ETV Bharat / state

అరాచకాలే అర్హతగా వైసీపీ అభ్యర్థుల జాబితా - భూకబ్జాదారులు, అక్రమార్కులకే అవకాశం - YSRCP Candidates List

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 10:51 AM IST

YSRCP_Candidates_List
YSRCP_Candidates_List

YSRCP Candidates List: గడప గడపకు వెళ్లండి, జనంలో ఉండండి. గ్రాఫ్‌ పెరిగితేనే మళ్లీ టికెట్లంటూ హూంకరించారు. పనిచేయని వారికి టికెట్లుండవంటూ వార్నింగులు ఇచ్చారు. తీరా అభ్యర్థుల జాబితా చూశాకా ఆ పార్టీ శ్రేణులే అమ్మో అనేలా చేశారు. ఇలాంటి వారికి ఓట్లేయాలని జనం ముందుకు ఏ మొహం పెట్టుకుని వెళ్లాలంటూ వారంతా నిట్టూరుస్తున్నారు.

అరాచకాలే అర్హతగా వైసీపీ అభ్యర్థుల జాబితా - భూకబ్జాదారులు, అక్రమార్కులకే అవకాశం

YSRCP Candidates List : గ్రామాల్లోకి వెళ్లండి, ఇంటింటికీ తిరగండి. జనంలోనే ఉండండి అంటూ ఎమ్మెల్యేలను సీఎం జగన్‌ పదేపదే బెదిరిస్తుంటే ప్రజాసమస్యల గుర్తింపు, పరిష్కారంపై ఎంతో పట్టుదలగా ఉన్నారని జనం భ్రమించారు. తమ ప్రజాప్రతినిధుల్లో మార్పు తేవడానికి కృషి చేస్తున్నారని సొంతపార్టీ కార్యకర్తలు భావించారు. తీరా ఎన్నికలు వచ్చాక, వైసీపీ అభ్యర్థుల్ని ప్రకటించాక అవాక్కయ్యారు. సీఎం హెచ్చరికల వెనుక ఆంతర్యం అంతుబట్టక పలువురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎమ్మెల్యేలు గడప గడపకూ తిరిగారు.

అలాంటి వారిలో అత్యధికులు బలిపశువులై టికెట్లు కోల్పోయారు. జగన్‌ టికెట్‌ ఇచ్చిన వారిలో అత్యధికులు భూకబ్జాలు, అక్రమాలు, అరాచకాలు, ఇసుక, మట్టి, మైనింగ్, సెటిల్‌మెంట్లు, రౌడీయిజం, కుంభకోణాల్లో ఆరితేరిన వారే ఉన్నారు. ఓటర్ల జాబితాలో లెక్కకు మించి అక్రమాలకు పాల్పడటం వంటి ప్రత్యేక అర్హతలు ఉన్నవారూ కొందరున్నారు.

చిత్తూరు జిల్లాలో అవినీతి, అక్రమాలు, అరాచకాలు ఇలా ఒక్కటేమిటీ దోపిడీకి ప్రత్యామ్నాయ పదాలు దొరకనంత స్థాయిలో చెలరేగుతున్న ఒక సీనియర్‌ మంత్రికి సిట్టింగ్‌ సీటునే ఖరారు చేశారు. తానో సామంతుడిలా ఆ ప్రాంతంలో రాజ్యమేలుతున్న ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్‌, దుంగల దొంగలకు పోలీసులను ఎస్కార్టుగా పెట్టి మరీ జిల్లా దాటిస్తున్నారు.

కూటమి అధికారంలోకి రాగానే నెలకు రూ.4 వేల పింఛన్‍: చంద్రబాబు - Chandrababu Tour in Kuppam

ఈ మంత్రి సిఫార్సుతోనే అదే జిల్లాలో ఒక దళిత ఎమ్మెల్యేని బలిపశువును చేసిన సీఎం జగన్‌ ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. ఇదే జిల్లాలోని మరో మంత్రి తన నియోజకవర్గంలో కుటుంబ సభ్యులతో కలిసి అవినీతికి పాల్పడ్డారని, సొంత పార్టీ వారమైనా తమ వద్దే డబ్బులు వసూలు చేశారని ప్రెస్‌మీట్లు పెట్టి ఆరోపించారు. వారి గోడును ఏమాత్రం పట్టించుకోకుండా ఆ మంత్రికి జగన్‌ మళ్లీ టికెట్‌ ఇచ్చి ప్రోత్సహించారు.

