయవాడలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. అయినా ఆందోళనలు కొనసాగించాలని సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతుండగా.. అడ్డుకోవడానికి పోలీసులు అడుగడుగునా నిర్బంధాలు మొదలుపెట్టారు. ఆందోళనలను వాయిదా వేయించేందుకు సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు చర్చలు జరుపుతున్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏపీసీపీఎస్‌యూఎస్‌ ఉద్యోగ నాయకులతో రెండు గంటలపాటు చర్చించారు. సీపీఎస్‌, జీపీఎస్‌, ఓపీఎస్‌ విధానంలో ఉన్న తేడాలను నాయకులు మంత్రికి వివరించారు. సీపీఎస్‌ఈఏను చర్చలకు ఆహ్వానించగా ఓపీఎస్‌పై తప్ప, జీపీఎస్‌పై మాట్లాడేందుకు తాము రాబోమని తిరస్కరించారు. దీంతో గురువారం రావాలని సూచించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో కలిసి శుక్రవారం మరోసారి చర్చలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆందోళనలకు పిలుపునిచ్చిన సీపీఎస్‌ సంఘాలతోనే చర్చలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఉద్యోగులపై పోలీసుల ఆంక్షలు
సీపీఎస్‌ ఉద్యోగుల ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్‌ విభాగం సీపీఎస్‌ ఉద్యోగుల వివరాలను ట్రెజరీల ద్వారా సేకరిస్తోంది. ఒక డ్రాయింగ్‌ అధికారి కింద ఎంతమంది ఉద్యోగులు పని చేస్తున్నారు? వీరు ప్రస్తుతం ఎక్కడెక్కడ ఉన్నారని ఆరా తీస్తోంది. మరోవైపు పోలీసులు ఉద్యోగులకు నోటీసులు ఇస్తున్నారు. ‘తాడేపల్లిలోని సీఎం అధికారిక నివాసాన్ని ముట్టడించాలనే లక్ష్యంతో సమూహంగా ఏర్పడి, అక్కడికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. సీఎం ఇంటి ముట్టడి, చలో విజయవాడకు ప్రభుత్వం నుంచి అనుమతి లేనందున ఈ కార్యక్రమం నిర్వహించడం నేరం. అక్రమ సమూహంగా ఏర్పడి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడం నేరం.

నోటీసులోని హెచ్చరికల్ని అతిక్రమించి వెళ్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ముందస్తుగా తెలియజేస్తున్నాం’ అని నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసులు పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులకు నోటీసులు ఇస్తున్నారు. కర్నూలులో ఉద్యోగులను స్టేషన్‌కు పిలిపించి, ఆందోళనకు వెళ్లొద్దంటూ హెచ్చరించారు. చాలాచోట్ల కౌన్సెలింగ్‌ పేరుతో పోలీస్‌స్టేషన్లకు తీసుకువెళ్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణతో చర్చలు ముగిసిన అనంతరం ఏపీసీపీఎస్‌యూఎస్‌ ఉద్యోగులు మీడియాతో మాట్లాడిన అంశాలను పోలీసులు నమోదు చేసుకున్నారు. చర్చలకు వచ్చిన వారందరి పేర్లూ తీసుకున్నారు. డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఓ బృందం వారిపై ప్రత్యేక నిఘా పెట్టింది. విజయవాడలో సమావేశానికి అనుమతివ్వాలని పోలీసులకు ఏపీసీపీఎస్‌ఈఏ చేసిన దరఖాస్తుకు రసీదు కూడా ఇవ్వలేదు.

బొత్స ప్రత్యేక దౌత్యం
మంత్రుల కమిటీలో సభ్యుడైన మంత్రి బొత్స సత్యనారాయణ.. సీపీఎస్‌ ఉద్యోగులతో ఆందోళనలు విరమింపజేసేందుకు ప్రత్యేక దౌత్యం కొనసాగిస్తున్నారు. సీఎం ఇంటి ముట్టడిని వాయిదా వేసుకోవాలని సీపీఎస్‌యూఎస్‌కు ఆయన సూచించారు. మరో సంఘం సీపీఎస్‌ఈఏను గురువారం చర్చలకు రావాలని పిలిచారు. ఆందోళనలను అడ్డుకునేందుకు ఇంటెలిజెన్స్‌ విభాగం సర్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అనధికారికంగా నాయకులను రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ తీసుకువెళ్లిన ఈ విభాగం ప్రత్యేకంగానూ కలుస్తోంది.

