ETV Bharat / bharat

బంగాల్​ దంగల్​: దీదీ సేనలో అసమ్మతి జ్వాల!

author img

By

Published : Nov 23, 2020, 7:11 PM IST

బంగాల్​లో శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. నెలల సమయమే ఉన్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. ఈ తరుణంలో అధికార తృణమూల్​ కాంగ్రెస్​కు కొత్త తలనొప్పులు వస్తున్నాయి. ఓవైపు భాజపా దూకుడు అడ్డుకునేందుకు అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో.. సొంత పార్టీలోనే అసంతృప్త గళాలు వినిపిస్తుండటం కలవరపెడుతోంది. అధిష్ఠానం నిర్ణయాలు, పార్టీలో ప్రాధాన్యం గురించి టీఎంసీ సీనియర్లే అసమ్మతి రాగం తీస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.

TMC camp
బంగాల్​ దంగల్​: అధికార టీఎంసీలో అసంతృప్తి సెగలు !

బంగాల్​లో కొన్నాళ్లుగా అధికార టీఎంసీ- విపక్ష భాజపా మధ్య రాజకీయాలు రగిలిపోతున్నాయి. ఇరు పార్టీల దూకుడుతో అక్కడి రాజకీయం రణక్షేత్రాన్ని తలపిస్తోంది. ఇన్నాళ్లూ భాజపాను నిలువరించటంపైనే ప్రధాన దృష్టి సారించిన టీఎంసీ.. పార్టీలోని అంతర్గత సమస్యలను పట్టించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పార్టీని అసంతృప్తి, అసమ్మతి ఇబ్బంది పెడుతున్నాయి.

నిరాశలో నేతలు ?

రాష్ట్ర ప్రభుత్వంలోని పలువురు మంత్రులతో సహా చాలామంది నేతలు మమతా బెనర్జీ నిర్ణయాలతో నిరాశలో కూరుకుపోయారు. మరోవైపు సీనియర్ నాయకులు తిరుగుబాటుదారులను శాంతింపజేసే మార్గాలను అన్వేషిస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి 'సువేందు అధికారి'తో పాటు పలువురు నేతలు తగిన ప్రాధాన్యం దక్కటంలేదన్న వాదన వినిపిస్తున్నారు.

టీఎంసీలో మమతా బెనర్జీ తర్వాత నెంబర్​ 2గా ఉన్న సువేందు.. కొద్ది రోజులుగా పార్టీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే, తృణమూల్​ నాయకులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. మరోవైపు 'దీదీ' వర్గం రవాణాశాఖ మంత్రిని బుజ్జిగించే పనిలో పడింది. ఇప్పుడది పార్టీకి అత్యవసరంగా పరిణమించింది.

సువేందు సవాల్​..

సువేందు అధికారి వర్గానికి పార్టీలోనే కాకుండా.. ప్రజల్లోనూ గట్టి పట్టుంది. తూర్పు మిద్నాపూర్​, జంగిల్ మహల్​ బెల్ట్​లో దాదాపు 45 స్థానాల్లో ప్రభావం చూపించగలరు. ఈ నేపథ్యంలోనే ఆయన తర్వాతి అడుగుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆయనతో బంధాన్ని బలపర్చుకోవటం ప్రస్తుతం పార్టీకి అత్యవసరం. 2021లో అధికారం నిలబెట్టుకోవాలంటే సువేందు అధికారి వర్గం కీలకం. ఆయన పార్టీని వీడితే టీఎంసీకే నష్టం. తిరుగుబాటు నేతలు చాలామంది ఆయనతో నడిచే అవకాశాలున్నాయి.

-ఓ టీఎంసీ నేత

కొన్ని నెలలుగా అమలు చేస్తున్న సంస్థాగత విధానాల పట్ల సువేందు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా పరిశీలకుడిగా ఉన్న ఆయనను పదవి నుంచి తొలగించటం పట్ల తీవ్ర అసహనంతో ఉన్నారన్న వాదనలు వినిపించాయి. సువేందు.. రెక్కలు కత్తిరించేందుకే పార్టీ ఇలా వ్యవహరిస్తోందని ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​, ఆయన సంస్థ ఐ-ప్యాక్​.. వ్యూహాల పేరుతో పార్టీ సంస్థాగత విధానాల్లో జోక్యం చేసుకోవటం సువేందుకు నచ్చట్లేదని చెబుతున్నారు.

ప్రశాంత్​ కిశోర్​ పరేషానీ..

