ETV Bharat / politics

మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 6:32 PM IST

Updated : Mar 5, 2024, 7:26 PM IST

Mahabubnagar BRS MP Ticket 2024 : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మహబూబ్‌నగర్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికే మరోసారి లోక్‌సభ టికెట్ ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు నాగర్‌కర్నూల్‌ ఎంపీ స్థానానికి అభ్యర్థిని ముఖ్యులతో చర్చించిన తర్వాత ప్రకటిస్తానని తెలిపారు.

Mahabubnagar BRS MP Ticket 2024
Mahabubnagar BRS MP Ticket 2024

Mahabubnagar BRS MP Ticket 2024 : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ పటిష్ఠ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వరుసగా నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కేసీఆర్ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల గురించి చర్చించారు. కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్తున్నవారిని మళ్లీ చేర్చుకోవద్దని నేతలు కేసీఆర్‌తో అన్నారు. పార్టీ వదిలి వెళ్తున్నవారిని మళ్లీ తీసుకునే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి (Mahabubnagar BRS MP)ని ప్రకటించారు. ఇప్పటికే ఆ నియోజకవర్గ ఎంపీగా కొనసాగుతున్న మన్నె శ్రీనివాస్ రెడ్డికే మరోసారి టికెట్ కేటాయిస్తున్నట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్‌ అభ్యర్థిత్వంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ముఖ్యులతో చర్చించి నాగర్‌కర్నూల్ అభ్యర్థిని ప్రకటిస్తానని కేసీఆర్ వెల్లడించారు.

KCR On Congress Govt Latest : అంతకుముందు కేసీఆర్ మాట్లాడుతూ రోజురోజుకూ కాంగ్రెస్ పాలన దిగజారిపోతోందని అన్నారు. వంద రోజులు పూర్తి కాకముందే ఈ సర్కార్ పాలనపై వ్యతిరేకత వస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలు అలవిగాని హామీలిచ్చి ఆశలు రేకెత్తించారన్న కేసీఆర్ హామీల అమలుపై నాలిక మడతపెట్టి తిట్లకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నవారు డబ్బులు లేవని చెప్పడం సరికాదని హితవు పలికారు.

లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్ - ఫస్ట్‌ లిస్ట్‌లో వీరికే ఛాన్స్

పాలమూరుకు ఎంతో చేశాం, అక్కడ ఓడిపోవాల్సింది కాదు. పాలమూరు - రంగారెడ్డి కాల్వలు పూర్తి చేసి నీరివ్వాలి. నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల అనాలోచిత చర్య. దుష్ప్రచారాలు నమ్మి ఓట్లేసినవారికి వాస్తవాలు తెలుస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటున్నాం. నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములుకు ఏం తక్కువ చేశాం? ఎంపీ రాములుతో పాటు ఆయన కుమారుడికి అవకాశాలు ఇచ్చాం. అవకాశవాదులు వస్తుంటారు పోతుంటారు. ప్రజల్లో ఉండాలి కానీ గెలుపు ఓటములు ముఖ్యం కాదు. - కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత

Mahabubnagar BRS MP Candidate 2024 : మరోసారి అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి(Manne Srinivas Reddy) కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్లు ఎంపీగా ప్రజల అభిమానం చూరగొన్నానని అన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలు మరచిపోలేరని పేర్కొన్నారు. 100 రోజుల తర్వాత కాంగ్రెస్ హామీల అమలు సంగతి తేలుతుందని వ్యాఖ్యానించారు. సీఎం నియోజకవర్గం అయినా మహబూబ్‌నగర్‌ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే ఘనవిజయం అని మన్నె శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థుల (BRS Lok Sabha Candidates 2024)ను ప్రకటించిన విషయం తెలిసిందే. క‌రీంన‌గ‌ర్ ఎంపీ అభ్య‌ర్థిగా వినోద్ కుమార్, పెద్ద‌ప‌ల్లి అభ్య‌ర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్, ఖ‌మ్మం అభ్య‌ర్థిగా సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వ‌ర్ రావు, మ‌హబూబాబాద్ అభ్య‌ర్థిగా సిట్టింగ్ ఎంపీ మాలోత్ క‌విత పేర్ల‌ను గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు ఈ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీతో చర్చించి త్వరలోనే మిగతా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.

తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం ఒక్క బీఆర్​ఎస్​తోనే సాధ్యం : హరీశ్​ రావు

'అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్​ ప్రభుత్వంపై వ్యతిరేకత - కరీంనగర్​లో బీఆర్​ఎస్ ​- బీజేపీ మధ్యే పోటీ'

Last Updated : Mar 5, 2024, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.