జహంగీర్​పురిలో బుల్​డోజర్లు.. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సుప్రీం స్టే

author img

By

Published : Apr 20, 2022, 11:07 AM IST

Updated : Apr 20, 2022, 11:41 AM IST

Jahangirpuri bulldozers

Bulldozer news: గతవారం ఘర్షణలు చెలరేగిన దిల్లీలోని జహంగీర్​పురిలో బుల్డోజర్లను మోహరించారు మున్సిపల్​ అధికారులు. అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు భారీ బందోబస్తుతో ఏర్పాట్లు చేశారు. దీనిపై ఆప్​ మండిపడింది. దేశ రాజధానిలో శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించేందుకు భాజపా, అమిత్​ షా కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. మరోవైపు జహంగిర్​పురిలో ఎలాంటి నిర్మాణాలు కూల్చివేయొద్దని సుప్రీంకోర్టు స్టే విధించింది.

Jahangirpuri news: గతవారం హింసాత్మక ఘటనలు జరిగిన దిల్లీలోని జహంగీర్​పురిలో బుల్​డోజర్లను మోహరించారు నార్త్​ దిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్(ఎన్​ఎండీసీ) అధికారులు. అక్కడ అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. నిర్మాణాల కూల్చివేత నేపథ్యంలో ఉదయం నుంచి భారీగా పోలీసులను మోహరించారు అధికారులు. మహిళా సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. రెండు, మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది.

Jahangirpuri bulldozers
'జహంగీర్​పుర్​లో బుల్​డోజర్లు

Jahangirpuri bulldozers: అయితే నార్త్ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్​లో భాజపా అధికారంలో ఉంది. దీంతో దిల్లీలో ప్రస్తుతమున్న శాంతియుత వాతావరణానికి విఘాతం కల్గించేందుకు భాజపా, హోంమంత్రి అమిత్ షా కుట్ర చేస్తున్నారని ఆప్ ఎమ్మెల్యే, దిల్లీ వక్ఫ్​ బోర్డు ఛైర్మన్​ అమానాతుల్లా ఖాన్ ఆరోపించారు. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, వారిని వేధించేందుకు రంజాన్​ లాంటి పవిత్ర మాసంలో ఇలా చేయడం దారుణమన్నారు. ఈమేరకు ట్విట్టర్​లో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలతో దేశంలోని ప్రశాంత పరిస్థితులు మారే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే అనేక చోట్ల పరిస్థితులు బాగాలేవని చెప్పారు. భాజపా ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలన్నారు.

Jahangirpuri bulldozers
'జహంగీర్​పుర్​లో బుల్​డోజర్లు

దిల్లీ వ్యాప్తంగా దురాక్రమణ వ్యతిరేక కార్యక్రమం కొనసాగుతుందని ఎన్​ఎండీసీ మేయర్ రాజా ఇక్బాల్​ సింగ్​ స్పష్టం చేశారు. అయితే గతంలో ఈ డ్రైవ్ నిర్వహించేందకు భద్రత కావాలని అడిగితే కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయారని చెప్పారు. ఈసారి పటిష్ఠ భద్రత కల్పిస్తున్నందు వల్ల ఆపరేషన్​ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన వాటిని మాత్రమే కూల్చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు స్టే..

అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో జహంగీర్​పురిలో బుల్​డోజర్లతో జరుగుతున్న కూల్చివేతపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. దీనిపై తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. అంతకుముందు దిల్లీ హైకోర్టులో కూడా ఈ విషయంపై పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వాటిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతించింది. కానీ కూల్చివేత ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని చెప్పింది. పిటిషన్లపై ఈరోజే విచారణ జరుపుతామని చెప్పింది. ఆ తర్వాత సుప్రీం జోక్యం చేసుకుని కూల్చివేతపై స్టే విధించింది.

జహంగీర్​పురిలో ఈనెల 16న హునుమాన్​ శోభాయాత్ర నిర్వహిస్తుండగా హింస చెలరేగింది. అల్లరి మూకలు రాళ్లురువ్వడం వల్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో పోలీసులు సహా పులువురు గాయపడ్డారు. ఆ మరునాటి నుంచి ఆ ప్రాంతంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు బుల్​డోజర్​ ట్రెండ్ ఇప్పటికే ఉత్తర్​ప్రదేశ్​, గుజరాత్​లో బాగా పాపులర్ అయింది. నేరస్థులకు చెందిన ఆస్తులను బుల్​డోజర్లను ఉపయోగించి కూల్చివేస్తున్నారు అధికారులు. నేరాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం

Last Updated :Apr 20, 2022, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.