ETV Bharat / bharat

AP High Court Hearing on Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాదనలు.. తీర్పు రిజర్వ్​లో ఉంచిన న్యాయమూర్తి..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 8:42 AM IST

AP High Court Hearing on Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాడీవేడిగా వాదనలు నడిచాయి. విచారణ సందర్భంగా న్యాయవాదులతో కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. ఉదయం 12 గం. నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు వాదనలు జరగగా.. చంద్రబాబు తరఫున హరీష్‌సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌కుమార్, ఏఏజీ పొన్నవోలు వాదించారు.

AP High Court Hearing on Chandrababu Quash Petition
AP_High_Court_Hearing_on_Chandrababu_Quash_Petition

AP High Court Hearing on Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాదనలు.. తీర్పు రిజర్వ్​లో ఉంచిన న్యాయమూర్తి..

AP High Court Hearing on Chandrababu Quash Petition: గవర్నర్‌ అనుమతి లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేయడం.. దర్యాప్తు నిర్వహించడం, అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపడం వంటివి చెల్లవని చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. సెక్షన్‌ 17A ప్రకారం ముందస్తు అనుమతి తప్పనిసరి అని అన్నారు. రాజకీయ ప్రతీకారంతో పిటిషనర్‌పై కేసు నమోదు చేశారని వాదనలు వినిపించారు. నిధుల దుర్వినియోగమయ్యాయని అనేందుకు ఆధారాలు లేవని అన్నారు. పిటిషనర్‌పై నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​, ఏసీపీ కోర్టు జారీచేసిన జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టేయాలని కోరారు. మంగళవారం జరిగిన విచారణలో ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. దాని ఆధారంగా విజయవాడ అవినీతి నిరోధక శాఖ కోర్టు ఈ నెల 10న జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు హాలు న్యాయవాదులతో కిక్కిరిసిపోయింది. మంగళవారం ఉదయం 12 గంటలకు ప్రారంభమైన వాదనలు మధ్యాహ్నం భోజన విరామ సమయం మినహాయించి.. సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే ఆన్‌లైన్‌ ద్వారా మరో సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ఆన్‌లైన్‌ ద్వారా, మరో సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి నేరుగా వాదనలు వినిపించారు.

CID filed PT warrant against Chandrababu: చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ

అనినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్‌ 17A నిబంధనలను అనుసరించి గవర్నర్‌ అనుమతి తీసుకోకుండా చంద్రబాబుపై కేసు నమోదు చేయడం చెల్లదని.. పిటిషనర్‌ చంద్రబాబు తరఫున న్యాయవాదులు హరీష్‌సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. 2018 జులై 26 నుంచి సెక్షన్‌ 17A అమల్లో ఉందన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ విషయంలో 2021 డిసెంబర్‌ 9న కేసు నమోదు చేశారని గుర్తుచేశారు.

టీడీపీ అధినేతను 2023 సెప్టెంబర్‌ 8న నిందితుడిగా చేర్చారన్నారు. 17ఏ నిబంధన ప్రకారం గవర్నర్‌ నుంచి అనుమతి పొందకుండానే నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారన్నారు. ఈ విషయాన్ని అనిశా కోర్టు పరిగణనలోకి తీసుకోకుండా జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. నేర ఘటన 2018కి పూర్వం చోటు చేసుకున్నందున సెక్షన్‌ 17ఏ పాటించాల్సిన అవసరం లేదన్న సీఐడీ వాదన సరికాదన్నారు. 17ఏ అమల్లోకి వచ్చాక అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 13 (1) (సి) (డి) ప్రకారం పబ్లిక్‌ సర్వెంట్‌పై కేసు నమోదు చేయాలన్నా.. దర్యాప్తు చేయాలన్నా కాంపిటెంట్‌ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు తీర్పులిచ్చాయని గుర్తుచేశారు.

ఓ ప్రభుత్వ హయాంలో పబ్లిక్‌ సర్వెంట్లు తీసుకున్న నిర్ణయాల ఆధారంగా మరో ప్రభుత్వం వారిపై కక్ష సాధింపులకు పాల్పడకుండా రక్షణ కల్పించేందుకు సెక్షన్‌ 17Aని తీసుకొచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుత కేసులో గవర్నర్‌ అనుమతి లేకుండా దర్యాప్తు నిర్వహించడం, ఎఫ్‌ఐఆర్‌ నమోదుపై నిషేధం ఉందన్నారు. సెక్షన్‌ 17Aని సీఐడీ అనుసరించి తీరాల్సిందేనన్నారు.

