ETV Bharat / opinion

ఏంటీ ఎన్నికల బాండ్లు? ఎందుకు రాజ్యాంగ విరుద్ధం? ప్రజాస్వామ్యానికి అంత నష్టమా?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 5:27 PM IST

electoral bonds supreme court
electoral bonds supreme court

What is Electoral Bond : రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. బాండ్ల విక్రయాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఇంతకీ ఎలక్షన్ బాండ్లు అంటే ఏంటి? ఎన్నికల బాండ్ల విషయంలో పారదర్శకతకు విఘాతం కలిగే అంశాలేంటి? ఎన్నికల బాండ్ల ద్వారా ఎవరికి లాభం? సుప్రీం తీర్పుతో ఇకపై బాండ్ల పరిస్థితి ఏంటి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

'రాజ్యాంగ విరుద్ధం
వాక్ స్వేచ్ఛ, సమాచార హక్కులకు విఘాతం'
-ఎన్నికల బాండ్లు చట్టబద్ధం కాదని తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు ప్రయోగించిన శక్తిమంతమైన పదాలు

'నోట్ల కంటే ఓట్ల శక్తే ఎక్కువని తేలింది'
'ప్రజాస్వామ్యంలో ఉన్న సమస్య పరిష్కారమైంది'
-ఎన్నికల బాండ్లపై సుప్రీం తీర్పు అనంతరం విపక్షాలు, నిపుణుల స్పందన ఇది

What is Electoral Bond : ఎన్నికల బాండ్ల ద్వారా అనేక సమస్యలు ఉన్నాయని చాలా కాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలు, న్యాయకోవిదులు, ప్రజాస్వామ్య సంస్థలు ఎన్నికల బాండ్లకు వ్యతిరేకంగా తమ గళమెత్తి పోరాడుతున్నాయి. వాటి వల్ల లాభం కంటే నష్టమే అధికంగా ఉందని ఆరోపిస్తున్నాయి. ఇంతకీ ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏంటి? దీంతో ఉన్న సమస్యలేంటి? ప్రజా హక్కులకు ఇది ఏ విధంగా భంగం కలిగిస్తోంది? దీని వల్ల ఎన్నికల ప్రక్రియకు వచ్చిన నష్టమేంటో చూద్దాం.

ఏంటీ ఎలక్షన్ బాండ్లు?
ఎన్నికల బాండ్ అంటే రాజకీయ పార్టీలకు డబ్బు డొనేట్ చేసేందుకు వీలు కల్పించే పత్రం. ప్రామిసరీ నోటు తరహాలో దీన్ని జారీ చేస్తారు. కేంద్రంలోని మోదీ సర్కారు 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. భారత్​కు చెందిన వారు ఎవరైనా (వ్యక్తులు/సంస్థలు) ఎన్నికల బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) శాఖల నుంచి కొనుగోలు చేయవచ్చు. రూ.వెయ్యి, రూ.10వేలు, రూ.లక్ష, రూ.10లక్షలు, రూ.కోటి విలువైన బాండ్లను కొనుగోలు చేసే వీలు ఉంటుంది. వీటిని తమకు నచ్చిన రాజకీయ పార్టీకి విరాళంగా ఇవ్వవచ్చు. ఒక వ్యక్తి/కంపెనీ ఎన్ని ఎలక్టోరల్ బాండ్లనైనా కొనుగోలు చేయవచ్చు. వీటిని స్వీకరించిన రాజకీయ పార్టీలు 15 రోజుల్లోగా ఎన్​క్యాష్ చేసుకోవాలి. ఆ గడువు దాటితే బాండ్​ విలువ మొత్తం ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్​కు బదిలీ అవుతుంది. ఈ స్కీమ్ ద్వారా నిధులు అందుకునే పార్టీలు దాతల పేర్లు, వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఎన్నికల సంఘానికి ఏటా సమర్పించే నివేదికలో దాతల వివరాలు పొందుపర్చాల్సిన అవసరం లేదు.

