ETV Bharat / business

ఇంటర్నెట్​ వాడకంలో దూసుకెళ్తున్న భారత్​.. నెలలో 76 కోట్ల మంది ఒక్కసారైనా..!

author img

By

Published : May 5, 2023, 7:31 AM IST

Updated : May 5, 2023, 7:40 AM IST

internet usage in india
internet usage in india

అంతర్జాల వాడకంలో భారత్‌ దూసుకుపోతోంది. దేశ జనాభాలో ఇంటర్నెట్‌ వాడే వారి సంఖ్య తొలిసారి 50 శాతం దాటింది. గతేడాది దేశ జనాభాలో 75.9కోట్ల మంది నెలలో కనీసం ఒకసారైనా ఇంటర్నెట్‌ వాడినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. 2025నాటికి దేశంలోని కొత్త ఇంటర్నెట్ వినియోగదారుల్లో 56 శాతం మంది గ్రామీణప్రాంతాలకు చెందినవారే ఉంటారని అంచనా.

ఇంటర్నెట్‌ వినియోగంలో భారత్‌ దూసుకెళ్తోంది. 2022 నాటికి దేశ జనాభాలో 50 శాతానికిపైగా నగర, గ్రామీణ ప్రాంత ప్రజలు కలిపి నెలలో కనీసం ఒకసారైనా ఇంటర్నెట్‌ వాడుతున్నట్లు ఓ నివేదికలో వెల్లడించింది. దేశ జనాభాలో సగానికి పైగా అంతర్జాలాన్ని వినియోగించడం ఇదే మొదటిసారి. భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగంపై ఇంటర్నెట్‌ ఇన్‌ ఇండియా-2022 పేరిట ఐఏఎంఏఐ, కాంటార్‌ సంస్థలు ఈ మేరకు నివేదిక రూపొందించాయి.

ఇంటర్నెట్‌ వాడకదారుల సంఖ్య 2025 నాటికి 90 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశాయి. మొత్తం 75.9 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 39.9 కోట్ల మంది గ్రామీణ, 36 కోట్ల మంది పట్టణాలకు చెందినవారు ఉన్నారు. గతేడాది పట్టణాలకు సంబంధించి 6 శాతంతో పోలిస్తే గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగంలో 14 శాతం వృద్ధి నమోదైంది. 2025 నాటికి దేశంలోని కొత్త ఇంటర్నెట్ వినియోగదారుల్లో 56 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే ఉంటారని అంచనా.

గోవాలో అత్యధికంగా 70శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా.. బిహార్‌లో 32శాతం మాత్రమే ఉన్నారు. అంతర్జాలాన్ని అధికంగా వినోదరంగం, డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌, సామాజిక మాధ్యమాల కోసం వినియోగిస్తున్నట్లు ఐఏఎంఏఐ, కాంటార్‌ సంస్థల నివేదిక తేల్చింది. ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 54శాతం మంది పురుషులు ఉండగా.. 2022లో నమోదైన కొత్త వినియోగదారుల్లో 57శాతం మంది మహిళలే ఉండటం సానుకూల అంశమని నివేదిక పేర్కొంది. 2025 నాటికి కొత్త వినియోగదారుల్లో 65శాతం మంది మహిళలే ఉంటారని అంచనా వేసింది.

దీంతో ఇంటర్నెట్‌ వినియోగంలో స్త్రీ- పురుష అంతరాలు తగ్గుతాయని తెలిపింది. డిజిటల్ చెల్లింపుల్లో 2021తో పోలిస్తే 2022లో 13శాతం వృద్ధి నమోదై 33.8 కోట్ల మంది వినియోగదారులకు చేరుకుంది. అందులో 36శాతం మంది గ్రామాలకు చెందినవారు. మొత్తం డిజిటల్ చెల్లింపుల వినియోగదారుల్లో 99శాతం మంది యూపీఐ వాడుతున్నారని తెలిపింది.

రోజుకు ఎన్ని జీబీల డేటా వాడేస్తున్నారో తెలుసా?
అయితే మనదేశంలో మొబైల్‌ ఫోన్లలో ఇంటర్నెట్‌ వాడకం శరవేగంగా పెరిగిపోతోంది. గత ఐదేళ్లలో మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వాడేవారి సంఖ్య 34.5 కోట్ల నుంచి 76.5 కోట్లకు ఎగబాకటమే దీనికి నిదర్శనం. సగటున ఒక్కొక్కరు నెలకు 17జీబీ డేటాను వాడుకుంటున్నారు. యువతరమైతే రోజుకు 8 గంటలు ఆన్‌లైన్‌లోనే గడుపుతుండటం.. ఇంటర్నెట్‌ వాడేవారిలో 90% మంది స్థానిక భాషలకు మొగ్గు చూపుతుండటం విశేషం. నోకియా సంస్థ ఏటా విడుదల చేసే 'మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇండెక్స్‌ రిపోర్టు 2022' చెబుతున్న వివరాలివి. దీని ప్రకారం.. మనదేశంలో 2021లో మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ డేటా వృద్ధి రికార్డు స్థాయికి చేరుకుంది. 4జీ మొబైల్‌ డేటా 31% పెరగగా.. నెలవారీ సగటు వినియోగం 26.6% పెరిగింది.

Last Updated :May 5, 2023, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.