చంద్రబాబు క్వాష్ పిటిషన్​పై హైకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు వాయిదా

కక్ష సాధింపులో భాగంగానే ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబుపై తప్పుడు కేసు నమోదు చేసిందన్నారు. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ పూర్తిగా చట్టవిరుద్ధమన్నారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఏ వ్యక్తినైనా అరెస్టు చేసి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి వీల్లేదని అర్నబ్‌ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. చంద్రబాబుపై నమోదు చేసిన కేసులో సైతం ప్రాథమిక ఆధారాలు లేవన్నారు.

నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో నిధుల మళ్లింపు ప్రస్తావనే రాదని తెలిపారు. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసే అధికారం హైకోర్టుకు ఉందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేతపై ప్రస్తుత ప్రభుత్వం ప్రతీకారం తీసుకునేందుకు కేసు నమోదు చేసిందన్నారు. పిటిషనర్‌ దేశం విడిచి వెళ్లేవారేమీ కాదన్నారు. నిజంగా దేశం విడిచి వెళ్లేటట్లయితే ప్రాసిక్యూషన్‌ ఈ కేసును ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉంటుందన్నారు. పిటిషనర్‌ అడ్డంకిగా లేకుండా ఉండాలనేది ప్రభుత్వ అంతిమ ఉద్దేశమన్నారు. ప్రతిపక్షనేతగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు ఆయనను ఈ కేసులో ఇరికించారని వాదించారు.

నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు గురించి సీమెన్స్, డిజైన్‌టెక్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పంద జరిగిందన్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. ప్రాజెక్టుకయ్యే ఖర్చులో తొంబై శాతం ఈ రెండు సంస్థలు, 10శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలన్నారు. 90శాతం కింద ప్రాజెక్టుకు అవసరమైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ సమకూర్చడంతో పాటు శిక్షణ తరగతులు నిర్వహించాల్సి ఉంటుందని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. 90శాతాన్ని సొమ్ము రూపేణా ఇవ్వాలని ఒప్పందంలో లేదన్నారు. 10శాతం మాత్రం ప్రభుత్వం సొమ్ము రూపంలో ఇవ్వాల్సి ఉందన్నారు.

Chandrababu Bail petition in ACB court: చంద్రబాబుకు బెయిల్​పై ఏసీబీ కోర్టులో పిటిషన్.. రేపు విచారణ

ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ మదింపు చేసిందన్నారు. అగ్రిమెంట్‌ ప్రకారం ప్రభుత్వం తన వాటాగా 10శాతం సొమ్మును విడుదల చేసిందని.. ప్రాజెక్టులో భాగంగా 6 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, 36 టెక్నికల్‌ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఆయా కేంద్రాలను డిజైన్‌టెక్‌ సంస్థ వివిధ కళాశాలలకు అప్పగించిందన్నారు. ఆయా కేంద్రాలను పూర్తిస్థాయిలో అమలు చేశారని, వాటి పనితీరు సంతృప్తిగా ఉందని ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ ఆర్జా శ్రీకాంత్‌ 2021లో ధ్రువపత్రం జారీచేసినట్లు కోర్టుకు నివేదించారు.

నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారని అవి కళ్లముందు కనబడుతున్నాయని తెలిపారు. వాటి ద్వారా 2 లక్షల 13 వేల మంది విద్యార్థులు శిక్షణ పొందినట్లు వివరించారు. విడతల వారీగా నిధుల వినియోగంపై ధ్రువపత్రాలు జారీచేశారని ఆడిట్‌ జరిగిందని తెలిపారు. ఏర్పాటు చేసిన కేంద్రాలను ప్రభుత్వానికి అప్పగించారని.. అలాంటప్పుడు నిధుల మళ్లింపు ప్రస్తావనే రాదని చెప్పారు. టెక్నాలజీ భాగస్వాములు సీమెన్స్, డిజైన్‌ టెక్‌ సంస్థలు 90శాతం నిధులు తీసుకురాలేదనడం అర్థరహితమని నేర విచారణ ప్రక్రియను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని వివరించారు.

డిజైన్‌టెక్‌ సంస్థకు వస్తు సామగ్రి సమకూర్చిన స్కిల్లర్‌ సంస్థ నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించిందనే కారణంతో ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఆరోపించడం, పిటిషనర్‌ను బాధ్యుడ్ని చేయడం ఎంతమాత్రం సరికాదన్నారు. షెల్‌ కంపెనీలకు నిధుల మళ్లించినట్లు ఆరోపించడం మూర్ఖత్వంతో కూడుకుందని తెలిపారు. నకిలీ ఇన్వాయిస్‌ల విషయం ఆయా సంస్థల అంతర్గత వ్యవహారమని.. నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ప్రాజెక్టు కాదన్నారు. టెక్నాలజీ ప్రొవైడర్లు సాఫ్ట్‌వేర్‌ను సమకూరుస్తాయన్నారు.

చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం.. 'స్కిల్' ఒప్పందంలో ఎలాంటి అవినీతి జరగలేదు: డిజైన్‌టెక్‌ ఎండీ వికాస్‌ఖాన్‌ విల్కర్‌

ఎఫ్‌ఐఆర్, రిమాండ్‌ రిపోర్టులో ఐఏఎస్, పబ్లిక్‌ సర్వెంట్లను అనుయాయి అని పేర్కొనడంపై సీనియర్‌ న్యాయవాది హరీష్‌సాల్వే అభ్యంతరం తెలిపారు. ‘ప్రస్తుత కేసులో పోలీసులే కొంతమందికి హెంచ్‌మెన్‌గా వ్యవహరిస్తున్నారా అనే సందేహం కలుగుతోందన్నారు. ప్రాజెక్టుపై ఇప్పటికే ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించారని.. 2021 డిసెంబర్‌ నుంచి కేసును దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ దశలో సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని.. ఫైళ్లన్నీ దర్యాప్తు సంస్థ వద్దే ఉన్నాయని తెలిపారు.

పిటిషనర్‌ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారని దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిన ఈ సమయంలో న్యాయస్థానం రక్షణగా నిలవాలన్నారు. పిటిషనర్‌ ఇప్పటికే జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారని తెలిపారు. ఆ కస్టడీని కొనసాగించాల్సిన అవసరం లేదని ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉపశమనం కలిగించేలా ఉత్తర్వులివ్వాలని కోరారు.

సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌కుమార్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ దశలో క్వాష్‌ పిటిషనర్‌కు విచారణార్హత లేదన్నారు. జోక్యం చేసుకోవద్దని కోర్టును కోరారు. పిటిషనర్‌ను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి 10 రోజులు గడవలేదన్నారు. పిటిషనర్‌ పాత్రపై దర్యాప్తు ఇప్పుడే ప్రారంభం అయ్యిందన్నారు. ఈ దశలో దర్యాప్తును నిలువరించేలా ఆదేశాలు ఇవ్వొద్దన్నారు. అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్‌ 17ఏని పాటించాల్సిన అవసరం లేదన్నారు.

Chandrababu Case Arguments in ACB Court: పోలీసులు నన్ను మానసికంగా వేధించారు.. వాహనంలో తిప్పుతూనే ఉన్నారు

అదనపు ఏజీ వాదనలు వినిపిస్తూ.. 17A సెక్షన్‌ని పిటిషనర్‌ తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు 370 కోట్ల రూపాయలు నష్టం జరిగేలా పిటిషనర్‌ ప్రణాళిక రచించారన్నారు. ప్రజాధనం మళ్లింపు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఐటీ, పీఎంఎల్‌ఏ కింద కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. నిజాయతీపరులైన అధికారులకు రక్షణ కల్పించేందుకు సెక్షన్‌ 17Aని తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ ధనాన్ని దోచుకొని ఆ సెక్షన్‌ కింద రక్షణ పొందడానికి వీల్లేదన్నారు.

సెక్షన్‌ 17A అమల్లోకి రాకపూర్వం నేరం చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుత కేసుకు ఆ సెక్షన్‌ వర్తించదన్నారు. కాగ్నిజిబుల్‌ నేరాల దర్యాప్తు ప్రారంభ దశలో ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే పిటిషనర్‌ను నిందితుడిగా ఇన్నిరోజుల తర్వాత చేర్చామని.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు సమయంలో తన పేరులేదని, తర్వాత చేర్చారనే కారణంతో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని పిటిషనర్‌ కోరలేరన్నారు. న్యాయస్థానంలో విచారణ దశలో సైతం నిందితుడిగా చేర్చవచ్చని ప్రస్తుత కేసులో సీమెన్స్, డిజైన్‌టెక్‌ సంస్థలు వాటా సొమ్మును ఖర్చు చేయకుండా, యూనిట్లు ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.371 కోట్లను విడుదల చేసిందన్నారు. ఆ సొమ్మును షెల్‌ కంపెనీలు విత్‌డ్రా చేసుకున్నాయని వాదనలు వినిపించారు.

