ETV Bharat / bharat

తెలుగు మహిళకు జాతీయ ఫ్లోరెన్స్ నైటింగెల్ అవార్డు

author img

By

Published : Sep 20, 2021, 6:41 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లాకు చెందిన బ్రిగేడియర్ సరస్వతిని కేంద్ర ప్రభుత్వం జాతీయ ఫ్లోరెన్స్ నైటింగెల్ అవార్డుతో (National Florence Nightingale Award 2020) సత్కరించింది. వర్చువల్​గా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్.. ఈ అవార్డును బ్రిగేడియర్ సరస్వతికి ప్రదానం చేశారు.

Brigadier S V Saraswati receives National Florence Nightingale Award 2020
తెలుగు మహిళకు ఫ్లోరెన్స్ నైటింగెల్ అవార్డు

తెలుగు మహిళకు అత్యున్నత అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన బ్రిగేడియర్ ఎస్​వీ సరస్వతి.. (Brigadier S V Saraswati) కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ ఫ్లోరెన్స్ నైటింగెల్ అవార్డును (National Florence Nightingale Award 2020) స్వీకరించారు. వర్చువల్​గా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్.. ఈ అవార్డును సరస్వతికి ప్రదానం చేశారు.

Brigadier S V Saraswati
బ్రిగేడియర్ సరస్వతి

ఇది దేశంలోని నర్సులకు (Highest award for nurses) ఇచ్చే అత్యున్నత అవార్డు. తమ వృత్తిలో ప్రదర్శించిన నిబద్ధత, అంకితభావానికి మెచ్చి ఈ అవార్డును ఇస్తారు.

వేల ప్రాణాలు కాపాడి...

ప్రస్తుతం మిలిటరీ నర్సింగ్ సర్వీస్ (Military Nursing Service) డిప్యూటీ డైరెక్టర్ జనరల్​గా బ్రిగేడియర్ సరస్వతి సేవలందిస్తున్నారు. 1983 డిసెంబర్ 28న మిలిటరీ నర్సింగ్ సర్వీస్​లో చేరారు సరస్వతి. మూడున్నర దశాబ్దాల పాటు సేవలందించారు. ఆపరేషన్ థియేటర్ నర్సుగా పనిచేసి.. 3 వేలకు పైగా అత్యవసర సర్జరీలలో పాల్గొని అనేక ప్రాణాలను కాపాడారు. దీంతో పాటు అనేక మంది రోగులకు సేవలందించారు. ప్రజలకు, ఆపరేషన్ రూమ్ నర్సింగ్ ట్రైనీలకు శిక్షణ అందించారు. గుండెపోటు సర్జరీల కోసం డ్రేప్ కిట్లు, పేషెంట్ టీచింగ్ మెటీరియల్​ను రూపొందించారు.

భారత్​కు ప్రాతినిధ్యం..

దేశ, విదేశాల్లో నిర్వహించిన ఫోరంలలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు బ్రిగేడియర్ సరస్వతి. ఎంఎన్ఎస్ తరపున వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కనీస చికిత్స చేసుకునేలా వెయ్యి మందికి పైగా సైనికులు, వారి కుటుంబ సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ఐరాస శాంతి పరిరక్షక దళాలు నిర్వహించే ఆస్పత్రులలోనూ పనిచేశారు.

సైనికులకు, వారి కుటుంబాలకు బ్రిగేడియర్ సరస్వతి అందించిన అసమాన సేవలకు గుర్తుగా.. 2005లో జనరల్ ఆఫీస్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంస అవార్డును అందుకున్నారు. 2007లో ఐరాస మెడల్, 2015లో చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ కమెండేషన్​ను స్వీకరించారు.

ఇదీ చదవండి: 'వచ్చే నెల నుంచి విదేశాలకు భారత్​ టీకా సాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.