ETV Bharat / bharat

అరవింద్ కేజ్రీవాల్​కు సీబీఐ సమన్లు- దిల్లీ మద్యం స్కామ్​ కేసులో విచారణ

author img

By

Published : Apr 14, 2023, 5:36 PM IST

Updated : Apr 14, 2023, 6:14 PM IST

Delhi excise policy case : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​కు సీబీఐ సమన్లు ఇచ్చింది. ఏప్రిల్​ 16న (ఆదివారం) ఉదయం 11 గంటలకు విచారణ హాజరు కావాలని సూచించింది.

arvind kejriwal
అరవింద్ కేజ్రీవాల్​

Arvind Kejriwal CBI Summons : దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్​ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్​కు సీబీఐ సమన్లు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ హాజరు కావాలని సూచించింది. ఈ నెల 16న (ఆదివారం) ఉదయం 11 గంటలకు దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి రావాలని శుక్రవారం కేజ్రీవాల్​కు ఇచ్చిన సమన్లలో కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఇందుకు అనుగుణంగా దిల్లీ సీఎం విచారణ హాజరు అవుతారని ఆప్​ వర్గాలు తెలిపాయి.

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ ఇప్పటికే కొందరిని అరెస్టు చేసింది. వీరిలో అప్పటి దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియా కూడా ఉన్నారు. ఫిబ్రవరి 26న సిసోదియాను కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు. మద్యం స్కామ్ కేసులో అరెస్టు నేపథ్యంలో ఫిబ్రవరి 28న మనీశ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు సిసోదియా జైలులో ఉండగానే.. కేజ్రీవాల్​కు సమన్లు ఇచ్చింది సీబీఐ.

మద్యం కుంభకోణం కేసులో విచారణకు సీఎంను పిలవడంపై ఆమ్​ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. "అరవింద్ కేజ్రీవాల్​కు సీబీఐ సమన్లు జారీ చేసింది. నోటీసుల్లో పేర్కొన్నట్లుగా.. ఏప్రిల్​ 16న కేజ్రీవాల్ సీబీఐ ఎదుట హాజరవుతారు. ప్రధాన మంత్రికి నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా. మీరు, మీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారు. సీబీఐ సమన్లతో అరవింద్ కేజ్రీవాల్ పోరాటాన్ని అడ్డుకోలేరు. ఏప్రిల్ 16న కేజ్రీవాల్​ను అరెస్టు చేసి, జైలుకు పంపి, ఆయనపై చర్యలు తీసుకోవాలన్న మీ కుట్ర.. దిల్లీ సీఎం వాణిని అణచివేయలేదు" అని ఆమ్​ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్​ సింగ్ స్పష్టం చేశారు.

ఆరోపణలతో మొదలై..
దిల్లీ మద్యం కుంభకోణం కేసు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజకీయంగానూ దుమారం రేపింది. 2021-22 ఆర్థిక సంవత్సరం కోసం దిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీలో అనేక లోటుపాట్లు ఉన్నాయనే ఆరోపణలు రావడం ఇందుకు ప్రధాన కారణం. కొందరికి అనుచిత లబ్ధి చేకూర్చేలా ఈ నూతన మద్యం విధానం తయారు చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయమై దిల్లీ ప్రధాన కార్యదర్శి ఓ నివేదిక ఇచ్చారు. ఆ సమయంలో అబ్కారీ శాఖ ఇన్​ఛార్జ్ మంత్రిగా మనీశ్​ సిసోదియా ఉన్నారు. ఈ వివాదం నేపథ్యంలో కొత్త మద్యం విధానాన్ని అమలు చేయకుండా.. రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్.

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్​ వీకే సిఫార్సుతో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోదియా సహా మరికొందరు పేర్లను నిందితులుగా పేర్కొంటూ 2022 ఆగస్టు 17న ఎఫ్​ఐఆర్ నమోదు చేసింది. కొందరిని అరెస్టు చేసింది.

Last Updated :Apr 14, 2023, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.