ETV Bharat / politics

'ఏపీలో మోదీని ప్రశ్నించే గొంతులు లేవు - పాలించే నాయకులు కాదు ప్రశ్నించే గొంతు కావాలి'

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 16, 2024, 8:04 PM IST

Updated : Mar 16, 2024, 9:46 PM IST

CM Revanth Fire on BJP
CM Revanth Attend Congress Nyay Sadhana Sabha at Vizag

CM Revanth on AP Politics : విశాఖ ఉక్కు’ను ఒక్క ఇంచు కూడా కదిలించలేరని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ రక్షణకు వైఎస్‌ షర్మిల నడుం బిగించారని ఆయన చెప్పారు. ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ పేరుతో శనివారం స్టీల్‌ ప్లాంట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

'ఏపీలో మోదీని ప్రశ్నించే గొంతులు లేవు - పాలించే నాయకులు కాదు ప్రశ్నించే గొంతు కావాలి'

CM Revanth on AP Politics : ఏపీలో మోదీని ప్రశ్నించే గొంతులు లేవని, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ‘న్యాయ సాధన సభ'కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ఈ వేదికను చూస్తోంటే విశాఖలో కాదు, హైదరాబాద్ సభలో ఉన్నట్టుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

భౌగోళికంగా విడిపోయినా తెలుగువాళ్లుగా మనమంతా ఒక్కటేనని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఏపీ, తెలంగాణ ప్రాంతీయులం.ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మనం తెలుగువాళ్లం. దిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా తెలుగు గడ్డపై ఒక్క ఇటుక పెల్లను కూడా తీయలేరు. విశాఖ ఉక్కును ఇక్కడి నుంచి కదిలించలేరని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth in Vizag Meeting : వైఎస్ఆర్ వారసులు ఎవరు అనే అనుమానం ఇక్కడి ప్రజలకు ఉండొచ్చని సీఎం రేవంత్ అన్నారు. వైఎస్సార్ సంకల్పం నిలబెట్టేవారే ఆయన వారసులు. వైఎస్ ఆశయాలకు వ్యతిరేకంగా పని చేసేవారు ఎలా వారసులు అవుతారు? దిల్లీలో ఉన్న మోదీ ఈ ప్రాంతంపై ఆధిపత్యం చలాయించాలనుకుంటున్నారు. ఇక్కడి ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తున్నారు. ఏపీలో మోదీని ప్రశ్నించే గొంతులు లేవు. పదేళ్లుగా రాజధాని ఏంటో చెప్పలేని పరిస్థితి ఇక్కడి ప్రజలది. ఇక్కడి పాలకులు ఈ ప్రాంతపు ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టారు. దిల్లీని అడిగి మన హక్కులను సాధించుకునే నాయకులు లేరని సీఎం రేవంత్ దుయ్యబట్టారు.

వైఎస్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదలను ఆదుకున్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఎవరు గెలిచినా మోదీకి మద్దతు ఇచ్చేవారే తప్ప, మోదీతో కొట్లాడే వారు లేరు. వెన్నెముక లేని నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరించలేదు. నిటారుగా నిలబడి కొట్లాడే నాయకత్వమే మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఏపీ ప్రజలకు అండగా నిలబడాలనే షర్మిలమ్మ వచ్చింది. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం, కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే వైఎస్ చివరి కోరిక. ఏనాడు వైఎస్ బీజేపీ వైపు నిలబడలేదు. వైఎస్ వారసులమని చెప్పుకుంటున్నవారు ఇవాళ ఎవరివైపు నిలబడ్డారు. - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

వైఎస్ఆర్ అంటేనే షర్మిలమ్మ : వైఎస్ నిజమైన వారసురాలు షర్మిలమ్మ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మోదీని ఎదిరించి నిలబడే శక్తి బాబు, జగన్ (YS Jagan), పవన్ కు లేదు. పాలించే నాయకులు కాదు, ప్రశ్నించే గొంతు కావాలి. మీ తరపున కొట్లాడే నాయకులు కావాలి. వైఎస్ వారసురాలు కావాలి. చట్ట సభల్లో కాంగ్రెస్‌కు, షర్మిలమ్మకు అవకాశం ఇవ్వండి. నిజమైన వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచన చేయండి. ఇక్కడ కాంగ్రెస్ లేదు అని కొందరు అనుకుంటున్నారు. కానీ ఈ సభను చూశాక షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావడం ఖాయం అనిపిస్తోంది. షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి. అండగా నేనుంటా. ఆంధ్రప్రదేశ్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామంటూ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

దిల్లీ మద్యం కుంభకోణం కేసు - 7 రోజుల ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత

పదేళ్లకు వీడిన పీటముడి - దిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల విభజన పూర్తి

Last Updated :Mar 16, 2024, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.