షెల్‌ కంపెనీల నుంచి ఆ సొమ్ము తిరిగి పిటిషనర్‌కు చేరిందా.. లేదా అన్నది తేల్చాల్సి ఉందన్నారు. ప్రాజెక్టు ఏర్పాటు విషయంలో టెండర్‌ విధానాన్ని అనుసరించలేదన్నారు. మొదటి నిందితుడు గంటా సుబ్బారావు ప్రభుత్వ అధికారి కాదని ఆయనను తీసుకొచ్చి నాలుగు కీలక పోస్టులు అప్పగించారని తెలిపారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం జారీచేసిన జీవోలో 90 శాతం టెక్నాలజీ భాగస్వాములు సీమెన్స్, డిజైన్‌టెక్‌ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం 10శాతం ఖర్చు భరించాలని పేర్కొన్నారు. అందుకు భిన్నంగా ఒప్పందంలో ఆ విషయాన్ని ప్రస్తావించలేదన్నారు.

చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ..నిర్ణయం రేపటికి వాయిదా

దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్‌ వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాస్, మరో వ్యక్తి మనోజ్‌ వాస్‌దేవ్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. వారిరువురూ దేశం విడిచి వెళ్లారన్నారు. దేశం విడిచి వెళ్లడానికి పిటిషనర్‌ సహకారం ఉన్నట్లు సందేహం కలుగుతోందని పేర్కొన్నారు. జీఎస్‌టీ నివేదిక, ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదిక, సీమెన్స్‌ సంస్థ ఇచ్చిన నివేదిక, ఐటీ రిపోర్టు, సీఐడీ నిర్వహించిన ప్రాథమిక విచారణ నివేదికలను పరిగణనలోకి తీసుకున్నాకే పిటిషనర్‌ను 37వ నిందితుడిగా చేర్చామన్నారు. 2018 తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లు కనిపించకుండా పోయాయని.. ఆ ఫైళ్లను సంబంధిత శాఖ అధికారులు పునరుద్ధరిస్తున్నారన్నారు. ప్రాజెక్టు నిధుల విడుదల విషయంలో ఆర్థికశాఖ లెవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండా సొమ్ము విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని చంద్రబాబు పిటిషన్‌ కొట్టేయాలని వాదించారు.

చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌సాల్వే, సిద్దార్థ లూథ్రా రిప్లై వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు 2021 నుంచి సాగుతోందని 8మంది నిందితులు బెయిలు పొందారన్నారు. 2021 నుంచి దర్యాప్తు చేస్తున్న కేసులో కనిపించకుండా పోయిన ఫైలును ప్రస్తుతం పునరుద్ధరిస్తున్నట్లు సీఐడీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2021లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి.. 2018 జూన్‌లో ప్రాథమిక విచారణ ప్రారంభమైనందున సెక్షన్‌ 17ఏ ప్రకారం గవర్నర్‌ నుంచి అనుమతి అవసరం లేదనే అదనపు ఏజీ వాదన అర్థరహితమన్నారు.

Twitter Posts on Chandrababu Naidu Arrest : ఈ అరాచకాలు.. ఎన్నాళ్లు.. ఇంకెన్నాళ్లు.. మౌనం వెనక ప్రళయం ఉంది.. గుర్తుపెట్టుకో జగన్

కేసుకు సంబంధించిన దస్త్రాలు మాయం అయ్యాయని చెప్పడం సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం అలవాటుగా మార్చుకున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు ఖర్చు విషయంలో మొదటి నిందితుడు గంటా సుబ్బారావు, సీమెన్స్‌ సంస్థ మధ్య జరిగిన చర్చకు సంబంధించిన ఈ మెయిల్‌లో కొంతభాగాన్ని మాత్రమే సీఐడీ కోర్టు ముందు ఉంచిందన్నారు. ప్రాజెక్టు విషయంలో ఎలాంటి గోప్యతా పాటించలేదని పూర్తి వివరాలను క్యాబినెట్‌ ముందు ఉంచి ఆమోదం పొందారని తెలిపారు.

ఆదాయపుపన్నుశాఖ ఇచ్చిన నోటీసు ఆధారంగా ఆరోపణలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ దురుద్దేశం అర్థమవుతోందన్నారు. పిటిషనర్‌ను జైల్లో ఉంచి ఇబ్బందికి గురిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత దూరమైనా వెళుతోందని స్పష్టమవుతోందన్నారు. సెక్షన్‌ 17ఏ విషయంలో సీఐడీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయిందని పేర్కొన్నారు. దర్యాప్తు ఇప్పుడు ప్రారంభమైందని ఒకవైపు రెండేళ్లకిందట నుంచి దర్యాప్తు చేస్తున్నామని మరోవైపు సీఐడీ తరఫు న్యాయవాదులు చెబుతున్నారన్నారని.. ఏది నిజమో చెప్పాలన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పిటిషనర్‌కు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు.

CID Investigation in Chandrababu Case: అంతా స్క్రిప్ట్​ ప్రకారమే.. ఎంచుకున్న వారిపైనే కేసులు, అరెస్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.