ETV Bharat / business

మొబైల్‌ కొనాలనుకుంటున్నారా, త్వరలో ధరలు పెరిగే ఛాన్స్‌

author img

By

Published : Aug 23, 2022, 5:31 AM IST

మన దేశంలో దాదాపు చైనాకు చెందిన కంపెనీల స్మార్ట్​ఫోన్లే ఎక్కువగా విక్రయమవుతున్నాయి. కంపెనీలు పొరుగు దేశానికి చెందినప్పటికీ భారతలోనే తయారు చేసి వీటిని విక్రయిస్తున్నాయి. ఆయా కంపెనీలు విడిభాగాలను మాత్రం ఇప్పటికీ చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. తాజాగా వాటిపై కస్టమ్స్‌ ట్యాక్స్​ విధిస్తున్నట్లు సీబీఐసీ ప్రకటించింది. దీంతో కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై వేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే స్మార్ట్‌ఫోన్‌ ధరలు పెరగనున్నాయి.

Smart Phone Price Hike
Smart Phone Price Hike

Smart Phone Price Hike: దేశంలో విక్రయమవుతున్న స్మార్ట్‌ఫోన్లలో దాదాపు చైనాకు చెందిన కంపెనీలవే ఎక్కువగా ఉంటున్నాయి. కంపెనీలు పొరుగు దేశానికి చెందినప్పటికీ.. భారతలోనే తయారు చేసి వీటిని విక్రయిస్తున్నాయి. అయితే, ఆయా కంపెనీలు విడిభాగాలను మాత్రం ఇప్పటికీ చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఇలా దిగుమతి చేసుకునే విడి భాగాలపై విధించే కస్టమ్స్‌ సుంకం విషయంలో కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) కొన్ని మార్పులు చేసింది. మొబైల్‌ డిస్‌ప్లేకు అనుసంధానించే ఉత్పత్తులపై 15 శాతం బేసిక్‌ కస్టమ్స్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులకు బదలాయించే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే స్మార్ట్‌ఫోన్‌ ధరలు కొంతమేర పెరగనున్నాయి.

మొబైల్‌ డిస్‌ప్లేకు అనుసంధానించే స్పీకర్లు, సిమ్‌ ట్రే, పవర్‌ కీ వంటి ఉత్పత్తులపై 15 శాతం బేసిక్‌ కస్టమ్స్‌ సుంకం విధిస్తున్నట్లు ఇటీవల సీబీఐసీ వెల్లడించింది. ప్రస్తుతం మొబైల్‌ ఫోన్ల డిస్‌ప్లేపై 10 శాతం కస్టమ్స్‌ సుంకం విధిస్తున్నారు. డిస్‌ప్లే అసెంబ్లీ తయారీలో వినియోగించే భాగాలపై సుంకం ఏమీ విధించడం లేదు. సిమ్‌ ట్రే, యాంటెన్నా పిన్‌, స్పీకర్‌ నెట్‌, పవర్‌ కీ, స్లైడర్‌ స్విచ్‌, బ్యాటరీ భాగం, ఫింగర్‌ ప్రింట్‌కు ఉపయోగపడే ఫ్లెక్సిబుల్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌లు డిస్‌ప్లేతో వచ్చినా, విడిగా దిగుమతి చేసుకున్నా 15 శాతం దిగుమతి సుంకం చెల్లించాల్సిందేనని స్పష్టంచేసింది.

చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీలు ఒప్పో, వివో ఇటీవల పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, మొబైల్‌ భాగాలకు సంబంధించిన కస్టమ్స్‌ నిబంధనల పట్ల స్పష్టత లేకపోవడం వల్లే పొరపాటు జరిగిందని పేర్కొన్నాయి. దీంతో సుంకం ఎగవేతలను నివారించేందుకే ఈ స్పష్టత ఇస్తున్నట్లు సీబీఐసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు ఇప్పుడు 15 శాతం పన్ను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తయారీ కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి: యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు, క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ

క్రెడిట్​ కార్డు లిమిట్​ పెంపుతో లాభమా, నష్టమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.