ఎటువంటి క్షామం లేకుండా ప్రజలంతా సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని ఏటా ఆశ్వయుజ పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారికి ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8 వరకూ జరిగిన దసరా ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఘనంగా సాగాయి. దసరా ఉత్సవాల ప్రారంభం నుంచి విజయదశమి వరకు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల నుంచి దుర్గమ్మకు సారె, పట్టువస్త్రాలు తీసుకొచ్చారు.
విజయదశమి రోజున మధ్యాహ్నం 12 గంటలకే ఉత్సవాలు ముగియడం వలన ఉదయం నుంచి దుర్గమ్మ దర్శనం కోసం ప్రముఖులు తరలివచ్చారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రవాణా శాఖ ఎండీ కృష్ణబాబు, తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రబాబు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రముఖులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి... దర్శనం అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వచనాలు అందజేశారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి యాగశాలలో దుర్గగుడి స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. దుర్గ గుడి ఈవో సురేష్ కుమార్ దంపతులు క్రతువులో పాల్గొని పూర్ణాహుతి నిర్వహించారు. దసరా ఉత్సవాలు వైభవంగా ముగియడం పట్ల ఈవో సంతోషం వ్యక్తం చేశారు. సాయంత్రం నగరోత్సవం అనంతరం కృష్ణానదిలో గంగా సమేత దుర్గామల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం నిర్వహించారు.
ఇదీ చదవండి :