ETV Bharat / bharat

అయోధ్య... రామ జన్మభూమా? కొత్త ఆలయమా?

author img

By

Published : Aug 2, 2020, 12:18 PM IST

రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ ముహూర్తం సమీపిస్తుండటం వల్ల అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5న నిర్వహించే భూమిపూజకు.. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ చారిత్రక కార్యక్రమానికి ముందు కొన్ని ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. అవేంటంటే...

ram janmabhoomi or new ram temple?
అయోధ్యలో కట్టేది రామ జన్మభూమా? కొత్త దేవాలయమా?

రామ మందిర భూమిపూజ కోసం అయోధ్య నగరం సిద్ధమవుతోంది. అయితే ఇక్కడ కట్టే ఆలయాన్ని ఏమని పిలుస్తారు? ఇది రామ జన్మభూమా? లేదంటే రాముని కొత్త దేవాలయమా? అనేది చర్చనీయాంశంగా మారింది.

గతంలోనే బాబ్రీ మసీదు, రామ జన్మభూమి దేవాలయాలు నేలమట్టమయ్యాయి. తర్వాత రాముని విగ్రహం మాత్రమే దొరకగా.. దాని కోసం ఓ ఆలయం కట్టి అందులోనే ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. నిజానికి అసలు గర్భగృహం అనేది 1992, డిసెంబర్ 6న జరిగిన కూల్చివేతల్లో శిథిలాల్లో కలిసిపోయింది. అందుకే ప్రస్తుత దేవాలయం ఏంటనేది సందిగ్ధంగా మారింది.

ram janmabhoomi or new ram temple?
రామ జన్మభూమి, బాబ్రీ మసీదు

ముహూర్తం..

ఆగస్టు 5 మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 15 నిమిషాల 15 సెకన్లకు మొదలుపెట్టి 32 సెకన్లలో శంకుస్థాపన జరిగేలా భూమిపూజకు ముహూర్తం నిర్ణయించారు. ఇందుకుగాను నక్షత్రాల్లాంటి 5 వెండి ఇటుకలను వాడతారు. ప్రధాని మోదీ రామ జన్మభూమి ప్రాంతానికి ఉదయం 11.30 గంటలకు చేరుకుంటారని ట్రస్ట్‌ ప్రతినిధులు తెలిపారు. ఆయన వచ్చేలోగా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను పూర్తిచేస్తారు. ప్రాచీన హనుమాన్‌ దేవాలయంలో పూజలు అనంతరం ప్రధాని భూమిపూజలో పాల్గొంటారు.

కొంత మందికే ఆహ్వానం..

తొలుత పూజా కార్యక్రమానికి 250 మంది వస్తారని అంచనా వేసినా.. కరోనా నేపథ్యంలో 125 మందికే ఆ అవకాశం కల్పించనున్నారు. ఎల్​కే అడ్వాణీ, ఎమ్ఎమ్​ జోషి, ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భాగవత్, మహంత్​ నృత్య గోపాల్​ దాస్​ వంటి ప్రముఖులు హాజరుకానున్నారు. కొత్త గర్భగృహం ఏర్పాటు చేసే ప్రాంతంలో 40 కేజీల వెండితో శ్లాబ్​ వేయనున్నారు. రాముడి జన్మస్థలానికి గుర్తుగా ఉంటే ఆది గర్భగృహం లేకపోవడం వల్ల ఇప్పుడు ఇలా కొత్తది ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచంలో మూడోది..

ఈ కొత్త రామ మందిరం.. 120 ఏకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇది ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా పేరుగాంచనుంది. తొలి రెండు స్థానాల్లో కంబోడియాలోని అంగోర్​ వాట్​ దేవాలయం, తమిళనాడు తిరుచురాపల్లిలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉన్నాయి. అయోధ్యలో రామాలయం కీలకంగా ఉండనుండగా.. సీతా, లక్ష్మణుడు, భరతుడు, హనుమంతుడికి ప్రత్యేకమైన మందిరాలు చుట్టూ ఏర్పాటు చేయనున్నారు.

ఆకృతి ఇలా...

