ETV Bharat / state

కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా - ప్రయోజనాల్లో మాత్రం అదనపు పెరుగుదల లేదు : కాగ్ నివేదిక

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2024, 12:14 PM IST

Updated : Feb 15, 2024, 2:01 PM IST

Telangana Assembly Sessions 2024
Telangana Assembly Sessions 2024

CAG Report in Telangana Assembly Sessions 2024 : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ ఇచ్చిన నివేదికను ప్రవేశపెట్టింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికి ప్రయోజనాల్లో అదనపు పెరుగుదల లేదని ఈ నివేదిక పేర్కొంది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక రంగంపై ఇచ్చిన నివేదికలో రెవెన్యూ రాబడి ఎక్కువ చూపి, రెవెన్యూ లోటు తక్కువ చూపారని కాగ్ వెల్లడించింది.

CAG Report in Telangana Assembly Sessions 2024 : తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ఆడిట్, రాష్ట్ర ఆర్థికరంగంపై కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రెవెన్యూ, జనరల్, సోషల్, ఆర్థిక రంగాలపై, పీయూసీలు, స్థానిక సంస్థలు, డీబీటీ ద్వారా ఆసరా పింఛన్లపై కాగ్ ఇచ్చిన నివేదికను డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభ ముందు ఉంచారు. ప్రాజెక్టు నిర్మాణం, రీ-ఇంజినీరింగ్‌, చేకూరిన ప్రయోజనాలు, నష్టాలను ఆడిట్‌ నివేదికలో కాగ్‌ సమగ్రంగా వివరించింది.

CAG Report On Kaleshwaram Project in Assembly : 2008లో ఉమ్మడి రాష్ట్రంలో 16.40లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందించే ఉద్దేశంతో 38వేల 500కోట్లతో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు తెలిపింది. కేంద్ర జలసంఘం ఆమోదం లేకుండానే 2008-2009 మధ్య కాలంలో ప్రాజెక్టు పనులను వివిధ కాంట్రాక్టర్లకు అప్పగించి, పనులు ప్రారంభించినట్లు వెల్లడించింది.

రాష్ట్ర విభజన అనంతరం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును, ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టులుగా విభజించి ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి మొత్తం 85వేల651.81 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 20.26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు, ఇప్పటికే ఉన్న మరో నాలుగు ప్రాజెక్టులకు నీటి లోటును పూరించాలని భావించినట్లు వివరించింది. 2022 మార్చి చివరి నాటికి ప్రాణహిత ప్రాజెక్టుపై 17వేల 27.44 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై 86వేల788.06 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.

"ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు వాస్కాస్‌ రూపొందించిన డీపీఆర్‌లో అనేక లోపాలున్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యతలను సైతం అదే సంస్థకు అప్పగించినట్లు వివరించింది. 2018 జూన్‌లో కేంద్ర జలసంఘం డీపీఆర్‌ను ఆమోదించడానికి ముందే సాగునీటి శాఖ ఈ ప్రాజెక్టుకు సంబందించి 25వేల 49.90 కోట్ల విలువగల 17 పనులను అప్పగించిందని, ఆమోదం తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేసినట్లు తెలిపింది. కేంద్ర జలసంఘానికి సమర్పించిన డీపీఆర్‌లో ఈ ప్రాజెక్టు కోసం గోదావరి నది మంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించినా, అవసరం లేకున్నా పంపింగ్ సామర్థ్యాన్ని రోజుకు 3 టీఎంసీలకు పెంచారని దీని కారణంగా 428.151 కోట్ల అదనపు వ్యయం అవుతుందని పేర్కొంది.

కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికి ప్రయోజనాల్లో అదనపు పెరుగుదల లేదని, విద్యుత్ వినియోగానికి ఏటా రూ.3,555 అదనపు వ్యయం పెరిగిందని కాగ్ నివేదిక వెల్లడించింది. రీ ఇంజినీరింగ్‌, మార్పుల వల్ల అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్థకం అయ్యాయని, రీ ఇంజినీరింగ్, మార్పుల వల్ల రూ.765 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. పనుల అప్పగింతలో నీటి పారుదల అనుచిత తొందరపాటు ప్రదర్శించిందని పేర్కొంది.

"అవసరం లేకున్నా కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టారు. అదనపు టీఎంసీ వల్ల రూ.25 వేల కోట్ల అదనపు వ్యయం అయింది. సాగునీటిపై మూలధనం వ్యయం ఒక్కో ఎకరానికి రూ.6.42 లక్షలు అవుతుంది. ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి 1.51గా అంచనా వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి 0.75గా తేలుతోంది. ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి మరింత తగ్గే అవకాశముంది. లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్నసాగర్ నిర్మించారు." అని కాగ్ తన నివేదికలో పేర్కొంది.

డ్రాయింగ్​లో ఒకలా, కట్టింది మరోలా - 'మేడిగడ్డ' అంతా లోపాలమయం

CAG Report On Telangana Financial Status : అనంతరం 2022 మార్చి నాటికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్‌ ఇచ్చిన నివేదికను భట్టి విక్రమార్క సభ ముందు ఉంచారు. ఈ నివేదికలో రెవెన్యూ రాబడి ఎక్కువ చూపి, రెవెన్యూ లోటు తక్కువ చూపారని కాగ్ పేర్కొంది. విద్య, వైద్యం మీద ఖర్చులో రాష్ట్రం వెనకబడి ఉందని తెలిపింది. మొత్తం వ్యయంలో విద్య మీద కేవలం 8 శాతం, ఆరోగ్యం మీద 4 శాతమే ఖర్చు చేశారని నివేదికలో వెల్లడైంది. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తులు, అప్పుల పంపకంపై పురోగతి లేదని తెలిపింది. విభజన ఆస్తుల పంపకాల విషయమై తగినంత దృష్టి లేదని చెప్పింది.

"రూ.1.18 లక్షల కోట్లు బడ్జెట్‌ వెలుపలి రుణాలను బడ్జెట్‌లో వెల్లడించలేదు. బడ్జెట్‌ వెలుపలి రుణాలు జీఎస్‌డీపీ అప్పుల నిష్పత్తిపై ప్రభావం ఉంటుంది. అప్పుల ద్వారానే రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సి వచ్చింది. రుణాలపై వడ్డీలకు 2032-33 నాటికి రూ.2.52 లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ ఆర్థికభారం ప్రభుత్వాన్ని గణనీయమైన ఒత్తిడికి గురిచేస్తుంది. బడ్జెట్‌ కేటాయింపులతో పోలిస్తే సంక్షేమ పథకాలపై ఖర్చులో తగ్గుదల ఉంది." అని కాగ్ తన నివేదికలో వెల్లడించింది.

డ్యామ్​కు, బ్యారేజీకి తేడా లేకుండా నిర్మాణాలు చేశారు : ఉత్తమ్ కుమార్

రేవంత్‌రెడ్డికి చేతకాకపోతే నాకు బాధ్యతలు అప్పజెప్పమనండి: హరీశ్‌రావు

Last Updated :Feb 15, 2024, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.