ETV Bharat / politics

ఏపీలో కూటమి ప్రభంజనం ఖాయం - ఎన్నికలు ఏకపక్షమే: చంద్రబాబు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 10, 2024, 7:54 AM IST

Chandrababu_Naidu_Comments
Chandrababu_Naidu_Comments

Chandrababu Naidu Comments: బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కట్టిన వేళ, ఏపీలో వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగా జరగబోతున్నాయని, తాము స్వీప్‌ చేయడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏలో చేరికపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన హస్తినలోని గల్లా జయదేవ్‌ నివాసంలో విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము తిరిగి ఎన్డీఏలో చేరినట్లు చెప్పారు. ప్రస్తుత జగన్‌ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించాలంటే కేంద్రప్రభుత్వ సహకారం తప్పనిసరని అభిప్రాయపడ్డారు.

ఏపీలో కూటమి ప్రభంజనం ఖాయం - ఎన్నికలు ఏకపక్షమే: చంద్రబాబు

Chandrababu Comments on TDP, Janasena, BJP Alliance : ఏపీలో ఎన్నికలు ఏకపక్షమేనని, కూటమి ప్రభంజనం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలిసి పనిచేయడం ముఖ్యమని అభిప్రాయపడిన చంద్రబాబు, ఇప్పటికే తెలుగుదేశం, జనసేన కలిసి పని చేస్తున్నాయన్నారు. ఇప్పుడు బీజేపీ (BJP) కలవడం వల్ల కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, అది రాష్ట్రానికి మేలు చేస్తుందన్నారు.

గత అయిదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందన్న ఆయన, రాష్ట్ర పరువు ప్రతిష్ఠలు మసకబారాయన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ సంపద సృష్టికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంటే, ఏపీ సీఎం మాత్రం ధ్వంసం చేయాలనే చూస్తున్నారన్నారు. గతంలో తాను పునాదులు వేసిన హైటెక్‌ సిటీ, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఎయిర్‌పోర్టును తర్వాత వచ్చిన రాజశేఖరరెడ్డి (YS Rajasekhara Reddy) ధ్వంసం చేసి ఉంటే హైదరాబాద్‌ ఇంత అభివృద్ధి చెందేది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దానికి పూర్తి వ్యతిరేకమైన పాలన సాగుతోందన్నారు.

ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని నింపిన ఎన్డీఏ నేతల ట్వీట్లు- రాష్ట్రాభివృద్ది కోసం పాటుపడదామంటూ ప్రకటనలు

గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) దేశ పురోగతి, అభివృద్ధి కోసం పని చేస్తున్నారన్న చంద్రబాబు, ప్రస్తుతం భారతదేశం ప్రపంచ గమ్యస్థానంగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. మోదీ హయాంలో భారత్‌ వృద్ధిరేటు పరంగా ప్రపంచంలోనే అగ్రభాగాన నిలుస్తోందన్న ఆయన, దేశంలోని మిగతా రాష్ట్రాలు ముందుకెళ్తుంటే ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే వెనక్కి వెళ్లడం దేశానికి మంచిది కాదన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో రెండుచోట్లా కూటమి ప్రభుత్వాలు ఉంటే రాష్ట్రానికి గొప్ప అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకత్వంతో ఎప్పుడూ వ్యక్తిగత విభేదాల్లేవన్నచంద్రబాబు, గతంలో ప్రత్యేక హోదా (Special Status) డిమాండ్‌తో ఎన్డీఏ నుంచి బయటికొచ్చాం తప్ప మరే కారణం లేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర సంపూర్ణ ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేస్తామన్నారు. రాజకీయాల్లో ఫార్ములాలు పని చేయవన్న బాబు, పరస్పరం అర్థం చేసుకోవడమే ముఖ్యమన్నారు.

టీడీపీ,జనసేన, బీజేపీల మధ్య పొత్తు పొడిచింది- ఏపీ ప్రజల కోసం పనిచేస్తామన్న బీజేపీ

వైసీపీతో బీజేపీ నాయకత్వానికి ఎలాంటి అధికారిక అవగాహన, ఒప్పందం లేవన్న చంద్రబాబు, వ్యక్తిగత అవసరాల రీత్యా మద్దతిస్తూ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థంగా, క్రియాశీలకంగా పని చేసినప్పుడు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకోవడానికి వీలుంటుందన్నారు. ప్రజలు మద్దతు పలికి అధికారం కట్టబెట్టినా జగన్‌ ఏనాడూ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన మ్యాచింగ్‌గ్రాంట్‌ ఇవ్వలేక కేంద్ర పథకాల నిధులను ఉపయోగించుకోలేకపోయారన్నారు. తాము కేంద్రానికి ఎందుకు మద్దతిస్తున్నామన్నది భవిష్యత్తు చెబుతుందన్నారు.