చిలకలూరిపేట వైసీపీ ఇంఛార్జి పదవి కోసం మంత్రి విడదల రజినికి ఆరున్నర కోట్ల రూపాయలు ఇచ్చానంటూ ఆ నియోజకవర్గానికి చెందిన మల్లెల రాజేష్‌నాయుడు ఇటీవల బహిరంగంగానే ఆరోపించారు. నియోజకవర్గంలో మంత్రి కుటుంబ సభ్యుల అవినీతిపైనా ఆయన ఆరోపణలు గుప్పించారు. ధైర్యం ఉంటే చిలకలూరిపేట నుంచే పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. స్థానికంగా వ్యతిరేకతను కూడగట్టుకున్న ఆమె అక్కడైతే గెలవడం కష్టమని భావించిన వైసీపీ అధిష్ఠానం ఇప్పుడు గుంటూరు పశ్చిమకు మార్చింది.

ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో దోపిడీ కొనసాగించారు. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం చేపట్టిన భూసేకరణలో లక్షల రూపాయల్లో ఉన్న భూముల ధరలను కోట్ల రూపాయలకు పెంచి ప్రజాధనాన్ని నొక్కేశారు. విచ్చలవిడిగా ప్రైవేటు పంచాయతీలు, సెటిల్‌మెంట్లు చేస్తూ దోచుకున్నారు. ప్రతి పనికీ కమీషన్‌తో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఈయనకు ఇప్పుడు పక్క జిల్లాకు బదిలీ చేసి అక్కడ టికెట్ కేటాయించారు.

యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు - చూసీచూడనట్లు ఉంటున్న అధికారులు - YSRCP Election Code Violations

గుంటూరు జిల్లాలో స్థిరాస్తి వ్యాపారుల నుంచి కమీషన్ల రూపంలో ప్లాట్లు తీసుకుంటూ, మట్టి మాఫియాలో వాటాలు దండుకుంటూ, మహిళలతో అడ్డగోలుగా మాట్లాడుతూ పార్టీ పరువు తీసిన నేతకు, కృష్ణా జిల్లాలో సంక్రాంతి ముసుగులో పేకాట, క్యాసినో లాంటి అసాంఘిక కార్యకలాపాలు సాగించిన మరో నేతకూ జగన్‌ టికెట్లు ఇచ్చారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అవినీతి, అక్రమాలు, అరాచకాలను ఆధారాలతో సహా నిరూపిస్తానని వైసీపీ నేత, పట్టణ సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు కాళ్ల గౌరీశంకర్‌ బహిరంగంగానే ఆరోపించారు.

ఎమ్మెల్యే వడ్డీ వ్యాపారిలా అరాచకాలు సాగిస్తున్నారని, ఏదైనా పని కావాలంటే ఆయన దగ్గరుండే ఇద్దరు వ్యక్తులు చెప్పినట్లు చేయాలని, స్వామి చిట్స్‌ కంపెనీల్లో 50లక్షల రూపాయల నుంచి రూ.కోటి చిట్‌లు కట్టాలని ఆయన అల్లుడికీ వాటాలు ఇవ్వాలని వాపోయారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చలానాలు కాకుండా అదనంగా సమర్పించుకునే ముడుపులు నేరుగా ఎమ్మెల్యేకి చేరుతున్నాయంటూ వీరభద్రస్వామి అక్రమాలను గౌరీశంకర్‌ వెల్లడించారు. జగన్ మాత్రం అలాంటి వ్యక్తినే మళ్లీ బరిలోకి దించారు.

ప్రశాంత నగరమైన విశాఖలో రౌడీమూకలు, అరాచక శక్తులతో ప్రత్యేకంగా ఒక సామ్రాజ్యాన్నే స్థాపించుకుని, ప్రతిపక్ష నేతలు నగరానికి వచ్చినప్పుడు వారిపైకి తన అనుచరులను ఉసిగొల్పుతున్న రౌడీ రాజుకు మళ్లీ టికెట్‌ ఇచ్చారు. నేరెళ్లవలసలో రైతు డీ-పట్టా స్వాధీనం చేసుకుని, వాటిని భూసేకరణ సమయంలో వీఎంఆర్​డీఏకి సమర్పించి, ప్రతిగా భారీ పరిహారాన్ని కొట్టేసిన భూ చోరుడికి విశాఖలోని ఒక నియోజకవర్గంలో టికెట్‌ ఇచ్చారు.

