ETV Bharat / city

పంచాయతీ నిధులు కాజేశారు...గవర్నర్​కు సర్పంచుల ఫిర్యాదు

author img

By

Published : May 20, 2022, 3:16 PM IST

Updated : May 21, 2022, 5:12 AM IST

Sarpanches complaint
Sarpanches complaint

Sarpanches complaint: రాష్ట్ర ప్రభుత్వం 7 వేల 660 కోట్ల పంచాయతీ నిధులు దొంగలించిందని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచుల సంఘం నేతలు గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్​ను కలిసి ఫిర్యాదు చేశారు.

పంచాయతీ నిధులు కాజేశారు...గవర్నర్ కు సర్పంచుల ఫిర్యాదు..

Sarpanches complaint: రాష్ట్ర ప్రభుత్వం రూ.7 వేల 660 కోట్ల పంచాయతీ నిధులు దొంగలించిందని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచుల సంఘం నేతలు గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్​ను కలిసి ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రంలోని 12వేల 918 గ్రామ పంచాయతీలకు పంపించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ డబ్బులు తిరిగి గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయించాలని కోరుతూ గవర్నర్​కు వినతిపత్రం అందించారు. జగన్ ప్రభుత్వానికి బుద్ది చెప్పి.. తమ నిధులు మాకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని వెల్లడించారు.

73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని సర్పంచ్ లు ఆరోపించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. గవర్నర్​కు ఇచ్చిన ఫిర్యాదుతో అయినా తమ నిధులు తమకు వస్తాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అప్పటికీ స్పందన లేకపోతే రాష్ట్రపతిని కూడా కలిసి వివరిస్తామన్నారు. జగన్ ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి తమ నిధులు వెంటనే అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

గవర్నర్‌కు సూచించిన ప్రశ్నలివే...

* 2018-19 నుంచి 2021-22 మధ్య 14, 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి నిధులు విడుదల చేసిందా?

* ఈ నాలుగేళ్లలో కేంద్రం విడుదల చేసిన రూ.7,659 కోట్లను గ్రామ పంచాయతీలకు కేటాయించి ఇందుకు సంబంధించిన ఖాతాలను సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌కు అనుసంధానించిన విషయం వాస్తవమేనా?

* రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం వాస్తవమైతే సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లోని పంచాయతీ ఖాతాలు జీరో మిగులుగా ఎందుకు చూపిస్తున్నాయి?

* రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవడం అవాస్తవమైతే నిధులు ఎక్కడ ఉన్నాయి?

* సర్పంచులు బాధ్యతలు చేపట్టిన మొదట్లోనూ పంచాయతీ ఆమోదం, సర్పంచి సంతకం లేకుండా ఒకసారి రూ.345కోట్లు, మరోసారి రూ.969కోట్లను మళ్లించిన విషయం వాస్తవమేనా?

నిధుల మళ్లింపుపై గవర్నర్‌ ఆశ్చర్యం: రాజేంద్రప్రసాద్‌

ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడంపై గవర్నర్‌ హరిచందన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ వెల్లడించారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్ని పంచాయతీల నుంచి ఈ విధంగా నిధులు మళ్లించారని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుందనే సందేహాన్ని గవర్నర్‌ వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల నుంచి నిధులు మళ్లించడంతో ఖాతాలు జీరో అయ్యాయని వివరించాం...’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష చర్యలతో నిధుల కొరత ఏర్పడి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేక సర్పంచులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్‌రెడ్డి అన్నారు. విషయాన్ని అవసరమైతే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి కూడా తీసుకెళతామని శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ఎ.రామకృష్ణనాయుడు తెలిపారు. విశాఖపట్నం, కృష్ణా జిల్లాల ప్రతినిధులు వానపల్లి ముత్యాలరావు, మూడే శివశంకర్‌ యాదవ్‌, వల్లూరు కిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి :

Last Updated :May 21, 2022, 5:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.