ETV Bharat / bharat

'మూడేళ్లలోపు తీర్పు రాకపోతే న్యాయాన్ని తిరస్కరించినట్లే'

author img

By

Published : Sep 5, 2021, 8:17 AM IST

దేశంలోని కోర్టుల్లో పేరుకుపోయిన కేసులు న్యాయవ్యవస్థకు సవాల్​గా మారాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్​ రిజిజు అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి నిరంతరం బాసటగా నిలుస్తున్న వ్యక్తి సీజేఐ జస్టిస్ ఎన్​.వి. రమణ అని కొనియాడారు.

కిరణ్ రిజిజు
కిరణ్ రిజిజు

ఏ కేసులోనైనా మూడేళ్లలోపు తీర్పు వెలువరించకపోతే న్యాయాన్ని తిరస్కరించినట్లేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. సాధారణంగా మూడేళ్ల తర్వాత ఎవరికైనా న్యాయం అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. శనివారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. "కొవిడ్‌-19లాంటి సంక్షోభ సమయంలోనూ ప్రజలకు న్యాయం అందిస్తూ ఎన్నో దేశాల న్యాయ వ్యవస్థలకు సుప్రీంకోర్టు మార్గదర్శిగా నిలిచింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడటమే కాకుండా, దాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతరం బాసటగా నిలుస్తోంది. కిందిస్థాయి కోర్టుల్లో మౌలిక వసతులు పెంచడానికి నిర్ణయించాం.

కిరణ్ రిజిజు
జస్టిస్‌ ఎన్‌.వి.రమణ-కిరణ్ రిజిజు

పెండింగ్‌ కేసులు, ముఖ్యంగా కింది కోర్టుల్లో పేరుకుపోయిన కేసులు మనందరికీ సవాల్‌. సామాన్య ప్రజలు సత్వర న్యాయాన్ని కోరుకుంటారు. న్యాయం కోసం వారు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి కూడా సకాలంలో న్యాయం అందించాలి. నేను జస్టిస్‌ రమణ నుంచి అదే ఆకాంక్షిస్తున్నాను. మేం ఏది ఆశిస్తున్నామో ఆయన కచ్చితంగా అదే చేస్తున్నారు" అని మంత్రి పేర్కొన్నారు. 'జస్టిస్‌ రమణ వ్యక్తిత్వం, నేపథ్యం గురించి నాకు మొదట్లో పెద్దగా తెలియదు. నిబద్ధత, సంపూర్ణ విశ్వాసం గల ప్రధాన న్యాయమూర్తి భారతదేశానికి ఉన్నారని ఆయన్ని కలిసిన తొలి భేటీలోనే అనిపించింది. ఆయన హయాంలో భారత ప్రజలకు సంపూర్ణమైన న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగింది' అని చెప్పారు. ప్రధాన న్యాయమూర్తి గురించి ఎవరేం అన్నారంటే..

మానవత్వం ఉన్న న్యాయమూర్తి..

విల్సన్‌, న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు
తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్

గొప్ప న్యాయమూర్తిగానే కాకుండా మానవత్వం ఉన్న మనిషిగా జస్టిస్‌ రమణ నాకు తెలుసు. న్యాయ మేధోశక్తి, విజ్ఞానం, నిష్పక్షపాత వైఖరిలాంటివి ఎన్ని ఉన్నా మానవత్వం.. మనిషిని మిగతా వారికంటే గొప్ప స్థానంలో నిలుపుతుంది. ఆయన న్యాయవాదుల కుటుంబానికి కర్తలాంటివారు.

- తుషార్‌ మెహతా, సొలిసిటర్‌ జనరల్‌

అసాధారణ పరిపాలన దక్షుడు..

జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి
జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి

ఉన్నత స్థాయికి వచ్చిన కొందరు వ్యక్తులు కోపం, అహం ప్రదర్శిస్తుంటారు. జస్టిస్‌ రమణను చూసిన తర్వాత ఆయన ఆ పదవికే గర్వకారణంగా మారారని చెప్పక తప్పదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను ఆయన్ని కలిసినప్పుడు జూనియర్‌ జడ్జిగా నన్ను చూడలేదు. ఆయన అసాధారణ పరిపాలన దక్షుడు. న్యాయవ్యవస్థపై ఆయన చెదరని ముద్రవేయడం ఖాయం.

- జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి

సచిన్‌ తెందుల్కర్‌లా రికార్డులు..

