ETV Bharat / state

అఫిడవిట్ వివాదంలో కీలక మలుపు - మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు కొట్టేసిన నాంపల్లి కోర్టు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 10:01 PM IST

Srinivas Goud affidavit Case
Ex Minister Srinivas Goud Case

Ex Minister Srinivas Goud Case : బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై కేసు నమోదు చేయాలంటూ వేసిన పిటీషన్‌ను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేసింది. పిటిషన్‌కు విచారణార్హత లేదన్న కోర్టు, హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌ రాఘవేంద్ర రాజుకు సూచించింది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్‌ కుమార్‌పై దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

Ex Minister Srinivas Goud Case : 2018 ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు పొందుపరిచారంటూ బీఆర్ఎస్(BRS) మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై కేసు వేసిన పిటిషన్‌ను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేసింది. పిటిషన్‌కు విచారణార్హత లేదన్న కోర్టు, హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. 2018 ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేశారని, దీనిపై సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదని మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన రాఘవేందర్ రాజు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ నిర్వహించిన కోర్టు, శ్రీనివాస్‌గౌడ్, కేంద్ర ఎన్నికల కమిషన్(CEC), అప్పటి ఎన్నికల అధికారితో కలిపి 11మందిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా తగిన సాక్ష్యాధారాలు లేవని పోలీసులు కోర్టుకు నివేదిక ఇచ్చారు. పోలీసుల నివేదికపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

కవిత ఈడీ కేసు మరోసారి వాయిదా - ఈనెల 28న విచారణ​

పిటిషన్‌ను ఎందుకు విచారించాలనే దానిపై వివరణ ఇవ్వాలని ప్రజాప్రతినిధుల కోర్టు, పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. పిటిషన్‌ విచారణార్హం కాదని కోర్టు తెలిపింది. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది పలు కోర్టు తీర్పులను ప్రస్తావించారు. వాదనలు ముగిసిన అనంతరం తీర్పును రిజర్వు చేసిన కోర్టు, ఉత్తర్వులను వెలువరించింది. రాఘవేందర్ రాజు వేసిన పిటిషన్‌ను ఈ కోర్టు విచారించే పరిధి లేదని ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పునిచ్చింది. ఏ కోర్టుకు ఆర్హత ఉందనే విషయాన్ని తేల్చుకోవడానికి హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌ రాఘవేందర్‌ రాజుకు సూచించింది.

Voditela Satish Kumar Case : మరోవైపు 2018 ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్‌ కుమార్‌పై దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. నామినేషన్ పత్రాల్లో పూర్తి వివరాలు వెల్లడించనందున సతీశ్‌ కుమార్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ సీపీఐకి చెందిన చాడ వెంకట్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సతీశ్‌ కుమార్ దాఖలు చేసిన నామినేషన్ పేపర్లలో అవిభక్త కుటుంబానికి చెందిన ఆదాయాన్ని పేర్కొనలేదని, నామినేషన్ పత్రాల్లో కొన్ని వివరాలను వెల్లడించలేదని పేర్కొన్నారు.

మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించామని, అందులో ఒక సెట్‌లో కొన్ని వివరాలు పొరపాటున నమోదు చేయలేదని సతీశ్‌ కుమార్ తరపు న్యాయవాది రామారావు కోర్టుకు తెలిపారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని పేర్కొన్నారు. మూడు సెట్లలో అన్ని వివరాలు ఉన్న సెట్‌నే ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్‌గా స్వీకరించారన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న జస్టిస్ కె.లక్ష్మణ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. కోర్టు కమిషనర్ నమోదు చేసిన ఆధారాల నేపథ్యంలో సతీశ్‌ కుమార్ ఎన్నికను రద్దు చేయడానికి తగిన ఆధారాలు లేవని హైకోర్టు పేర్కొంది.

గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టులో తీర్పు రిజర్వ్​

స్థిరాస్తి వ్యాపారాల్లో శివబాలకృష్ణ భారీ పెట్టుబడులు, కీలక ఆధారాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.