'నా ఖాతాలో ఆ డబ్బు మోదీనే జమచేశారు.. నేనివ్వను'

author img

By

Published : Sep 15, 2021, 7:18 PM IST

bihar news

పొరపాటుగా తన బ్యాంకు ఖాతాలో పడ్డ రూ.5 లక్షలను తిరిగిచ్చేందుకు ఓ వ్యక్తి నిరాకరించాడు. తనకు ఆ డబ్బును ప్రధాని మోదీ జమచేశారని, వాటిని ఖర్చుపెట్టానని తెలిపాడు. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలో పొరపాటున రూ.5 లక్షల 50వేలు డిపాజిట్​ అయ్యాయి. అయితే.. అవి ప్రధాని మోదీ జమ చేశారని భావించిన సదరు వ్యక్తి.. ఆ నగదును తిరిగిచ్చేందుకు నిరాకరించాడు. డబ్బును పూర్తిగా ఖర్చు పెట్టానని తెలిపాడు. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

ఏం జరిగిందంటే..?

బిహార్​ ఖాగఢియా జిల్లా భక్తియార్​పుర్ గ్రామానికి చెందిన రంజిత్ దాస్ బ్యాంకు ఖాతాలో.. ఖాగఢియా గ్రామీణ బ్యాంకు నుంచి.. పొరపాటున రూ.5.5 లక్షలు జమయ్యాయి. అయితే.. ప్రధాని మోదీ చెప్పినట్లుగానే తన ఖాతాలో నగదు డిపాజిట్ అయిందని రంజిత్ దాస్ అనుకున్నాడు.

" మార్చిలో తన ఖాతాలో నగదు డిపాజిట్ అయినప్పుడు నేను చాలా సంతోషించా. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్​ చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ.. చెప్పినట్లుగా నా ఖాతాలో మొదటి విడత కింద నగదు జమైందని భావించాను. డబ్బు మొత్తం ఖర్చు చేశాను. ఇప్పుడు నా ఎకౌంట్​లో డబ్బు లేదు." అని రంజిత్ దాస్ చెప్పుకొచ్చాడు. డబ్బును తిరిగిచ్చేయాలని ఇప్పటికే చాలాసార్లు.. బ్యాంకు నుంచి నోటీసులు వచ్చినా.. రంజిత్ దాస్ మాత్రం ఆ డబ్బును ఇచ్చేందుకు నిరాకరించాడు.

బ్యాంకు మేనేజర్​ ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే రంజిత్ దాస్​ను అరెస్ట్ చేశామని స్థానిక పోలీస్ స్టేషన్​ హౌస్ అధికారి దీపక్​ కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి: 'భారత్​.. ప్రజాస్వామ్యానికి అమ్మ లాంటిది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.