భారత్‌లో ఆలయాల నిర్మాణానికి ప్రధానంగా 3 రకాల ఆకృతులను రూపొందిస్తుంటారు. వాటిలో నాగర ఒకటి. ప్రఖ్యాత సోమనాథ్‌ ఆలయం కూడా ఇదే శైలిలోనే నిర్మితమైంది. కాగా అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం గర్భగుడి అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. ఆలయ పరిధి వృత్తాకారంలో ఉంటుంది. 30 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన రామమందిరం ఆకృతిలో తర్వాత కొన్ని మార్పులు చేశారు. రెండంతస్తులకు బదులు మూడంతస్తుల్లో నిర్మించనున్నారు. ఆలయం పొడవు, వెడల్పు, ఎత్తు వరుసగా 360, 235, 161 అడుగులుగా నిర్ణయించారు. ప్రతిపాదిత రామ మందిరం మూల నిర్మాణాకృతిని అలాగే ఉంచారు. మూడో అంతస్తు నిర్మించాలని నిర్ణయించడం వల్ల ఎత్తు 33 అడుగులు పెరిగింది. 3 చోట్ల 5 గుమ్మటాలుంటాయి.

ram janmabhoomi or new ram temple?
రామ మందిరం నమూనా

ఎవరు నిర్మిస్తున్నారంటే...

మొత్తం 76 వేల నుంచి 84 వేల చదరపు అడుగుల పరిమాణంలో ఈ దేవాలయం నిర్మిస్తున్నారు. 77 ఏళ్ల చంద్రకాంత్‌ సోమ్‌పుర.. 1983లోనే ఈ మందిరానికి ఆకృతిని సిద్ధం చేశారు. ఆయన కుమారులు నిఖిల్‌ సోమ్‌పుర (55), ఆశీష్‌ సోమ్‌పుర(49). వీరికి నిఖిల్‌ పెద్ద కుమారుడు కూడా ప్రస్తుత దేవాలయ నిర్మాణంలో సహకారం అందిస్తున్నారు. తన తాతతో కలిసి చంద్రకాంత్‌ భాయ్‌ సోమ్‌పుర.. గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయానికి (స్వాతంత్య్రానంతరం జరిగిన పునర్నిర్మాణం) కూడా డిజైన్‌ చేశారు.

గర్బగుడి ఉండే ప్రాంతాన్ని గురు మండపంతో మూసి ఉంచుతారు. దీని గుండా భక్తులు దర్శనానికి వెళ్తారు. ప్రధాన మండపం, కీర్తన మండపం, నృత్య మండపం, రంగ్​ మండపం వంటివి ఉంటాయి. దాదాపు 5 వేల నుంచి 8 వేల మంది భక్తులకు ఈ మండపాలన్నీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ఎన్నేళ్లలో కడతారంటే..?

రాజస్థాన్​లో విరివిగా దొరికే బన్సిపంద్​ ఇసుకరాయితో ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 1.75 లక్షల క్యూబిక్​ అడుగుల ఇసుకరాయి అవసరం కానుంది. దేవాలయానికి మొత్తం 212 స్తంభాలు ఉంటాయి. ఇప్పటికే గత 30 ఏళ్లలో 100 స్తంభాలను చెక్కేశారు. అయోధ్య వర్క్​షాప్​లో మిగతా పని జరుగుతోంది. రెండు దశల్లో స్తంభాలను ఏర్పాటు చేయనున్నారు. హిందూ దేవతామూర్తుల విగ్రహాలు, ఆభరణాల డిజైన్లు వాటిపై కనువిందు చేయనున్నాయి.

ram janmabhoomi or new ram temple?
సిద్ధమైన స్తంభాలు

ముఖద్వారం వద్ద నిల్చుంటే దూరం నుంచే దేవుడ్ని చూసేలా గుమ్మటాన్ని నిర్మించనున్నారు. 3.5 ఏళ్లలో ఈ మందిరం పూర్తి కావొచ్చని సోమ్​పుర కుటుంబం చెప్తోంది.

భూమిపూజ రోజున రాముడికి నవగ్రహాలకు సాక్షిగా నవరత్నాలు పొదిగిన వస్తాలతో ఆలంకరణ చేయనున్నారు. ఆయా దుస్తులను దర్జీ భగవత్​ పహరీ కుటుంబం సిద్ధం చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.