ETV Bharat / bharat

ఆ లింకులు క్లిక్ చేసిన టీవీ నటి.. ఖాతా నుంచి డబ్బు మాయం.. మరో 40మంది సైతం..

author img

By

Published : Mar 6, 2023, 12:45 PM IST

మూడు రోజుల్లోనే సైబర్​ నేరగాళ్ల చేతిలో 40 మంది మోసపోయారు. లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఈ ఘటనలు జరిగాయి. మోసపోయిన వారిలో ముంబయి సినీనటి కూడా ఉన్నారు.

40 bank customers cheated by cyber criminals in maharashtra
బ్యాంక్​ కస్టమర్​లను మోసం చేసిన సైబర్ ​నేరగాళ్లు

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మూడు రోజుల్లో 40 మంది.. సైబర్​ మోసాల బారిన పడ్డారు. ఫేక్​ లింక్​లను క్లిక్​ చేసి రూ.లక్షలు పోగొట్టుకున్నారు. బ్యాంక్​ కేవైసీని అప్​డేట్​ చేయాలని.. లేకపోతే ఖాతాలు బ్లాక్​ అవుతాయనే మెసేజ్​తో ఈ లింక్​లు వస్తున్నాయి. తొందరపడి ఆ లింక్​లు క్లిక్​ చేసిన వారంతా డబ్బులు పోగొట్టుకున్నారు. బాధితుల్లో మహారాష్ట్ర టీవి నటి కూడా ఉన్నారు.

ముంబయి పోలీసులు తరుచుగా ఈ మోసాలపై హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినా ప్రజలు ఈ మోసాలకు గురువుతూనే ఉన్నారు. వారి బలహీనతలను ఆసరాగా చేసుకున్న సైబర్​ నేరగాళ్లు.. ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారు. మొత్తం 40 మందికిపైగా సైబర్​ మోసాలకు గురై.. డబ్బులు పోగొట్టున్నట్లు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఎంపిక చేసిన నంబర్​లకు సైబర్​ నేరగాళ్లు ఓ ఫేక్​ మెసేజ్​ను పంపిస్తున్నారు. కేటుగాళ్లు ఇచ్చిన లింక్​పై క్లిక్​ చేస్తే.. కేవైసీ/ పాన్​కార్డ్​ వివరాలు అప్​డేట్​ చేసుకోవాలనే సందేశం వస్తోంది. లేకపోతే బ్యాంక్ ఖాతా నిలిచిపోతుందని హెచ్చరిస్తున్నారు. అది క్లిక్​ చేసిన తరువాత ఓ ఫేక్​ వెబ్​సైట్​ ఓపెన్​ అవుతుంది. అనంతరం ఆన్​లైన్​ దరఖాస్తులో వారి వ్యక్తిగత వివరాలు.. కస్టమర్​ ఐడీ, పాస్​వర్డ్ నింపమని చెబుతారు. దీంతో వారి బ్యాంక్​ ఖాతాలను హ్యాక్​ చేసి అందిన కాడికి దోచుకుంటున్నారు.

టీవీ నటి సైతం..
ముంబయికి చెందిన టీవి నటి శ్వేతా మేనన్​ కూడా.. సైబర్​ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను కూడా ఆ మోసపూరిత లింక్​ క్లిక్​ చేసి డబ్బులు పోగొట్టుకున్నట్లు వారికి తెలిపారు.

"గురువారం నాకు ఓ ఫేక్​ లింక్​ మెసేజ్​ వచ్చింది. అది బ్యాంక్​ వారే పంపించారని భ్రమ పడ్డాను. అనంతరం ఆ లింక్​ను క్లిక్​ చేశాను. వెంటనే ఓ ఫేక్​ పోర్టల్​ ఓపెన్​ అయింది. ఆన్​లైన్ దరఖాస్తులో నా కస్టమర్​ ఐడీ, పాస్​వర్డ్​ను ఎంటర్​ చేయమని అడిగింది. ఆ దరఖాస్తును పూర్తిగా నింపాను. ఆ తరువాత ఓ మహిళ నాకు ఫోన్​ చేసింది. తాను ఒక అధికారినని చెప్పింది. మీ నంబర్​కు ఓటీపీ వచ్చిందని.. అది తనకు చెప్పమని అడిగింది. చెప్పిన అనంతరం నా ఖాతాలో నుంచి 57వేల 636 రూపాయలు డెబిట్​ అయ్యాయి" అని నటి శ్వేతా మేనన్ తెలిపారు.

ఇదే పద్ధతిలో చాలా మంది డబ్బులను పోగొట్టుకున్నారని పోలీసులు చెబుతున్నారు. సైబర్​ మోసగాళ్లు పంపించే బోగస్​ లింక్​లను ఎవ్వరు క్లిక్​ చేయోద్దని హెచ్చరిస్తున్నారు. కేవైసీ అప్​డేట్​ ఏమైనా ఉంటే నేరుగా సంబంధిత బ్యాంక్​ను సంప్రదించాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.