ప్రొద్దుటూరు పాత మార్కెట్లో చెలరేగిన మంటలు - భయాందోళనలో స్థానికులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 25, 2024, 3:21 PM IST
Fire Accident in Proddatur Old Market : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని పాత మార్కెట్లో ఈరోజు (గురువారం) తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సమీపంలోని ముగ్గు పిండి, రంగు విక్రయాలకు సంబంధించిన మూడు దుకాణాల్లో ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటల కారణంగా ఆ దుకాణాల్లో ఉన్న మెుత్తం సామాగ్రితో పాటు రెండు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే తేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. దీంతో స్థానికులు ఊపీరి పిల్చుకున్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావటంతో మంటలు ఒక్కసారిగా వ్యాప్తి చెందాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రమాదంలో సుమారు నాలుగు లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దుకాణాలు కాలిపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.