ETV Bharat / state

ఆదిలాబాద్‌ టూ ఆర్మూర్‌ రైల్వేలైన్‌ కోసం ఏళ్లుగా పోరాటం - ఇకనైన ఆ జిల్లా వాసుల కల నెరవేరేనా ?

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 4, 2024, 3:31 PM IST

Adilabad to Armoor Railway line Project
Adilabad to Hyderabad New Railway line

Adilabad to Hyderabad New Railway line : తెలంగాణకు శిరో భాగంలో ఉండే జిల్లా ఆదిలాబాద్‌. తెల్ల బంగారంగా పేరొందిన పత్తిపంటకు ప్రసిద్ధి. సున్నపురాయి నిలువల బాండాగారం. ఉత్తర, దక్షిణ భారతాన్ని అనుసంధానం చేసే ముఖ ద్వారం. భౌగోళికంగానే కాదు ప్రకృతి సహజసిద్ధమైన విశేషాలకు ఆదిలాబాద్‌ పెట్టింది పేరు. ఇంతటి ప్రత్యేకతలు కలిగిన ఈ జిల్లా దశాబ్దాలుగా పాలకుల పట్టింపులేనితనంతో నిరాధరణకు గురవుతోంది. జిల్లా వాసుల చిరకాల కోరికైన ఆదిలాబాద్‌- హైదరాబాద్ రైల్వే లైన్‌ ఏర్పాటులో ప్రభుత్వాలు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నాయి. దేశానికి స్వాతంత్రం రాకముందు అప్పుడెప్పుడో నిజాం పాలనలో వేసిన రైల్‌మార్గమే తప్పితే కొత్తగా హైదరాబాద్​కు రైల్ మార్గం అందుబాటులోకి రాలేదు. మరెందుకిలా.? జిల్లా వాసుల పట్ల పాలకుల మొండి వైఖరి దేనికి.? ఆదిలాబాద్‌ ప్రజలు కోరుతున్నట్లు రైల్వేలైన్‌ మంజూరు చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలిగే అవకాశముంది.? ఎన్నికలు సమీపిస్తున్నందున ఇప్పుడైనా వీరి మొరవింటారా.

ఆదిలాబాద్‌-ఆర్మూర్‌ రైల్వేలైన్‌ కోసం ఏళ్లుగా పోరాటం-ఇకనైన ఆ జిల్లా వాసుల కల నెరవేరేనా ?

Adilabad to Hyderabad New Railway line : ఆదిలాబాద్‌ నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో 350 కిలోమీటర్లు. రైలు మార్గంలో 600 కి.మీ రోడ్డుమార్గంలో ఆదిలాబాద్‌-నిర్మల్‌-ఆర్మూర్‌-కామారెడ్డి(Kamareddy) మీదుగా హైదరాబాద్‌ వెళ్లేలా 44వ నంబర్‌ జాతీయ రహదారి ఉంది. అదే రైల్‌మార్గంలో ఆదిలాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని కిన్వట్‌, ముథ్కేడ్‌కు వెళ్లి తిరిగి నిజామాబాద్ మీదుగా తెలంగాణలోకి ప్రవేశించి హైదరాబాద్‌ చేరుకోవాల్సి ఉంటుంది. పైగా అధిక సమయం ప్రయాణించాలి. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు బస్సులో 600 రూపాయలు టికెట్‌. రైలులో అయితే 150 రూపాయలు. రెండింటి మధ్య 450 రూపాయల వ్యత్యాసం.

జిల్లావాసులు మాత్రం 600 రూపాయలు ఖర్చు చేసి బస్సుల్లోనే వెళ్తారు. కానీ, 150 రూపాయలు కేటాయించి రైలులో వెళ్లడానికి ఆసక్తి చూపరు. కారణం అధిక సమయం ప్రయాణించడం ఒకటైతే, మహారాష్ట్రకు వెళ్లి రావాలనేది మరో కారణం. ఈ విధానంతో ఎప్పుడో విసుగు చెందిన జిల్లావాసులు ఆర్మూర్‌(Armoor) మీదుగా హైదరాబాద్‌ రైల్వేలైన్‌ మంజూరు చేయాలని విన్నవిస్తున్నారు. దీనికిగాను హైదరాబాద్‌ నుంచి ఆర్మూర్‌ నిజామాబాద్‌ వరకు ఉన్న రైల్వే లైన్‌కు 110 కి.మీ దూరంలో ఉన్న ఆదిలాబాద్‌ లైన్‌ను అనుసందిచాల్సి ఉంటుంది. దీంతో 3 గంటల్లోనే హైదరాబాద్‌ చేరుకోవచ్చు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ముందు ఆదిలాబాద్‌, మహారాష్ట్రలోని కిన్వట్‌, ముథ్కేడ్‌, నాందేడ్‌ వరకు నిజాం రాజ్యం విస్తరించి ఉండేది.