జస్టిస్‌ బీవీ గవాయ్‌,సుప్రీంకోర్టు న్యాయమూర్తి
జస్టిస్‌ బీవీ గవాయ్‌,సుప్రీంకోర్టు న్యాయమూర్తి

జస్టిస్‌ రమణ మా బృంద నాయకుడిగా ఉండటం గర్వకారణం. ఆయన న్యాయ వ్యవస్థకు కర్తలాంటివారు. ఆయన నిజమైన నాయకుడు, కుటుంబ పెద్దలాంటివారు. సచిన్‌ తెందుల్కర్‌లా ఒకదానితర్వాత ఒకటిగా ఆయన రికార్డులు బద్దలు కొడుతున్నారు. తొమ్మిదిమంది న్యాయమూర్తులు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయడమే అందుకు ఉదాహరణ. మాకు ఆయన నిజమైన పెద్దన్నలాంటివారు. సహచరులందర్నీ కుటుంబ సభ్యులుగానే చూస్తారు. సమాజంలో అట్టడుగున ఉన్నవారి గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటారు.

- జస్టిస్‌ బీవీ గవాయ్‌,సుప్రీంకోర్టు న్యాయమూర్తి

సువర్ణ హృదయమున్న న్యాయమూర్తి..

జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి
జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి

జస్టిస్‌ రమణ సువర్ణ హృదయమున్న వ్యక్తి. అందర్నీ గుర్తిస్తారు. వారి గురించి ఆలోచిస్తారు. అందర్నీ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. ప్రతి ఒక్కరికీ సాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అదో గొప్ప లక్షణం. సమాజంలోని ప్రతి ఒక్కరి గొంతు వింటూ దానికి గౌరవం ఇస్తారు.

- జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి

సంక్లిష్ట పరిస్థితుల్లో ఆశాకిరణం..

మనన్‌కుమార్‌ మిశ్ర, బీసీఐ అధ్యక్షుడు
మనన్‌కుమార్‌ మిశ్ర, బీసీఐ అధ్యక్షుడు

కొందరు కూర్చుంటే కుర్చీ సంతోషిస్తుంది. జస్టిస్‌ రమణ ప్రధాన న్యాయమూర్తి పదవిలో కూర్చున్న తర్వాత బార్‌ చాలా సంతోషంగా ఉంది. న్యాయవాదులు కరోనా సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై న్యాయశాఖ మంత్రికి లేఖరాసి, సాయం చేయమని కోరినందుకు ధన్యవాదాలు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో మీరో ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. జస్టిస్‌ రమణలో అరుదైన లక్షణాలున్నాయి. సుప్రీంకోర్టు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు నియమితులు కావడం గొప్ప విజయం. అది జస్టిస్‌ రమణకే సాధ్యమైంది.

- మనన్‌కుమార్‌ మిశ్ర, బీసీఐ అధ్యక్షుడు

ప్రాంతీయ ధర్మాసనాలు ఏర్పాటు చేయాలి..

విల్సన్‌, న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు
విల్సన్‌, న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు

దేశంలో సుప్రీంకోర్టు ప్రాంతీయ ధర్మాసనాలు ఏర్పాటు చేయాలి. దూరం పెరిగే కొద్దీ సుప్రీంకోర్టులో తక్కువ కేసులు నమోదవుతుంటాయి. తమిళనాడు నుంచి వచ్చే కేసులు ఒక శాతమే. కారణం దూరం, ఖర్చులే. సుప్రీంకోర్టు ప్రాంతీయ ధర్మాసనాలను ఏర్పాటుచేసి రాజ్యాంగ తనువు, ఆత్మను అందరూ చూసేలా చేయండి. సుప్రీంకోర్టు తలుపులను దేశంలోని కక్షిదారులందరికీ బార్లా తెరవాలి. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలి.

- విల్సన్‌, న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు

జస్టిస్‌ జేఎస్‌ వర్మ అభిమానించిన వ్యక్తి..

వివేక్‌ టంకా, సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు
వివేక్‌ టంకా, సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు

మా నాన్న మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ఉండేవారు. నా చిన్నతనంలో మా ఇంటికి జస్టిస్‌ జేఎస్‌ వర్మ, జస్టిస్‌ ఏపీ సేన్‌, జస్టిస్‌ జీపీ సింగ్‌లు తరచూ వచ్చేవారు. అప్పట్లో పూర్తి స్వతంత్ర ఆలోచనా దృక్పథంతో వ్యవహరించిన గొప్ప న్యాయమూర్తులు వారు. నేను దిల్లీకి వచ్చినప్పుడు జస్టిస్‌ రమణ గురించి మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ వర్మ చాలా గొప్పగా, ఎంతో నమ్మకంతో మాట్లాడేవారు. నేను జీవితంలో ఆరాధించిన వ్యక్తి మిమ్మల్ని (జస్టిస్‌ ఎన్‌.వి.రమణని) అభిమానించారు. అందువల్ల నేను మిమ్మల్ని ఆరాధించకపోవడానికి కారణమేమీ కనిపించలేదు.

- వివేక్‌ టంకా, సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.