అయితే, ఇలా అధిష్ఠానం పట్ల గుర్రుగా ఉంది కేవలం సువేందు మాత్రమే కాదు. మరికొంత మంది ఎమ్మెల్యేలు, నేతలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీఎంసీ అధినేత్రిపై పార్టీలోనే అసమ్మతి వ్యక్తమవుతుండటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వీరిలో చాలామంది ప్రశాంత్​ కిశోర్​ పనితీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 6 ఎమ్మెల్యేలు పార్టీని వీడే ఆలోచనలు సైతం చేశారు. మంత్రుల్లోనూ సువేందుతో పాటు మరో నలుగురు అమాత్యులు అధిష్ఠానం నిర్ణయాల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నట్లు నేతలు చెబుతున్నారు.

ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు. చాలామంది శాసనసభ్యులు, కౌన్సెలర్లు, జిల్లాల నేతలు అసహనంతో ఉన్నారు. ముఖ్యంగా ఐ-ప్యాక్​ బృందంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపించటం లేదు. పార్టీలో ఇన్నేళ్లు పనిచేసిన అనంతరం తమను పక్కనబెడుతూ, ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలనటం చాలామందికి నచ్చటం లేదు.

-ఓ టీఎంసీ నేత

ఐ-ప్యాక్​ సంస్థ దాదాపు 1200 మంది వలంటీర్లను నియోజకవర్గాల్లో మోహరించింది. ఇది కొంతమంది కార్యకర్తల్లో గుబులు రేపుతోంది. తమ సేవలు విస్మరిస్తున్నారని సీనియర్​ నేతలు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆందోళనకు దిగిన సందర్భాలూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించిన సదరు సంస్థ.. పనితీరు సరిగ్గాలేని నేతలకు టికెట్ నిరాకరించాలని అధిష్ఠానానికి నివేదించిందనే వాదనలు ఉన్నాయి.

ఐ-ప్యాక్.. పార్టీలో​ అవినీతి, అంతర్గత సమస్యలను గుర్తించింది. ఇబ్బందులు సృష్టిస్తున్నవారి గురించి అధిష్ఠానానికి నివేదించింది. పార్టీ అందుకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమించింది. కొంతమంది నేతల్లో ఈ పరిణామాలు ఆగ్రహం పెంచాయి. ఈ నేపథ్యంలోనే భాజపావైపు అడుగులు వేస్తున్నారు.

-చక్రవర్తి, టీఎంసీ ఎమ్మెల్యే

ఇదీ చూడండి: 'భాజపాలోకి ఐదుగురు టీఎంసీ ఎంపీలు!'

సర్వత్రా ఆసక్తి

మొత్తంగా సువేందు సహా పార్టీలో పలువురు నేతల తర్వాతి అడుగులు ఏంటనేది టీఎంసీ, భాజపా నేతల్లో ఆసక్తి రేపుతోంది.

అయితే, టీఎంసీ సీనియర్లు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. ముఖ్యంగా సువేందు అధికారి పార్టీలో కీలక నేతగా కొనసాగుతారని చెబుతున్నారు. పార్టీ నిర్ణయాలపై నిరంతరం ఆయనతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయని అంటున్నారు.

సువేందు ఇప్పటికీ పార్టీలో క్రీయాశీలకంగానే ఉన్నారు. అసత్య ప్రచారాలు కట్టిపెట్టాలి. పార్టీలో ఎటువంటి సంక్షోభం లేదు. 200మంది ఎమ్మెల్యేలలో ఐదారుగురు నేతలు భిన్నాభిప్రాయం వెల్లడించడంలో ఎటువంటి సమస్యా లేదు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి.

-సౌగతా రాయ్​, టీఎంసీ ఎంపీ

భాజపాకు ఆనందం..

ఈ పరిణామాలన్నింటినీ కాషాయదళం నిశితంగా పరిశీలిస్తోంది. అధికార పార్టీలో అసమ్మతి పొడచూపటం భాజపాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ పార్టీలోని నేతలకు తలుపులు తెరిచే ఉంటాయని బహిరంగంగానే చెబుతోంది.

భాజపా మాత్రమే మంచి విలువలు, పరిపాలనా సామర్థ్యం ఉన్న నాయకులకు తగిన గౌరవం ఇవ్వగలదు. టీఎంసీ ఎప్పుడూ వ్యక్తిగత విశ్వాసాలకు అనుగుణంగానే పని చేస్తుంది. సువేందు అధికారి వంటి సామర్థ్యంగల నేతలకు సముచిత స్థానం ఇవ్వలేదు.

-దిలీప్ ఘోష్​, బంగాల్​ భాజపా అధ్యక్షుడు

మొత్తంగా బంగాల్​ రాజకీయాలు కొత్త మలుపులకు సన్నద్ధమవుతున్నాయి. మొత్తం 294 స్థానాలున్న రాష్ట్రంలో వచ్చే ఏడాది ఏప్రిల్​-మే మధ్య ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చూడండి: మిషన్​ బంగాల్: 23 అస్త్రాలతో భాజపా పక్కా ప్లాన్

ఇదీ చూడండి: బిహార్‌ విజయోత్సాహం- భాజపా తర్వాతి టార్గెట్​ బంగాల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.