ETV Bharat / business

క్యారీ బ్యాగ్​పై డబ్బులు వసూలు చేశారా? ఇలా చేస్తే పరిహారం గ్యారెంటీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 1:42 PM IST

Can Retailers Charge You For Carry Bags In Telugu : మనం షాపింగ్ చేసినప్పుడు, సరకుల కోసం షాపు వాళ్లు క్యారీ బ్యాగ్ ఇస్తారు. దానిపై డబ్బులు కూడా వసూలు చేస్తుంటారు. అయితే ఇలా వినియోగదారులకు ఇచ్చే క్యారీ బ్యాగ్​లపై, షాపు వాళ్లు డబ్బులు వసూలు చేయవచ్చా? వాస్తవానికి నిబంధనలు ఏమి చెబుతున్నాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Are you being charged for carry bags
Can retailers charge you for carry bags

Can Retailers Charge You For Carry Bags : దిల్లీలోని ఓ ఫ్యాషన్ దుస్తుల దుకాణంవాళ్లు తమ కస్టమర్​కు ఇచ్చిన క్యారీ బ్యాగ్​పై రూ.7 వసూలు చేశారు. దీనితో దిల్లీ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్​ (DCDRC) సదరు వినియోగదారునికి రూ.3000 చెల్లించాలని షాపువాళ్లను ఆదేశించింది.

ప్రముఖ ఫర్నీచర్ కంపెనీ అయిన ఐకియాలో ఓ వినియోగదారుడు వస్తువులను కొన్నాడు. అతనికి ఐకియా లోగో ఉన్న క్యారీ బ్యాగ్​ ఇచ్చి, దానిపై రూ.20 వసూలు చేశారు. దీనితో బెంగళూరు బేస్డ్​ కన్జూమర్​ కోర్ట్, సదరు ఐకియా స్టోర్​కు రూ.3000 జరిమానా విధించింది.

చండీగఢ్​కు చెందిన ఓ షాపువాళ్లు కస్టమర్​కు ఇచ్చిన క్యారీ బ్యాగ్​పై రూ.10 వసూలు చేశారు. దీనితో చండీగఢ్ వినియోగదారుల కోర్టు సదరు షాపుపై రూ.26,000 జరిమానా విధించింది.

కోర్టు తీర్పులు ఇలా ఉన్నప్పటికీ, రిటైలర్ల వాదన మరో విధంగా ఉంది. కస్టమర్లకు ఇచ్చే క్యారీ బ్యాగ్​లపై డబ్బులు వసూలు చేయకూడదని ఏ చట్టంలోనూ లేదని వారు వాదిస్తున్నారు. ఇంతకీ చట్టంలో ఏముంది?

రూల్స్​లో లోపాలు
కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన కోసం 2011లో ప్లాస్టిక్ వేస్ట్​ మేనేజ్​మెంట్ రూల్స్​ను తీసుకొచ్చింది. దీని ప్రకారం, రిటైలర్లు తమ వినియోగదారులకు ఉచితంగా క్యారీ బ్యాగ్​లు అందించకూడదు. దీని ప్రధాన ఉద్దేశం, ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని అరికట్టడం. కానీ చిల్లర వ్యాపారులు ఈ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్లాస్టిక్ బ్యాగులపై మాత్రమే కాకుండా, కాగితపు సంచులు, గుడ్డ సంచు(క్లాత్ బ్యాగ్)లపై కూడా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనల్లో కాగితపు సంచులు, గుడ్డ సంచుల గురించి ప్రత్యేకంగా పేర్కొనకపోవడమే ఇందుకు కారణం.

ధరల నిర్ణయంలోనూ
వాస్తవానికి తయారీ ఖర్చులు, వ్యర్థాల నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని, ఈ ప్లాస్టిక్ బ్యాగ్​ల ధరలను పౌర సంస్థలు నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ ఇది వాస్తవంలో జరగడం లేదు. కంపెనీలు, రిటైలర్లు తమకు నచ్చిన విధంగా ధరలను నిర్ణయించుకుంటున్నారు.

