ETV Bharat / city

ఉత్తరాంధ్రలో వరుణ బీభత్సం.. పిడుగుపాటుకు ఒకరి మృతి

author img

By

Published : Apr 4, 2021, 5:20 AM IST

heavy rains in the state
ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్ష బీభత్సం.. పిడుగు పాటుకు ఒకరి మృతి

అండమాన్​ తీరంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. అనేక చోట్ల ఈదురు గాలులతో చెట్లు, తోటలు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో.. ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా రాత్రి భారీ వర్షాలు కురిశాయి. విశాఖ నగరంలో భారీ ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో పెద్ద ఎత్తున వర్షం బీభత్సం సృష్టించింది. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.

తీవ్రంగా ఈదురుగాలులు..

విశాఖ బీచ్‌ రోడ్డు, రైల్వే స్టేషన్‌, జ్ఞానాపురం, అక్కయ్య పాలెం, తాటిచెట్ల పాలెంతో పాటు గాజువాక, మధురవాడల్లో ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా కనిపించింది. అనేక చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోగా రహదారులు జలమయ్యాయి.

అనేక చోట్ల విరిగిపడిన చెట్లు..

విజయనగరం జిల్లాలో గాలివానకు.. అరటి, జీడి, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కురుపాం, గుమ్మ లక్ష్మీపురం, కోమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.

విద్యుత్ సరఫరాకు అంతరాయం..

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో వర్షానికి చెట్లు విరిగి తీగలపై పడడంతో.. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. సరుబుజ్జిలి మండలం పాలవలసలో.. పిడుగుపాటుతో ఒకరు మృతిచెందారు.

ఇదీ చదవండి:

ఉక్కు నగరాన్ని వణికిస్తున్న అకాల వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.