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారన్న చంద్రబాబు, రాష్ట్ర పునర్నిర్మాణాన్ని కోరుకొనే ప్రతి ఒక్కరూ కూటమికి ఓటేస్తారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మైనారిటీలకు ఎలాంటి సమస్యా రాలేదన్న బాబు, ఉమ్మడి ఏపీలో ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడూ వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. తాము ఎన్డీఏలో చేరిన విషయాన్ని మైనారిటీలు అర్థం చేసుకుంటారన్న బాబు, తమకే ఓటేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తం సీట్లు గెలవడమే కూటమి లక్ష్యమన్న బాబు, ఇప్పుడు తాము పార్టీలను వేర్వేరుగా చూడటం లేదన్నారు. అందరూ కలిసి 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీచేస్తున్నట్లు భావిస్తున్నామన్నారు.

ప్రత్యర్థులూ ఆయన్ను గౌరవిస్తారు- బాబు విజనరీ లీడర్​ : అర్నాబ్ గోస్వామి

2019లో మినహా టీడీపీ ఎప్పుడూ బలంగానే ఉందన్న బాబు, గత ఎన్నికల ఫలితాలు దిగ్భ్రాంతికి గురి చేశాయన్నారు. ప్రజలు గత అయిదేళ్ల ప్రభుత్వ పాలనతో విసిగిపోయారన్న బాబు, ఇలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన తొలినుంచీ బలంగా పోరాడుతున్నాయని గుర్తుచేశారు. ఇప్పుడు వాటికి బీజేపీ తోడవడంతో సంపూర్ణ బలం వచ్చినట్లయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం పట్ల తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉండటంతోపాటు, ప్రజల్లో భయం, నిరాశా నిస్పృహలు అలుముకున్నాయన్నారు. తాను నేరాలు చేస్తూ ఎదుటివారిపై ఆరోపణలు చేయడం జగన్‌ నైజమన్న చంద్రబాబు, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం ఏదో చేశామని తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. వాటన్నింటినీ విభిన్న సమయాల్లో కోర్టులు విచారించి కొట్టేశాయన్నారు. కానీ వాటిపైనే పదేపదే అబద్ధాలు మాట్లాడటం జగన్‌కు అలవాటైపోయిందన్నారు.

కూటమి పక్షాల మధ్య ఓటు బదిలీ సమస్య కాబోదన్న బాబు, ప్రజలు చాలా తెలివైనవారన్నారు. అన్నీ అర్థం చేసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి వల్ల రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందనేది తాము చెబుతామన్న చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోదీ, తాను దూరదృష్టితో ఆలోచిస్తామని ప్రజలు భావిస్తున్నారన్నారు. తాము ఈ రోజు గురించి మాట్లాడటం లేదని, రేపటి కోసం ఏం చేయాలన్నదానిపై ముందుకెళ్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నేను గెలిచి రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేకపోతే ఆ అధికారానికి అర్థమేముంటుందని ప్రశ్నించిన చంద్రబాబు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని పైకి తీసుకురావడానికి అందరి మద్దతు అవసరమన్నారు.

ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ - సీట్ల సర్దుబాటుపై కుదిరిన అవగాహన

రాష్ట్ర పునర్నిర్మాణం ఉమ్మడి బాధ్యత కాబట్టి అందరి సహకారం తీసుకోవాలన్నదే త ఉద్దేశమని తెలిపారు. కేంద్ర మద్దతుతోనే జగన్‌ తనను అరెస్టు చేయించారని భావించడం లేదన్న చంద్రబాబు, అలాగైతే జీ20 సమావేశాలు ప్రారంభమైనరోజే ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. బుద్ధి ఉన్న ఏ నాయకుడూ ఆ పని చేయడని, కానీ జగన్‌ చేశాడని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆ సమయంలో తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారన్న చంద్రబాబు, యోగక్షేమాల గురించి వాకబు చేశారన్నారు. అరెస్టును పురందేశ్వరి, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ లాంటి బీజేపీ నేతలంతా ఖండించారన్నారు.

'కలిసి పని చేయండి - పరస్పరం సహకరించుకోండి' - పార్టీ నేతలతో చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.