ETV Bharat / city

Cyber Crime: కొడితే బ్యాంకుల్నే కొట్టాలి !..సైబర్‌ నేరగాళ్ల నయా ఎత్తుగడ

author img

By

Published : Aug 20, 2021, 7:37 PM IST

రోజుకో రకం నేరం.. రెచ్చిపోతోంది సైబర్‌ కేటుగాళ్ల లోకం.. ఇప్పుడది ఖాతాదారులను దాటి ఏకంగా బ్యాంకులపైనే కన్నేసింది. ఏటీఎంలు లూటీ చేస్తోంది. డెబిట్, క్రెడిట్‌కార్డులను జేబులోంచి తీయకుండానే వాటిలోని డబ్బు దోచేస్తోంది. నెట్‌వర్క్‌లోకి చొరబడి రూ.కోట్ల సొమ్ము కొట్టేస్తోంది. కోరుకున్న దగ్గరికి మళ్లిస్తోంది.. ఇటీవల హైదరాబాద్‌లోని తెలంగాణ సహకార అపెక్స్‌ బ్యాంకులో రూ.1.96 కోట్లు కొల్లగొట్టిన నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్ళ కొత్త ఎత్తులు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ఆర్థిక సంస్థలను అప్రమత్తం చేసింది.
కొడితే బ్యాంకుల్నే కొట్టాలి !..సైబర్‌ నేరగాళ్ల నయా ఎత్తుగడ
కొడితే బ్యాంకుల్నే కొట్టాలి !..సైబర్‌ నేరగాళ్ల నయా ఎత్తుగడ

ఇప్పటి వరకూ సైబర్‌ నేరగాళ్లు మామూలు జనాలే లక్ష్యంగా మోసాలు చేస్తున్నారు. వారిని బుట్టలో వేస్తే రూ.వేలో, లక్షలో దొరుకుతాయి. అదే ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుంటే రూ.కోట్లు కొల్లగొట్టవచ్చు. ఇదే ఆలోచనతో ఇప్పుడు వారు పంథా మార్చుకుంటున్నారు. ఏటీఎంలలో భారీగా సొమ్ము ఉంటుంది. వాటిని తెరచి డబ్బు అపపహరించటం ఎంతో కష్టం. అందుకే మరో అడుగు ముందుకేసి ఏకంగా ఏటీఎంలనే ఏమార్చుతున్నారు. ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్, కోల్‌కతాలలో ఇలాంటి నేరాలు జరిగాయి. సైబర్‌ నేరగాళ్లు భద్రతా సిబ్బందిలేని ఏటీఎం సెంటరులోకి చొరబడతారు. ఏటీఎంకు ఉండే నెట్వర్క్‌ కనెక్షన్‌ వద్ద రాస్‌బెర్రీపై అనే చిన్న పరికరం అమర్చుతారు. మామూలుగా ఎవరైనా ఏటీఎంలోకి వెళ్ళి కార్డు పెట్టగానే వారి ఖాతాలో డబ్బు లేకుంటే అదే విషయం తెరమీద కనిపిస్తుంది. కానీ, ఏటీఎం కనెక్షన్‌ వద్ద నేరస్థులు పెట్టిన పరికరం బ్యాంకును ఏమార్చుతుంది. వారు ఏదో ఒక కార్డు ఏటీఎంలో పెట్టగానే.. అప్పటికే అమర్చిన పరికరంలోని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ నేరస్థులు ఉంచిన కార్డును అంగీకరించేలా చేస్తుంది. ఖాతాలో పెద్దమొత్తంలో డబ్బున్నట్లు సర్వర్‌ను నమ్మిస్తుంది. ఫలితంగా నేరస్థులు ఏటీఎంలో ఎంత మొత్తం సొమ్ము ఎంటర్‌ చేస్తే అంతా బయటకొస్తుంది. ఇలాంటి నేరాలు దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్నా.. పేరు దెబ్బతింటుందని బ్యాంకులేవీ బయటకు చెప్పుకోవడంలేదు.

సౌకర్యాల వెంటే తిప్పలూ..!

కార్డు వినియోగదారులకు బ్యాంకులు ‘నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌’ (ఎన్‌.ఎఫ్‌.సి.) వంటి అనేక అదనపు సదుపాయాలు కల్పిస్తున్నాయి. సాధారణంగా మనం ఏదైనా దుకాణంలో కొనుగోళ్లు చేయగానే డెబిట్, క్రెడిట్‌కార్డులను పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పి.ఒ.ఎస్‌.) మిషన్‌లో పెట్టి, పిన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. అప్పుడే కొనుగోలుకు సంబంధించిన డబ్బు దుకాణదారు ఖాతాకు జమవుతుంది. ఈ ప్రయాసేదీ లేకుండా చేసేదే ఎన్‌.ఎఫ్‌.సి. పద్ధతి. కార్డును పి.ఒ.ఎస్‌.కు సమీపంలోకి తెస్తే.. లావాదేవీ పూర్తవటం దీని ప్రత్యేకత. దీన్ని అడ్డం పెట్టుకొని సైబర్‌ నేరగాళ్లు రిమోట్‌తో పనిచేసే స్కిమర్లతో దోపిడీకి పాల్పడుతున్నారు. ఎన్‌.ఎఫ్‌.సి. సదుపాయమున్న కార్డులను లక్ష్యంగా చేసుకొని దోచుకుంటున్నారు. ఏ జేబులోనో ఈ స్కిమర్‌ను ఉంచుకుంటే చాలు. సమీపంలోని ఎన్‌.ఎఫ్‌.సి. సదుపాయం ఉండే డెబిట్, క్రెడిట్‌ కార్డుల సమాచారాన్నంతా అది తస్కరిస్తుంది. స్కిమర్‌లోని సాఫ్ట్‌వేర్‌ ప్రకారం ప్రతి కార్డు నుంచి దాని పరిమితి మేరకు దోచుకుంటుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఇలాంటి కేసులు ఇటీవల ఐదు నమోదయ్యాయి.

ర్యాట్‌తో పాట్లు

సైబర్‌ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల్లోకి చొరబడి దోచుకోవడం మామూలయింది. రిమోట్‌ యాక్సెస్‌ టూల్‌(ర్యాట్‌) పేరిట జరుగుతున్న ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ రిజర్వు బ్యాంకు అన్ని ఆర్థిక సంస్థలనూ అప్రమత్తం చేసింది. అపరిచితుల మెయిల్స్‌ను తెరవవద్దని హెచ్చరించింది. ఈ పద్ధతిలో సైబర్‌ నేరగాళ్లు బ్యాంకులో పనిచేసే సిబ్బందికి ఈ-మెయిల్‌ పంపుతారు. దాన్ని తెరవగానే వారి కంప్యూటర్లోకి ర్యాట్‌ చొరపడుతుంది. ఆ క్షణం నుంచి వారి కంప్యూటర్‌ సైబర్‌ నేరగాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. తద్వారా వాళ్లు బ్యాంకులోని డబ్బును ఆర్‌.టి.జి.ఎస్‌. ద్వారా తమ ఖాతాల్లోకి మళ్ళించుకుంటున్నారు. హైదరాబాద్‌ బ్యాంకులో జరిగింది ఇదే. అయితే లావాదేవీల పరిమితి తక్కువగా ఉండటంతో కేటుగాళ్లు రూ.1.96 కోట్లు మాత్రమే దోచుకోగలిగారు. ఈలోపు బ్యాంకు సిబ్బంది అప్రమత్తం కావడంతో మిగతా డబ్బు కాపాడుకోగలిగారు.

ఇదీ చూడండి: InterState Thieve: అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.