ETV Bharat / business

భవిష్యత్​ అవసరాలు తీర్చేలా పన్ను ఆదా.. వీటిల్లో ఇన్వెస్ట్​ చేస్తే!

author img

By

Published : Jun 11, 2022, 7:47 AM IST

Investment for Tax Saving: పన్ను మినహాయింపు లభించే పథకాల్లో పెట్టుబడులు పెట్టాలని ఎక్కువ మంది భావిస్తుంటారు. అయితే పెట్టుబడుల విషయంలో పన్ను మినహాయింపు ఒక్కటే లక్ష్యం కాకూడదంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. మరి ఏం చేయాలంటే..?

investment for tax saving
investment plans in india

Investment for Tax Saving: ఆదాయపు పన్ను భారం తగ్గించుకునేందుకు తగిన ప్రణాళికలు వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో అందరూ పన్ను మినహాయింపు లభించే పథకాల్లో ఎంత మేరకు పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతోనే ఉంటారు. ఒక పెట్టుబడి పెట్టేటప్పుడు కేవలం పన్ను మినహాయింపు ఒక్కటే లక్ష్యం కాకూడదు. భవిష్యత్‌లో మన అవసరాలనూ అది తీర్చేలా ఉండాలి. అందుకోసం ఏం చేయాలో చూద్దాం..

మనదగ్గర మిగులు మొత్తాన్నంతా పన్ను ఆదా పథకాల్లోకి మళ్లించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఉదాహరణకు మీ దగ్గర పెట్టుబడి కోసం రూ.5లక్షలున్నాయనుకుందాం. వీటిని సెక్షన్‌ 80సీ పరిధిలో ఉండే పథకాల్లోనే మదుపు చేసేందుకు వీలుంది. కానీ, ఈ సెక్షన్‌ కింద గరిష్ఠంగా రూ.1,50,000 వరకే మినహాయింపు కోసం అనుమతి ఉంటుంది. మదుపు చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉద్యోగులకు ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) ఉంటుంది. కాబట్టి, దీనికోసం ఎంత చెల్లిస్తున్నారో చూసుకొని, ఆ తరువాత అవసరమైన మొత్తాన్నే పన్ను ఆదా పథకాలకు మళ్లించాలి. పీపీఎఫ్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, జీవిత బీమా ప్రీమియం, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీం, జాతీయ పొదుపు పత్రాల వంటివి ఇందులో ఉంటాయి. సెక్షన్‌ 80సీ పరిమితి రూ.1,50,000 మించీ వీటిలో మదుపు చేసుకునే వీలుంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌ మినహా మిగతావన్నీ సురక్షిత పథకాలే.

చిన్న వయసులో ఉన్న వారు పన్ను ఆదా కోసం ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పరిశీలించవచ్చు. వీటికి మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. నష్టాన్ని భరించే శక్తి అధికంగా ఉన్నవారికి ఇవి సరిపోతాయి. మధ్య వయసులో ఉన్న వారు.. కొంత మొత్తాన్ని ఈఎల్‌ఎస్‌ఎస్‌లకు కేటాయించి, మిగతాది సురక్షిత పథకాల్లో మదుపు చేయాలి. రూ.50,000 వరకూ ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అదనంగా పన్ను మినహాయింపు లభిస్తుంది. మిగులు మొత్తం అధికంగా ఉండి, 25-30 శాతానికి మించి పన్ను శ్లాబులో ఉన్నవారు దీన్ని పరిశీలించాలి.

పదవీ విరమణకు దగ్గరగా ఉన్నవారు..పెట్టుబడి కోసం కేటాయిస్తున్న మొత్తంలో 60 శాతాన్ని సురక్షిత పథకాల్లో పెట్టుబడి పెట్టాలి. ఈపీఎఫ్‌లో జమ సురక్షితమే. కాబట్టి, మదుపు మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు ఈ విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. కేవలం పన్ను ఆదా మాత్రమే కాకుండా.. భవిష్యత్‌ ఆర్థిక లక్ష్యాల సాధనకూ ఇవి ఉపయోగపడేలా తగిన ప్రణాళిక ఉండాలి. అధిక రాబడి ఆర్జించే పథకాల్లో పన్ను ప్రయోజనాలు లేకున్నా.. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి సహకరిస్తాయి.

- వికాస్​ సింఘానియా, ట్రేడ్‌స్మార్ట్​ సీఈఓ

ఇదీ చూడండి: వెంటాడుతున్న ద్రవ్యోల్బణం భయాలు.. మరి పెట్టుబడుల సంగతేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.