అర్వింద్ను గెలిపించండి - నోరు జారిన ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ - సోషల్ మీడియాలో వీడియో వైరల్ - MAHESH KUMAR GOUD VIRAL VIDEO
Published : Mar 31, 2024, 4:18 PM IST
Congress Mahesh Kumar Goud Controversy Statement : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ నోరు జారారు. శనివారం నిజామాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేసంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి అర్వింద్ను గెలిపించండి, కేంద్రమంత్రిని చేసుకుందాం అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి బదులు అర్వింద్ పేరును మహేశ్ కుమార్ ప్రస్తావించారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. దీనిపై కొందరు పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో, అదీ సభల్లో పార్టీ అభ్యర్థి పేరు మరచి ఇతరుల పేర్లతో ఎలా ప్రస్తావిస్తారని మండిపడుతున్నారు.
నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంది. ఎంపీ అర్వింద్ను ఓడించి ఆ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అందుకే ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఎన్నికల బరిలో దించింది. మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ రాజకీయ నిలకడ కోల్పోతుంది. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సైతం ఇతర పార్టీ కండువా కప్పుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది.