ETV Bharat / politics

రాష్ట్రంపై మరోసారి కేంద్రం చిన్నచూపు- బడ్జెట్‌లో అత్తెసరు కేటాయింపులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 7:13 AM IST

Updated : Feb 2, 2024, 10:40 AM IST

Allocations_for_AP_Railway_Projects_in_Central_Budget
Allocations_for_AP_Railway_Projects_in_Central_Budget

Allocations for AP Railway Projects in Central Budget: కేంద్ర బడ్జెట్‌లో ఏపీలోని రైల్వే ప్రాజెక్ట్‌లకు కేటాయింపులను పరిశీలిస్తే.. రాష్ట్రంపై కేంద్రానికి ఉన్న చిన్నచూపు ఇట్టే అర్థమవుతుంది. కీలకమైన రాజధాని అమరావతిని అనుసంధానించే కొత్త రైల్వేలైన్‌కు వెయ్యి రూపాయలు, విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న రైల్వేజోన్‌కు 9 కోట్ల రూపాయల కేటాయిపులు ఉన్నాయి. 30 మంది వైఎస్సార్సీపీ ఎంపీలు సాధించిన నిధులు ఇవే. కేంద్రంపై పోరాడి నిధులు తెచ్చుకోలేని దౌర్భాగ్యపరిస్థితిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంది.

రాష్ట్రంపై మరోసారి కేంద్రం చిన్నచూపు- బడ్జెట్‌లో అత్తెసరు కేటాయింపులు

Allocations for AP Railway Projects in Central Budget: రాజధాని అమరావతిని విజయవాడ గుంటూరుకు అనుసంధానించే కొత్త రైల్వేలైన్‌కు బడ్జెట్‌లో కేటాయించింది అక్షరాల వెయ్యి రూపాయలు మాత్రమే. 2వేల 679 కోట్ల రూపాయల వ్యయమయ్యే ఈ కొత్త లైన్‌ నిర్మాణానికి గత ఐదేళ్లలో కేటాయించింది కేవలం రూ. 2.20 కోట్లు మాత్రమే. అది కూడా కేవలం భూ సర్వే కోసం ఉపయోగించారు.

రాజధానిని అనుసంధానించే కీలకమైన రైల్వే లైన్‌కు కేవలం వెయ్యి రూపాయలు కేటాయించారంటనే.. కేంద్రం మన రాష్ట్రానికి ఇస్తున్న ప్రాధాన్యం ఎంటో అర్థమవుతుంది. 30 మంది వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రంపై పోరాడి సాధించిన నిధులు ఇవే. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా జోన్ కార్యాలయాలకు 170 కోట్ల రూపాయల వ్యయం కానుండగా.. ఇప్పుడు కేటాయించింది కేవలం రూ.9 కోట్లు మాత్రమే.

టార్గెట్ లక్షద్వీప్- బాలికలకు క్యాన్సర్ వ్యాక్సినేషన్- వారికీ ఆయుష్మాన్​ భారత్​- బడ్జెట్​లో కీలక ప్రకటనలివే!

కీలకమైన కొన్ని రైల్వే ప్రాజెక్ట్‌లకు మొక్కుబడిగా నిధులు కేటాయించగా.. మరికొన్నింటికి మొండిచేయి చూపింది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు సాధించడంలో వైఎస్సార్సీపీ ఎంపీలు మరోసారి విఫలమయ్యారు. కొన్నింటికి మొక్కుబడిగా ఇవ్వగా.. అత్యధిక ప్రాజెక్టులకు మొండిచేయి చూపింది. కేంద్రంపై ఒత్తిడి తీసు కొచ్చి ఎక్కువ నిధులు సాధించడంలో జగన్ ప్రభుత్వం, వైఎస్సార్సీపీ ఎంపీలు మరోసారి విఫలమయ్యారు.

మొత్తంగా రాష్ట్రంలోని దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు, తూర్పుకోస్తా రైల్వేలోని వాల్తేరు డివిజన్‌కు కలిపి బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ. 9,138 కోట్లు మాత్రమే. లోక్‌సభ, రాజ్యసభలో కలిపి 31 మంది వైఎస్సార్సీపీ ఎంపీలున్నా.. రాష్ట్రానికి పెద్దఎత్తున రైల్వే నిధులను రాబట్టలేకపోయారు. విశాఖలో జోన్ కార్యాలయానికి సిద్ధంగా ఉన్నామని రైల్వేశాఖ చెబుతుంటే.. దానికి భూమిని అప్పగించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.

దీంతో కేంద్రం అత్తెసరు నిధులతో సరిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వాటా వెచ్చిస్తుందో తెలపాలని రైల్వేశాఖ కోరుతున్నా.. జగన్ ప్రభుత్వం మౌనం వహిస్తుండటంతో కేంద్రం కూడా పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో కేవలం రూ.9 కోట్లు మాత్రమే కేటాయించింది. కొన్ని రైల్వే ప్రాజెక్ట్‌లకు కేటాయించిన కేటాయిపులు చూస్తే.. అసలు వాటిని పట్టాలెక్కించే ఉద్దేశం లేదని అర్థమవుతుంది.

వందేభారత్ స్థాయిలో రైలు బోగీలు- పెరగనున్న ఛార్జీలు! జనరల్​ కోచ్​ల పరిస్థితేంటి?

కాకినాడ-పిఠాపురం, మాచర్ల- నల్గొండ, కంభం-ప్రొద్దుటూరు, గూడూరు-దుగరాజపట్నం లైన్లకు కేవలం వెయ్యి రూపాయల చొప్పున కేటాయించారు. కొండపల్లి-కొత్తగూడెం లైన్‌కు రూ.10 లక్షలు, భద్రాచలం-కొవ్వూరు లైన్‌కు రూ.10 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. జగ్గయ్యపేట -మేళ్లచెరువు కొత్త లైన్‌కు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కడప-బెంగళూరు లైన్‌కు 10 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

నడికుడి-శ్రీకాళహస్తి మార్గం అంచనా విలువ 2,643 కోట్ల రూపాయలు కాగా ఈ బడ్జెట్‌లో రూ.450 కోట్లు కేటాయించారు. కోటిపల్లి-నర్సాపురం కొత్త లైన్ అంచనా వ్యయం రూ.2,120 కోట్లు కాగా రూ.300 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో రెండు, మూడు లైన్లకు ఇవ్వనున్న నిధులు మాత్రమే ఆశాజనకంగా ఉన్నాయి. కాజీపేట-విజయవాడ మూడో లైన్‌కు రూ.310 కోట్లు, విజయవాడ-గూడూరు మూడో లైనుకు రూ.500 కోట్లు, గుంటూరు-గుంతకల్లు రెండో లైన్‌కు రూ.283.50 కోట్లు, గుంటూరు-బీబీనగర్ రెండో లైన్‌కు రూ.200 కోట్లు కేటాయించారు. కర్నూలు వ్యాగన్ మరమ్మతుల కేంద్రానికి రూ.115 కోట్లు ఇవ్వనున్నారు.

మధ్యతరగతికి గూడు- యథాతథంగా పన్నులు- తాయిలాలు లేకుండా మధ్యంతర బడ్జెట్

Last Updated :Feb 2, 2024, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.