పారదర్శకతకు పాతర!
రాజకీయ పార్టీలు రూ.20వేలకు మించి నగదు రూపంలో సేకరించే విరాళాల వివరాలు కచ్చితంగా బహిర్గతం చేయాల్సి ఉంటుంది. కానీ, ఎన్నికల బాండ్ల విషయానికి వస్తే అలాంటి నిబంధన ఏదీ లేదు. ఎన్నికల బాండ్ల విరాళం మొత్తం ఎంత పెద్దదైనా ఆ వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఇది పారదర్శకతకు విఘాతం కలిగిస్తుందని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్- ఏడీఆర్) వంటి సంస్థలు సహా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజల హక్కులకు భంగం
దేశ పౌరుల ప్రాథమిక హక్కు అయిన సమాచార హక్కు చట్టాన్ని సైతం ఇది అతిక్రమిస్తుంది. ఎన్నికల బాండ్లు పౌరులకు ఎలాంటి వివరాలను అందించవని ఏడీఆర్ పేర్కొంది. ప్రభుత్వం నుంచి వివరాలు అడిగి తెలుసుకునేందుకు వీలు కల్పించే సమాచార హక్కు చట్టాన్ని ఇది నీరుగారుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అవినీతి అరికట్టడమే లక్ష్యంగా ఎన్నికల బాండ్లు తెచ్చినట్లు కేంద్రం చెబుతోంది. అదే అసలైన లక్ష్యమైతే సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడం ఏమాత్రం సమర్థనీయం కాదని సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో తేల్చి చెప్పింది.

గోప్యత కొందరికే!
ఎన్నికల బాండ్ల వివరాలు పౌరులకు అందుబాటులో లేకున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం వాటిని సులభంగా యాక్సెస్ చేయవచ్చనేది ఓ వాదన. బాండ్లు కొనుగోలు చేసిన దాతల వివరాలు ఎస్​బీఐ వద్ద ఉంటాయి. కాబట్టి, ఆ వివరాలను కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడైనా పొందవచ్చని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. పెద్ద మొత్తంలో బాండ్లు కొనుగోలు చేసిన వారిని కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని కొందరి ఆందోళన.

దీనిపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పథకం గోప్యత, విశ్వసనీయత కొందరికే పరిమితం అవుతోందని సుప్రీంకోర్టు గతేడాది నవంబర్​లో పేర్కొంది. 'ఎస్​బీఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా అధికారంలో ఉన్న వారు తెలుసుకోగలరు. ఏ రాజకీయ పార్టీకి, ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది చూడగలరు. అదే విపక్షంలో ఉన్న వారికి అటువంటి అవకాశం లేదు' అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

అధికార పార్టీకే లాభం- విపక్షాలకు నష్టం
ఎన్నికల బాండ్లు అధికార పార్టీకే లాభం చేకూర్చేలా ఉన్నాయని ఏడీఆర్ వాదిస్తోంది. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం 2018 నుంచి 2022 మార్చి మధ్య ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు పొందిన మొత్తం విరాళాల్లో 57 శాతం బీజేపీకే వెళ్లాయి. ఎన్నికల బాండ్ల ద్వారా ఈ కాలంలో బీజేపీ రూ.5,271 కోట్లు విరాళాలు సేకరించగా- రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ రూ.952 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఎన్నికల బాండ్ల ద్వారా విపక్ష పార్టీలకు విరాళాలు ఇస్తే తమను కేంద్రం లక్ష్యంగా చేసుకుంటుందన్న భయాలు కొందరు దాతల్లో ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఎన్నికల బాండ్ల ద్వారా ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయంటే?

  • * రూ.16 వేల కోట్లు- ఇప్పటివరకు విక్రయించిన ఎన్నికల బాండ్ల విలువ
  • * రూ.12వేల కోట్లు- 2018 నుంచి గత ఆర్థిక సంవత్సరం వరకు రాజకీయ పార్టీలు అందుకున్న బాండ్ల మొత్తం
  • * రూ.2,360 కోట్లు- 2022-23లో బీజేపీ మొత్తం ఆదాయం (ఎన్నికల బాండ్ల ద్వారా రూ.1300 కోట్లు)
  • * రూ.452 కోట్లు- 2022-23లో కాంగ్రెస్ ఆదాయం (బాండ్ల ద్వారా రూ.171 కోట్లు)

వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న సమయంలో ప్రాంతీయ పార్టీలు ఎన్నికల బాండ్ల ద్వారా పొందిన విరాళాలు (2022-23లో)

  • * టీఎంసీ- రూ.325 కోట్లు
  • * బీఆర్ఎస్- రూ.529 కోట్లు
  • * డీఎంకే- రూ.185 కోట్లు
  • * బీజేడీ- రూ.152 కోట్లు

విపక్షంలో ఉన్న పార్టీలు బాండ్ల ద్వారా పొందిన వివరాలు (2022-23లో)

