కారుతో ఢీ కొట్టి చంపుతానంటూ కుక్కను ఉసిగొల్పారు- వైసీపీ నేతల దాష్టికం - YSRCP ZPTC Fraud Case
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 4, 2024, 12:42 PM IST
YSRCP ZPTC Fraud Case: కృష్ణా జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగం పేరిట వైసీపీ జడ్పీటీసీ దంపతుల ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్- 2 పోస్టు ఇప్పిస్తామంటూ జడ్పీటీసీ కల్యాణి, ఆమె భర్త శివప్రసాద్ మోసాలకు పాల్పడ్డారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం: లక్ష్మీపురానికి చెందిన వార్డ్ మెంబర్ శ్రీనివాసరావు, సుమలత దంపతులకు అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్- 2 పోస్టు ఇప్పిస్తామని చెప్పి జడ్పీటీసీ దంపతులు 7 లక్షల 65వేల రూపాయలు తీసుకున్నారు. తీరా మోసపోయినట్లు తెలుసుకుని తమ డబ్బులు తిరిగి చెల్లించాలని ఇంటికి వెళ్తే కుక్కలతో దాడి చేయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కారుతో ఢీకొట్టి చంపేస్తామని బెదిరిస్తున్నట్లు వాపోయారు. పైగా తమ వెనుక మంత్రులు జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని, ఎక్కడికి వెళ్లినా ఏం చేయలేరని జడ్పీటీసీ దంపతులు చెప్పినట్లు తెలిపారు. కలెక్టర్ కూడా తమకు అనుకూలంగా ఉంటారని, ఎస్పీకి ఫోన్ చేస్తే ఇంటికి వస్తారన్నట్లు బాధితులు చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో న్యాయం కోసం మీడియాను ఆశ్రయించినట్లు తెలిపారు.