పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నారా? ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

author img

By

Published : May 7, 2023, 2:28 PM IST

personal loan charges
personal loan charges ()

Personal Loan Charges : సాధారణంగా ఏవైనా అత్యవసర ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే అందరికీ గుర్తొచ్చేది.. వ్యక్తిగత రుణం. అందుకోసమే చాలా మంది వ్యక్తిగత రుణాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ బ్యాంకులు ఈ రుణాలపై అనేక రకాలైన ఛార్జీలను వసూలు చేస్తాయి. అవేంటో తెలుసుకోండి..

Personal Loan Charges : ఆర్థికంగా అత్యవసర పరిస్థితుల నుంచి బయట పడటానికి వ్యక్తిగత రుణం ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పుడు ఉన్న చాలా రకాల రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణం మాత్రమే అన్నింటికంటే వేగంగా లభిస్తుంది. ఈ రుణం పొందే సమయంలో ఎలాంటి పత్రాలు సమర్పించే అవసరం లేకపోవడమే ఇందుకు కారణం. పైగా గృహ, వాహన రుణాల్లా రుణ మొత్తం వినియోగం విషయంలోనూ ఎలాంటి పరిమితులూ ఉండవు. అందుకోసమే చాలా మంది వ్యక్తిగత రుణాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, వ్యక్తిగత రుణం విషయంలో బ్యాంకులు కొన్ని రకాల ఛార్జీలను వసూలు చేస్తుంటాయి. వ్యక్తిగత రుణం తీసుకునే ముందు ఈ ఛార్జీల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

ప్రాసెసింగ్‌ ఛార్జీలు
ప్రతి బ్యాంకూ రుణ గ్రహీత నుంచి ప్రాసెసింగ్‌ ఫీజును తప్పనిసరిగా వసూలు చేస్తుంటాయి. రుణాన్ని మంజూరు చేసేందుకు గానూ అయ్యే ఖర్చులను ఈ ఫీజు పేరిట రుణ గ్రహీత దగ్గర నుంచి తీసుకుంటాయి. దీన్ని రుణం తీసుకునే ప్రతి ఒక్కరూ తప్పక చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్‌ ఫీజుకు కనిష్ఠ, గరిష్ఠ మొత్తాలను బ్యాంకులు నిర్ణయిస్తాయి. సగటున ఈ ఫీజు 0.25 శాతం నుంచి 2.5 శాతం వరకు ఉంటుంది. కొన్ని బ్యాంకులు 3 శాతం కూడా వసూలు చేస్తుంటాయి. బ్యాంకును బట్టి ఈ ఛార్జీల్లో మార్పు ఉంటుంది.

వెరిఫికేషన్‌ ఛార్జీలు
రుణాన్ని మంజూరు చేసే ముందు ప్రతి బ్యాంకూ రుణ గ్రహీత చెల్లింపు సామర్థ్యాన్ని తెలుసుకుంటాయి. తిరిగి చెల్లించగలరనే నమ్మకం ఉన్న వినియోగదారులకే బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అందుకోసమే మీ చెల్లింపు సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి బ్యాంక్‌కు చెందిన వ్యక్తి గానీ, థర్డ్‌ పార్టీ వ్యక్తి గానీ మీ వివరాలను తెలుసుకుంటారు. మీ రుణ చరిత్ర, క్రెడిట్‌ రిపోర్ట్‌ వంటివి పరిశీలిస్తారు. దీని కోసం బ్యాంక్‌ కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తుంది. ఆ మొత్తాన్ని కూడా వెరిఫికేషన్‌ ఛార్జీల పేరిట రుణగ్రహీత నుంచి వసూలు చేస్తుంది.

ఈఎంఐ కట్టకపోతే
ఇక రుణం మంజూరు తర్వాత బ్యాంకులు మన దగ్గర వసూలు చేసే ఛార్జీల గురించి తెలుసుకుందాం. వ్యక్తిగత రుణం తీసుకున్నవారు EMI చెల్లింపుల కోసం ఎల్లప్పుడూ కొంత సొమ్మును బ్యాంకులో దాచుకోవాలి. నిర్దేశించిన తేదీ నాటికి ఆ మొత్తం బ్యాంకులో ఉండేట్లు చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా నెల మీరు ఈఎంఐ సకాలంలో చెల్లించకపోతే మీ దగ్గర నుంచి బ్యాంకు కొంత మొత్తం వసూలు చేస్తుంది. ఈఎంఐ ఎగవేత/బౌన్స్‌ అయిన సందర్భాల్లో కొన్ని బ్యాంకులు రూ.500+ పన్నులను వసూలు చేస్తాయి. ఇది బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఈఎంఐలను సకాలంలో చెల్లించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి కాలవ్యవధి, ఈఎంఐ మొత్తాన్ని ఎంచుకోవాలి.

ముందస్తు చెల్లింపులు చేసినా..
బ్యాంకులకు ప్రధాన ఆదాయ వనరు రుణాలపై వచ్చే వడ్డీనే. ఏదైనా కారణం వల్ల రుణ గ్రహీతలు తమ రుణాన్ని ముందుగానే చెల్లించడానికి సిద్ధపడితే బ్యాంక్‌ ఆ వడ్డీ మొత్తాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అందువల్లే ముందస్తు చెల్లింపులపై బ్యాంకులు పెనాల్టీలు విధిస్తాయి. సాధారణ బ్యాంకులు వ్యక్తిగత రుణ చెల్లింపులపై 2-4 శాతం వరకు పెనాల్టీని విధిస్తున్నాయి. రుణ చెల్లింపుల్లో మిగిలిన కాలానికి అసలుపై ఫోర్‌క్లోజర్‌, ప్రీపేమెంట్‌ పెనాల్టీ పేరిట ఈ ఛార్జీలను వసూలు చేస్తాయి. బ్యాంకును బట్టి ఈ ఛార్జీలు మారుతాయి. కొన్ని బ్యాంకులు రుణం తీసుకున్న 12 నెలల తర్వాత మాత్రమే ముందస్తు చెల్లింపులకు అనుమతిస్తాయి. అలాగే, మిగిలిన ఉన్న కాలం ఆధారంగా పెనాల్టీ మొత్తం మారుతూ ఉంటుంది.

ఇవీ చదవండి : టాటా కార్లపై భారీ డిస్కౌంట్​లు.. ఈ ఒక్క నెల మాత్రమే ఛాన్స్​​!

ఇంటర్నెట్​ వాడకంలో దూసుకెళ్తున్న భారత్​.. నెలలో 76 కోట్ల మంది ఒక్కసారైనా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.