సీపీఎస్‌ రద్దు చేసి, పాత పింఛన్‌ పథకం (ఓపీఎస్‌) అమల్లోకి తెస్తామని గత సాధారణ ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయాలన్నది సీపీఎస్‌ ఉద్యోగుల డిమాండ్‌. ఎలాంటి హామీ ఇవ్వని రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు ఓపీఎస్‌ అమలు చేసినప్పుడు ఇక్కడ సీపీఎస్‌ రద్దుకు ఇబ్బందేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తెరపైకి తెచ్చిన గ్యారంటీ పింఛన్‌ పథకం (జీపీఎస్‌)ను అంగీకరించేది లేదంటున్నారు. పింఛనుకు డీఏ, పీఆర్సీ అమలు చేసే విధానం ఏదైనా తమకు పర్వాలేదని వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఎప్పటిలాగే జీపీఎస్‌లోనే ఏమైనా సవరణలు కోరితే చేస్తామంటోంది. దీంతో చర్చల్లో పురోగతి కనిపించడం లేదు.

ఉద్యోగ సంఘాల మద్దతు
సీపీఎస్‌ ఉద్యోగుల ఆందోళనలకు మద్దతిస్తామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు ప్రకటించారు. ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్‌) సైతం మద్దతిస్తుందని ప్రధాన కార్యదర్శి భానుమూర్తి వెల్లడించారు. ఏపీ ఐకాస గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. సీపీఎస్‌ ఉద్యోగులకు మద్దతివ్వడంపై నిర్ణయం తీసుకోనుంది.

విజయవాడ పోలీసుల్లో టెన్షన్‌ టెన్షన్‌
పీఆర్సీపై ఫిబ్రవరి 3న బీఆర్టీఎస్‌ రోడ్డులో నిర్వహించిన ‘చలో విజయవాడ’కు భారీగా ఉద్యోగులు తరలివచ్చారు. ఈసారి సీఎం ఇంటి ముట్టడి, బహిరంగ సభకు ఎంత మంది వస్తారు? ఈ ఆందోళనలను అడ్డుకునేందుకు ఏం చేయాలనే దానిపై ఉన్నతాధికారుల్లో టెన్షన్‌ కొనసాగుతోంది. అనధికారికంగా సభ నిర్వహిస్తే జిల్లాల నుంచి ఎంత మంది వస్తారనేదానిపైనా పోలీసు ఉన్నతాధికారులు లెక్కలేస్తున్నారు. ఆగస్టు 31న వినాయకచవితి పండగ చేసుకోకుండా సెప్టెంబరు 1న ఆందోళనకు ఎక్కువ మంది ఉద్యోగులు వచ్చే అవకాశం ఉందా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు.

ఓపీఎస్‌పై నిర్ణయం వచ్చేవరకు ఆందోళన: మరియాదాస్‌, అధ్యక్షుడు, ఏపీసీపీఎస్‌యూఎస్‌

ప్రభుత్వం నుంచి ఓపీఎస్‌పై సానుకూల నిర్ణయం వచ్చే వరకు ఆందోళనలు కొనసాగుతాయి. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అధ్యయన నివేదికను మంత్రి బొత్స సత్యనారాయణకు ఇచ్చాం. ఇంటెలిజెన్స్‌, పోలీసుల ద్వారా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కార్యక్రమం నిర్వహిస్తాం. జీపీఎస్‌పై చర్చలంటే మాత్రం ఇక రాబోమని చెప్పాం.

ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?-అప్పలరాజు, అధ్యక్షుడు, ఏపీసీపీఎస్‌ఈఏ

మేం ఎవరిపైనా దాడి చేయడం లేదు. యుద్ధం ప్రకటించలేదు. సీపీఎస్‌ సమస్యపై సమావేశం పెట్టుకుంటామంటేనే అనుమతివ్వడం లేదు. చర్చించుకునేందుకే అవకాశం ఇవ్వకపోతే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనిపిస్తోంది. అనకాపల్లి కానిస్టేబుల్‌ ఫోన్‌ చేసి నోటీసు తీసుకోవాలని అడిగితే గురువారం వచ్చి తీసుకుంటామన్నాం. మీ ఇంటికి వెళ్తామంటున్నారు. కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.