ETV Bharat / bharat

సీబీఐ అభ్యర్థనల 'పెండింగ్'​పై సుప్రీంకోర్టు అసహనం

author img

By

Published : Nov 8, 2021, 5:52 PM IST

కేసుల విచారణ కోసం 8రాష్ట్ర ప్రభుత్వాలకు సీబీఐ పంపిన అభ్యర్థనలు పెండింగ్​లోనే ఉండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇది ఏమాత్రం ఆమోగయోగ్యం కాదని స్పష్టం చేసింది.

supreme court latest news
సుప్రీంకోర్టు

కేసుల దర్యాప్తునకు అనుమతివ్వాలని కోరుతూ.. 2018 నుంచి ఈ ఏడాది జూన్​ వరకు.. బంగాల్​, మహారాష్ట్ర సహా 8 రాష్ట్రాలకు సీబీఐ పంపిన అభ్యర్థనలు పెండింగ్​లోనే ఉండిపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న పలు కేసులపై అప్పీలెట్​ కోర్టులు స్టే విధించడాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ పరిస్థితి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.

2018లో ఓ కేసుకు సంబంధించి జమ్ముకశ్మీర్​ హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకిస్తూ.. సీబీఐ 542రోజులు ఆలస్యంగా అప్పీలు చేసుకుంది. ఇంత ఆలస్యం ఎందుకైంది? ప్రాసిక్యూషన్​ బృందాన్ని బలోపేతం చేయడం, లోపాలు సరిదిద్దడం, దర్యాప్తు సంస్థ విచారిస్తున్న కేసుల్లో నేరస్థులను పట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అఫిడవిట్​ దాఖలు చేయాలని సీబీఐ డైరక్టర్​ను గతంలో ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. సంబంధిత అఫిడవిట్​ను సుప్రీంకోర్టుకు సమర్పిస్తూ రెండు అంశాలను లేవనెత్తారు సీబీఐ డైరక్టర్​. ఒకటి 8 రాష్ట్రాల్లో పెండింగ్​లో ఉన్న అభ్యర్థనలు కాగా, మరొకటి.. సంస్థ దర్యాప్తు చేపట్టిన కేసులపై అప్పీలెట్​ కోర్టులు స్టే విధించడం.

ఈ వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టింది జస్టిస్​ ఎస్​కే కౌల్​, ఎంఎం సుంద్రేశ్​తో కూడిన ధర్మాసనం. 2018- 2021 జూన్​ మధ్య కాలంలో మహారాష్ట్ర, పంజాబ్​, ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​, ఝార్ఖండ్​, బంగాల్​, కేరళ, మిజోరామ్​ రాష్ట్రాలకు సీబీఐ 150 అభ్యర్థనలు పంపినట్టు గ్రహించింది.

"78శాతం కేసులకు సంబంధించి అభ్యర్థనలు రాష్ట్రాలకు పంపారు. ఈ కేసుల్లో దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపించే బ్యాంకు మోసాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ అభ్యర్థనలను పెండింగ్​లో ఉంచడం సరైన విషయం కాదు."

-- సుప్రీం ధర్మాసనం.

సీబీఐ డైరక్టర్​ చెప్పిన రెండు సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ వ్యవహారాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది.

వర్చువల్​ విచారణపై..

న్యాయస్థానాల్లో వర్చువల్‌ విధానంలో.. కేసుల విచారణ సమస్యలతో కూడుకున్నదని సుప్రీంకోర్టు పేర్కొంది. వర్చువల్‌గా కేసు విచారణ కొనసాగింపును వ్యాజ్యం దారుల ప్రాథమిక హక్కుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు పేర్కొంది. ఏడాది కాలంగా వర్చువల్‌గా కేసుల విచారణ జరుపుతున్నప్పటికీ.. ఇందులో ఎన్నో సమస్యలు ఉన్నాయని జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వర రావు, జస్టిస్‌ బీ.ఆర్‌ గవాయి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. రోజుకు ప్రత్యక్షంగా 60నుంచి 65 కేసులు విచారణ జరిపే న్యాయస్థానాలు.. ఏడాది వ్యవధిలో వర్చువల్‌గా 30నుంచి 35 కేసులు మాత్రమే.. రోజూ విచారణ చేశాయని ధర్మాసనం తెలిపింది. కొత్త విధానంలో కోర్టులను పనిచేయించాలని ప్రయత్నించామన్న సుప్రీంకోర్టు అయితే అనుకున్న మేర.. ఆ విధానం సత్ఫలితాలు ఇవ్వలేదని పేర్కొంది. వర్చువల్‌గా కేసుల విచారణ ప్రామాణికం కానందున.. తిరిగి భౌతిక విచారణకు మళ్లుతున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:- దేశ ద్రోహం కేసులో నిందితుడికి విముక్తి ఉత్తర్వు రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.