  • * టీడీపీ- రూ.34 కోట్లు
  • * సమాజ్​వాదీ- సున్నా
  • * శిరోమణి అకాలీదళ్- సున్నా

విక్రయించే అధికారమూ కేంద్రం చేతుల్లోనే!
నిబంధనల ప్రకారం ఎన్నికల బాండ్లను స్టేట్ బ్యాంక్ మాత్రమే విక్రయించాలి. దీనిపై కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఎస్​బీఐ ప్రభుత్వ అధీనంలోని సంస్థ కాబట్టి బాండ్లను విక్రయించే అధికారం సైతం పరోక్షంగా కేంద్రం చేతుల్లో ఉంటుందనేది మరో వాదన.

కంపెనీల చట్టాల్లో మార్పులు- అన్​లిమిటెడ్ డొనేషన్లు!
ఎన్నికల బాండ్లు ప్రవేశపెట్టిన సమయంలో కంపెనీ చట్టంలోనూ మార్పులు చేసింది మోదీ సర్కార్. కార్పొరేట్ డొనేషన్లపై ఉన్న పరిమితిని తొలగించింది. రాజకీయ పార్టీలకు అపరిమిత విరాళాలు ఇచ్చేందుకు వీలు కల్పించింది. అంతేకాకుండా, భారత్​లోని రాజకీయ పార్టీలకు విదేశీ కంపెనీలు విరాళాలు ఇవ్వకూడదన్న నిబంధనను తొలగించింది. దేశంలోని అనుబంధ సంస్థల ద్వారా పార్టీలకు విరాళాలు ఇచ్చే అవకాశం కల్పించింది. ఇది లాబీయింగ్​ను చట్టబద్ధం చేసేలా ఉందని ఏడీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది.

అవినీతి భయాలు- మనీలాండరింగ్
కంపెనీల చట్టానికి చేసిన మార్పుల ద్వారా అవినీతి పెరుగుతుందని ఏడీఆర్ హెడ్, విశ్రాంత మేజర్ జనరల్ అనిల్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. నగదు అక్రమ రవాణా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 'దాతల గోప్యత సమస్యాత్మకంగా ఉంది. ఎవరు డొనేట్ చేస్తున్నారో మనం చెప్పలేం. డొనేట్ చేసిన వారు పెద్ద కార్పొరేట్ కంపెనీ కూడా అయ్యుండొచ్చు. షెల్ కంపెనీల ద్వారా ఆ డబ్బును తరలించి ఉండొచ్చు. ఈ కంపెనీలు ప్రభుత్వాల నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేస్తాయి. ఈ డొనేషన్​ను ఆ కంపెనీలు పెట్టుబడిగానే భావిస్తాయి. ఈ విధానం అవినీతిని చట్టబద్ధం చేసింది. సంస్థాగత అవినీతికి ఆజ్యం పోసింది' అని ఆయన ఆరోపించారు.

కాగా, సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో కంపెనీ చట్టానికి చేసిన మార్పులను తప్పుబట్టింది. ఆదాయ పన్ను చట్టం, ప్రజా ప్రాతినిధ్య చట్టం, కంపెనీల చట్టానికి చేసిన మార్పులు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్లు పార్టీలకు అధికారికంగా ముడుపులు ఇచ్చే సాధనంగా మారకూడదని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఎన్నికల్లో అక్రమ సొమ్ము- ప్రజాస్వామ్యానికే ముప్పు!
'అధికారంలో ఉన్నది ఎవరైనా ఆ పార్టీకే అధిక విరాళాలు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండాలన్న విధానానికి ఇది భంగం కలిగిస్తుంద'ని ఏడీఆర్ హెడ్ అనిల్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న పార్టీ తనకు వచ్చిన అధిక నిధులతో ఎన్నికల్లో సమర్థంగా పోరాడగలుగుతుందని, వీరితో పోలిస్తే విపక్షాలు ఆర్థికంగా వెనుకబడతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన స్వేచ్ఛాయుత ఎన్నికల విధానానికి వ్యతిరేకంగా మారుతుందని వాదిస్తున్నారు.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇకపై బాండ్ల సంగతేంటి?
"ప్రాథమికంగా చూస్తే ఎన్నికల బాండ్ల ద్వారా దాతలకు శాసనకర్తలతో బంధం ఏర్పడుతుంది. విధానపరమైన నిర్ణయాలను ప్రభావితం చేసే వీలు కల్పిస్తుంది. రాజకీయాలకు, డబ్బుకు ఉన్న సంబంధాన్ని బట్టి గమనిస్తే ఇది 'క్విడ్ ప్రో కో' (ఒకటి ఇచ్చి మరొకటి ప్రతిఫలంగా పొందడం)కు దారితీస్తుంది" అని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?