నిబంధనలను సవరించినా
రిటైలర్లు పేపర్ బ్యాగులపై డబ్బులు వసూలు చేస్తుండడం సహా, క్యారీ బ్యాగుల ధరలను నియంత్రించడంలో పౌర సంస్థలు విఫలం కావడాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం 2016లో నిబంధనలను సవరించింది. 'క్యారీ బ్యాగ్​ల స్పష్టమైన ధర' అనే కొత్త సెక్షన్​ను తీసుకొచ్చింది. రిటైలర్లు ప్రభుత్వానికి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ రుసుములను కచ్చితంగా చెల్లించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, రిటైలర్లు తమ అవుట్​లెట్లలో, 'డబ్బులకు మాత్రమే ప్లాస్టిక్ సంచులు ఇస్తాం' అని నోటీస్​ బోర్డ్​లో పెట్టాలని ఆదేశించింది.

కానీ ఇది కూడా ఏమాత్రం పనిచేయలేదు. దీనితో కేంద్ర ప్రభుత్వం 2018లో మరో సవరణ చేసింది. ఇది 2016లో తెచ్చిన సెక్షన్​ను పూర్తిగా విస్మరించింది. ఈ కొత్త నిబంధనలో క్యారీ బ్యాగ్​ల ధరల గురించి ఏమీ ప్రస్తావించలేదు. అంతేకాదు పేపర్ క్యారీ బ్యాగుల గురించి కూడా ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు.

వ్యాపారుల వాదన ఏమిటి?
పై కారణాల వల్ల, ప్రస్తుతం కస్టమర్లకు ఉచితంగా క్యారీ బ్యాగ్‌లను ఇవ్వాలని చెప్పే చట్టంగానీ, నిబంధన కానీ ఏదీ లేదని రిటైలర్లు వాదిస్తున్నారు. అంతేకాదు, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలు - ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లను వినియోగదారులకు విక్రయించడాన్ని నిషేధించలేదని వారు చెబుతున్నారు.

ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి, జీవుల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందువల్ల వీటిని ఉపయోగించేవారిపై 'పొల్యూటర్స్ పే' వసూలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారుల కంటే, వినియోగదారులే ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగిస్తారు. అందువల్ల వినియోగదారుల నుంచే ఈ 'పొల్యూటర్స్ పే' వసూలు చేయాలని వ్యాపారులు వాదిస్తున్నారు.

ప్లాస్టిక్ బ్యాగ్​ అమ్మకాలపై నిషేధం
2022 డిసెంబర్​ 31 నుంచి, 120 మైక్రాన్ల కంటే సన్నగా ఉండే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్​ల అమ్మకాలపై నిషేధం విధించారు.

ఇంతకీ ప్లాస్టిక్ బ్యాగ్​లపై డబ్బులు వసూలు చేయవచ్చా?
వాస్తవానికి వ్యాపారులు తమ కస్టమర్లకు ఇచ్చే ప్లాస్టిక్ బ్యాగ్​లపై డబ్బులు వసూలు చేయవచ్చు. కానీ, బిల్లు వేసే ముందే ఆ విషయాన్ని వినియోగదారుడికి చెప్పాలి. ఒక వేళ కస్టమర్​కు చెప్పకుండా డబ్బులు వసూలు చేస్తే, అది చట్టవిరుద్ధం అవుతుందని న్యాయస్థానాలు చెబుతున్నాయి.

2021లో హైదరాబాద్‌లోని వినియోగదారుల కోర్టు, బ్యాగ్‌లపై కంపెనీ లోగో ముద్రించి ఉంటే, దానిని కస్టమర్లకు ఉచితంగా అందించాలని స్పష్టం చేసింది. అయితే, వినియోగదారుని ముందస్తు అనుమతితో, వాటిపై కూడా ఛార్జ్ వసూలు చేయవచ్చని పేర్కొంది.

అ, ఆ సాధన మొదలు పెట్టారా? - 2024లో సూపర్ సక్సెస్ ఫార్ములా!

ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డ్​ బెనిఫిట్స్​లో కోత - ఇకపై వారికి మాత్రమే లాంజ్‌ యాక్సెస్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.