బస్సు యాత్రకు క్షమాపణ యాత్రగా పేరు మార్చుకో- జగన్​పై టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్ - CM Jagan bus tour

అనకాపల్లి జిల్లాకు చెందిన రాష్ట్రస్థాయి పదవిలో ఉన్న ఓ ఎమ్మెల్యే తన భాగస్వాములతో కలిసి స్థిరాస్తి వెంచర్‌ వేసి పదెకరాలు ఆక్రమించారు. క్వారీల నుంచి గ్రావెల్, మెటల్‌ బయటకు తీసుకువెళ్లాలంటే కప్పం కట్టాల్సిందేనని బెదిరించి వసూలు చేశారు. ఇలాంటి అక్రమాలతో తన సొంత నియోజకర్గంలో పరపతి కోల్పోయిన ఆ నేత అక్కడ గెలవలేరని విశాఖలో సీటిచ్చారు. టీడీఆర్​ బాండ్ల కుంభకోణానికి ఆధ్యుడిగా పేరుగాంచిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక పేరున్న ఎమ్మెల్యేకి సీఎం జగన్‌ రాష్ట్రస్థాయి పదవిచ్చారు.

ఎన్నికలు వచ్చే సరికి ఆయనకు, ఆయన కుమారుడికి టికెట్లు ఇచ్చారు. ఇదే జిల్లాకు చెందిన ఒక మంత్రి తండ్రి, సోదరుడు వంతులవారీగా వసూళ్లు చేశారనే ఆరోపణలున్నాయి. ఆ మంత్రిని దళితులు ఒక సందర్భంలో నడిరోడ్డుమీద ఒక పూటంతా ఆపేశారంటే ఎంత వ్యతిరేకత కూడగట్టుకున్నారో అర్థమవుతుంది. ఇప్పుడా ప్రజాప్రతినిధిని జిల్లాలోని మరో నియోజకవర్గానికి మార్చారు.

శ్రీకాకుళం జిల్లాలో నిలువుబొట్టుతో క్వారీల్లో దోపిడీ చేసిన వ్యక్తికి నలుగురు సామంతులతో దోపిడీ కొనసాగిస్తున్న ఓ పెద్ద ఎమ్మెల్యేకి పోలీసుస్టేషన్లలో పంచాయతీలు చేయించి లేఅవుట్లలో వాటాలు కొట్టేసిన ప్రజాప్రతినిధికి, చేతికి మట్టి అంటకుండా ఇసుక మాఫియాను నడిపిస్తూ, మాజీ జవాన్ల పేరిట తమ పక్క జిల్లా విశాఖలో భూపందేరానికి పాల్పడిన ఇద్దరు అధర్మ నేతలకు ముఖ్యమంత్రి జగన్‌ టికెట్లు ఇచ్చారు.

బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రోజా, బాలినేని శ్రీనివాసరెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, దూలం నాగేశ్వరరావు, జీఎస్‌ నాయుడు, గ్రంధి శ్రీనివాస్‌ లాంటివారు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరగడం లేదని సీఎం వార్నింగులు ఇచ్చారు. అయినా వారేమీ పద్ధతి మార్చుకోలేదు. కానీ, వారందరికీ ఇప్పుడు టికెట్లు దక్కాయి. ప్రతాపమంతా బడుగులపైనే చూపించారు.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించినప్పుడు 27 మంది సిటింగ్‌లకు టికెట్లు నిరాకరిస్తే వారిలో 17మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారు. మరో 14 మంది ఎమ్మెల్యేలను వారి నియోజకవర్గాల నుంచి వేరే నియోజకవర్గాలకు మారిస్తే వారిలో 10 మంది ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. దోపిడీలో ముందు వరసలో నిలిచిన వారిని అరాచకాలే అర్హతగా గుర్తించి సీఎం వారిని మళ్లీ బరిలోకి దించారు.

18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన జనసేన - Janasena Candidates for 18 Seats

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.