ETV Bharat / politics

రాష్ట్రంలో పార్టీల ఎన్నికల ప్రచార జోరు - ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు - Election Campaign In Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 27, 2024, 8:42 PM IST

Election Campaign In Telangana
Election Campaign In Telangana

Election Campaign In Telangana : సార్వత్రిక ఎన్నికలకు మరో రెండు వారాలే గడువు ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వ్యూహాలకు పదును పెడుతూ తమ నియోజకవర్గాల్లో తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఓట్లు అభ్యర్థిస్తుండగా కేంద్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తున్నారు.

రాష్ట్రంలో పార్టీల ఎన్నికల ప్రచార జోరు- ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు

Political Parties Speedup Election Campaign : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే విజయరామారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధిహామీ కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని మిరుదొడ్డి, అక్బర్ పేట, భూంపల్లి మండలాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఆరు గ్యారంటీలతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని తెలిపారు.

Congress Party Candidate Election Campaign : ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా కుమురం భీం జిల్లా సిర్పూర్‌లో మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు. సత్రంలో కాసేపు వడ్డన చేసిన సీతక్క రోజూ వేలాది మందికి అన్నదానం చేయడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ పాలేరులోమంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు.

BJP Election Campaign : బీజేపీ అదానీ, అంబానీల కోసం మాత్రమే పనిచేస్తుందని అలాంటి పార్టీకి బుద్ధిచెప్పాలంటే ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ షాద్ నగర్, చౌదరిగూడ మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును బీఆర్ఎస్ గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బీజేపీ కిసాన్‌ మోర్చా రైతు సమ్మేళనానికి ఎంపీ ధర్మపురి అర్వింద్‌ హాజరయ్యారు. రైతులకిచ్చిన మాట ప్రకారం పసుపుబోర్డు తీసుకొచ్చానని మళ్లీ గెలిపిస్తే నెలరోజుల్లో షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తానని హామీనిచ్చారు. ఓట్ల కోసం కాంగ్రెస్‌ నాయకులు దేవుళ్లపై ఒట్లు వేయడం సిగ్గు చేటన్నారు.

ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు - విమర్శలే అస్త్రంగా అభ్యర్థులపై గురి - Election Campaign in Telangana

BRS MP Candidate Election Campaign : ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు. తెలంగాణ గొంతును లోక్‌సభలో వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీ లతోనే సాధ్యమవుతుందని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. పదేళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిథిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు.

కరీంనగర్‌ లోక్‌సభ పరిథిలోని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైదానంలో కాసేపు యువకులతో కలిసి క్రికెట్‌ ఆడారు. మెదక్ పార్లమెంట్‌ పరిథిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కూరగాయలు మార్కెట్లో రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

రాష్ట్రంలో ఊపందుకున్న ప్రధాన పార్టీల ప్రచారం - ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలతో అభ్యర్థుల ఎదురుదాడి - lok sabha elections 2024

సార్వత్రిక ఎన్నికలకు జోరందుకున్న పార్టీల ప్రచారం - వాడవాడలకు వెళ్తున్న అభ్యర్థులు - Election Campaign In Telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.