  • ఎస్​బీఐ వెంటనే ఎన్నికల బాండ్ల విక్రయాలు ఆపేయాలి.
  • 2019 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆర్డర్ తర్వాత నుంచి బాండ్లు కొనుగోలు చేసిన వివరాలు ఎన్నికల సంఘానికి ఎస్​బీఐ సమర్పించాలి.
  • ఆ తేదీ నుంచి ఏ రాజకీయ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయో ఎస్​బీఐ వెల్లడించాలి. మూడు వారాలు అంటే మార్చి 6లోగా వివరాలు సమర్పించాలి.
  • విరాళాలు స్వీకరించి ఎన్​క్యాష్ చేసుకోని బాండ్లు (15 రోజుల గడువు ఉన్నవి) రాజకీయ పార్టీల వద్ద ఉంటే- వాటిని వెంటనే దాతలకు వెనక్కి ఇవ్వాలి. ఎస్​బీఐ ఆ బాండ్ల మొత్తాన్ని కొనుగోలుదారులకు ఇచ్చేయాలి.

సుప్రీంకోర్టు తీర్పుపై ఎవరు ఏమన్నారంటే?
'నోట్ల కంటే ఓట్ల శక్తే ఎక్కువ'

"సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. నోట్ల కంటే ఓట్ల శక్తే ఎక్కువ అని ఈ తీర్పు చాటి చెప్పింది. మోదీ సర్కారు సుప్రీంకోర్టు మాట విని భవిష్యత్​లో ఇలాంటి చెడు ఆలోచనలు చేయకుండా ఉంటే మంచిది. అలాగైతేనే ప్రజాస్వామ్యం, పారదర్శకత, పోటీలో సమానత్వం కాపాడుకున్నట్లవుతుంది."
-కాంగ్రెస్

'సమస్య పరిష్కారమైంది'
"గత 5-7 ఏళ్లలో సుప్రీంకోర్టు నుంచి మనకు లభించిన అత్యంత చారిత్రక తీర్పు ఇదే. ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొప్ప వరం. ఈ విషయంలో మేమంతా కొన్నేళ్లుగా ఆందోళన చెందుతున్నాం. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవారంతా దీని రద్దు గురించి పోరాడారు. నేనూ ఎన్నో కథనాలు రాశా. మీడియాతో మాట్లాడా. ఇక మేము లేవనెత్తిన ప్రతి సమస్య న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పుతో పరిష్కారం అయ్యింది."
-ఎస్​వై ఖురేషి, భారత మాజీ ప్రధాన ఎన్నికల కమీషనర్​

'సుప్రీంకోర్టు ఇచ్చిన ఏ తీర్పునైనా గౌరవించాల్సిందే'
"మోదీ నాయకత్వానికి ప్రత్యామ్నాయం లేదని గ్రహించి విపక్షాలు దీన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నాయి. మోదీని ఢీకొట్టేందుకు ఏర్పాటు చేసిన కూటమి ఆదిలోనే అంతమవుతున్న నేపథ్యంలో విపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నాయి. దశాబ్దాలుగా ఉన్న అవినీతి సమస్యను పరిష్కరించడానికి, ఎన్నికల్లో అక్రమ సొమ్ము ప్రవేశించకుండా చేసేందుకు ఓ స్కీమ్ (ఎన్నికల బాండ్లు) వచ్చింది. ఈ ఫార్మాట్​లో పథకం వచ్చి ఉండాల్సింది కాదని సుప్రీం అభిప్రాయపడింది. అందుకే దానికి అనుగుణంగా తీర్పు చెప్పింది. ఎన్నికల బాండ్ల సమాచారం బహిర్గతం చేయాలనే సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఏ తీర్పు, ఆదేశం ఇచ్చినా అంగీకరించాల్సిందే."
-బీజేపీ

సౌత్​ Vs నార్త్​- చిచ్చు పెట్టిన 'జనాభా' రూల్- కొత్త ఆర్థిక సంఘం 'న్యాయం' చేస్తుందా?

ద్రవిడ పార్టీలకు చెక్! తమిళనాడులో మల్టీస్టారర్ బొమ్మ- అందరి టార్గెట్ '2026'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.