అప్పట్లో వ్యాపార అవసరాలు, సైన్యం రాకపోకల కోసం నిజాం ప్రభుత్వం ఆదిలాబాద్‌ నుంచి 250 కి.మీ దూరంలోని మహారాష్ట్ర పూర్ణ వరకు మీటర్‌ గేజ్‌తో రైల్వే లైన్‌ వేసింది. దాంతో ఆదిలాబాద్‌కు తొలి రైల్‌ లైన్‌ ఏర్పడింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణ అనంతరం కిన్వట్‌, ముథ్కేడ్‌, నాందేడ్‌ మహారాష్ట్రలోకి వెళ్తే. ఆదిలాబాద్‌ ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చింది. తొంభయ్యో దశకంలో ముథ్కేడ్‌ వరకు మీటర్‌గేజ్‌గా ఉన్న రైల్వేలైన్‌ బ్రాడ్‌గేజ్‌గా మారిందే తప్పితే ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌లో కొత్తగా వచ్చిన మార్పు లేమీలేవు. ఫలితంగా రైల్లో హైదరాబాద్‌ వెళ్లాలంటే ఆదిలాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని కిన్వట్‌, ముథ్కేడ్‌ నుంచి తిరిగి తెలంగాణలోని నిజామాబాద్‌(Nizamabad) వచ్చి వెళ్లాల్సి వస్తోంది.

Adilabad to Armoor Railway Line Project : ఒకవేళ ఆర్మూర్‌ వరకు ఆదిలాబాద్‌ లైన్‌ను అనుసంధానిస్తే 300 కి.మీల ప్రయాణభారం తగ్గి మూడు గంటల్లోనే హైదరాబాద్‌ చేరుకోవచ్చు. తద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదిలాబాద్‌, గుడిహత్నూర్‌, ఇచ్చోడ, నేరడిగొండ, నిర్మల్‌, ఆర్మూర్‌ ప్రాంతాలకు రైల్వేలైన్‌ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. దాంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వ్యాపార, వాణిజ్య, విద్యావైద్యానికి పెద్దపీట వేసినట్లు అవుతుందనేది జిల్లావాసుల ఆశ. ఇందుకు ఇప్పటికే ఆర్మూర్‌ వరకు ఉన్న రైల్వేలైన్‌కు 110 కి.మీ దూరంలోని ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌ను అనుసందించాల్సి ఉంటుంది. దీనికోసం ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని జిల్లా వాసులు చెబుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లా పుష్కలమైన సున్నపు రాయి నిక్షేపాలకు పెట్టింది పేరు. పత్తి క్రయవిక్రయాల్లో ఖండాంతర ఖ్యాతిగాంచింది. ఆదిలాబాద్‌ మీదుగానే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారీ మధ్యన ఉన్న 44 నంబర్‌ జాతీయ రహదారి ఉంది. జాతీయ రహదారికి అనుగుణంగా కేవలం 110 కి.మీ దూరంలోని ఆదిలాబాద్‌-ఆర్మూర్‌ మధ్య రైల్వేలైన్‌ అనుసంధానం చేస్తే, ఆదిలాబాద్‌ జిల్లా పారిశ్రామిక కారిడార్​(Industrial corridor)గా మారుతోంది. సున్నపురాయి, పత్తి, మాంగనీసు, సోయ, వ్యాపారానికి దోహదం చేసినట్లు అవుతుంది. కానీ, ప్రస్తుతం సరైన రైల్వేలైన్‌ లేనందున జిల్లా అన్నిరంగాల్లో నిరాదరణకు గురవుతోంది. దీనికితోడు ఆపత్కాలంలో రైల్లో హైదరాబాద్‌కు వెళ్లలేని దుస్థితి. ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రులకు వెళ్లాంటే రైళ్లలో కాకుండా తలకుమించిన భారమైనా బస్సులు, ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి వస్తోంది.

రైల్వే లైన్‌ ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్‌ జిల్లా వాసులు ఎప్పటినుంచో కోరుతున్నా తొంభయ్యో దశకం నుంచి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం సర్వేల పేరిట కాలయాపణ చేస్తోంది. పార్లమెంటు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఆదిలాబాద్‌-వయా ఆర్మూర్‌ హైదరాబాద్‌ లైన్‌ తెరమీదకు వస్తోంది. గతంలో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రైల్వేలైన్‌ వేస్తామని ప్రకటించడంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా సోయం బాపురావును, ఇటీవల జిల్లాలోని నలుగురు ఆ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించి జిల్లా వాసులు బీజేపీకి జైకొట్టారు. కానీ, కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రావడం లేదు. ఇకపోతే ఇటీవల కేంద్ర ప్రభుత్వం పటాన్‌చెరు-ఆదిలాబాద్ రైల్వే పనుల విస్తరణ కోసం 5700 కోట్ల రూపాయలు కేటాయించింది.

ఎన్​హెచ్​ 44పై బాంబూ క్రాష్‌ బారియర్ రెయిలింగ్‌ - తెలంగాణలో ప్రయోగాత్మకంగా తొలిసారిగా

Adilabad People Facing Problems for Railway Line : కాగా ఇందులో ఎక్కడా ఆర్మూర్‌-ఆదిలాబాద్‌ నూతన రైల్వేలైన్‌ పేరును ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ కేంద్రం నిజంగా ఆదిలాబాద్‌-ఆర్మూర్‌ లైన్‌ను నిర్మించదలచుకుంటే ఆ పనులు ఆదిలాబాద్‌ నుంచే చేపట్టాల్సి ఉంటుంది. కానీ, 500 కిలోమీటర్ల దూరంలోని పటాన్‌చెరు(Patancheru) నుంచి ప్రారంభించడం ఏంటనేది జిల్లా ప్రజలకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిందని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. రైల్వేలైన్‌తో పాటు జిల్లా వాసులను మరో సమస్య వెంటాడుతోంది. ఉన్న లైన్ల్‌లోనూ రైళ్లు లేక ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లడం కష్టతరం అవుతుంది. ఇప్పటికీ మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌ వెళ్లాలన్నా ఒకే ఒక రైల్‌ అందుబాటులో ఉంది.

తిరుపతి -ఆదిలాబాద్‌ మధ్యన నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌(Krishna Express)తప్పితే ఆదిలాబాద్‌ జిల్లా వాసులు హైదరాబాద్‌కు వెళ్లాలంటే మరో రైల్‌ లేదు. ప్రతిరోజు నందిగ్రాం ఎక్స్‌ ప్రెస్‌ నడుస్తున్నప్పటికీ అది మహారాష్ట్రలోని ముంబయికి మాత్రమే వెళ్లుంది. ఇలా ఓ దిక్కు ఉన్న రైల్వేలైన్‌లో రైళ్లు లేక, డెబ్బయ్యేళ్ల స్వతంత్ర భారతంలో ఒక్క నూతన మార్గమూ లేక జిల్లా వాసులు రైలు ప్రయాణానికి దూరం అవుతున్నారు. దీనికి ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనం అనే అనుమానం రాకమానదు. ప్రజల నుంచి రైల్వేలైన్‌, రైళ్ల డిమాండ్‌ ఉన్నమాట వాస్తవమేననే అభిప్రాయం రైల్వే అధికారులకు ఉన్నా, ఈ విషయంలో కేంద్రం ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు.

నిజాం నాటి రైల్వేలైన్‌ జిల్లా వాసులకు ఏ మాత్రమూ ఉపయోగపడటం లేదు. పేరుకే ఆదిలాబాద్‌-హైదరాబాద్‌గా ఉన్న ఈ లైన్‌లోనూ ఒక్కటంటే ఒక్క రైలు మాత్రమే ప్రయాణిస్తుండటంతో అది అవసరాలను తీర్చలేకపోతోంది. దీంతో ఎప్పటినుంచో ఆదిలాబాద్‌ వాసులు నూతన రైల్వేలైన్‌ కోసం విన్నవిస్తున్నారు. కానీ ఆ విన్నపం ఏళ్లుగా పరిష్కారం కావడం లేదు. ఎన్నికల సమయంలోనే ఆదిలాబాద్‌-ఆర్మూర్‌- హైదరాబాద్‌ రైల్వేలైన్‌పై ప్రకటనలు చేసే రాజకీయ నాయకులు ఈ సారి ఎలాంటి హామీలివ్వబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి కలుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆదిలాబాద్‌ జిల్లాలో బహిరంగ సభలో పాల్గొనే ప్రధాని నరేంద్రమోదీ రైల్వేలైన్‌పై ఏమైనా ప్రకటన చేస్తారా అనే ఆశలు చిగురిస్తున్నాయి.

'నిజాం కాలంలో ఉన్న ఫ్రీక్వెన్సీయే ఇప్పుడు ఉంది. మార్పులు ఏమీ జరగలేదు. ఆర్మూర్​కు రైల్వే లైన్​ ఏర్పాటు చేస్తే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. దీని వల్ల హైదరాబాద్​కు ప్రయాణం​ దగ్గర అవుతుంది. దీనితోపాటు నిర్మల్​, నిజామాబాద్​, మొత్తం కనెక్టివిటీ అవుతుంది. గత 52 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్​ నుంచి హైదరాబాద్​కు వయా ఆర్మూర్​కు రైలు సౌకర్యం కల్పిస్తామంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆదిలాబాద్​ టూ హైదరాబాద్​కు రైల్వే లైన్​ ఏర్పాటు చేస్తే ప్రజలకు మేలు కలుగుతుంది.'- స్థానికులు

అలంకారప్రాయంగా క్రీడా ప్రాంగణాలు - కొత్త సర్కారైనా పట్టించుకోవాలంటూ వేడుకోలు

షెల్టర్‌ జోన్లు లేక అనాథల ఆర్తనాదాలు - ఆశ్రయం కల్పించాలంటూ నిరాశ్రయుల వేడుకోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.