'చైనాకు గట్టిగా బదులిస్తున్నాం.. అందుకే భారత్‌కు ప్రాధాన్యం పెరిగింది'

author img

By

Published : Jan 15, 2023, 12:25 PM IST

India responding strongly to China border misdeeds

సరిహద్దుల్లో చైనా దుశ్చర్యలకు భారత్‌ గట్టిగా బదులిస్తోందని జైశంకర్‌ అన్నారు. దీన్ని గమనించిన ప్రపంచ దేశాలు భారతదేశ ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నాయన్నారు.

కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ 2020 మేలో సరిహద్దు వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి చైనా చేసిన కుయుక్తులను భారత్‌ బలంగా తిప్పికొట్టిందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. గతంలో కుదిరిన ఒప్పందాలకు విరుద్ధంగా సరిహద్దులను మార్చేందుకు చైనా భారీ ఎత్తున బలగాలను మోహరించిందని గుర్తుచేశారు. సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యం.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ డ్రాగన్‌ దుశ్చర్యలను దీటుగా తిప్పికొట్టిందని కొనియాడారు. తుగ్లక్‌ మ్యాగజైన్‌ 53వ వార్షిక సదస్సులో శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టడం సాధ్యం కాదని చైనాతో ఘర్షణ ఉదంతంలో ప్రపంచం గుర్తించిందని జైశంకర్ అన్నారు. అందువల్లే అంతర్జాతీయంగా భారత్‌కు ప్రాధాన్యం పెరిగిందన్నారు. దేశ భద్రత కోసం భారత్‌ ఎంత దూరమైనా వెళ్తుందని ఈ ఘటన స్పష్టం చేసిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక రంగాల్లో భారత్‌ దూసుకెళ్తోందని చెప్పారు. అందువల్లే భారత ప్రతిష్ఠ ఇనుమడిస్తోందన్నారు. గ్లోబల్‌ అజెండా రూపకల్పనలో భారత్‌ ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

అవసరమైనప్పుడు కొన్ని అంశాల నుంచి భారత్‌ దూరంగా ఉంటుందని జైశంకర్‌ స్పష్టం చేశారు. కావాలనుకున్నప్పుడు గళాన్ని గట్టిగా వినిపిస్తుందని తేల్చి చెప్పారు. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన రంగాల్లో ఇతర దేశాలతో కలిసి నడుస్తుందని చెప్పారు. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాతో భారత్‌ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుండడంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన ఈ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. భారత ప్రాధాన్యాలపై ఇతర దేశాల పెత్తనాన్ని అనుమతించకపోవడం చాలా అవసరమని తాము భావిస్తున్నామన్నారు. ఉగ్రవాదాన్ని భారత్‌ ఏమాత్రం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. ఉరి, బాలాకోట్‌ ఘటనల్లో అది స్పష్టమైందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.